జూదగాళ్లను పరుగులు పెట్టించిన డ్రోన్
12 అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి 1.62లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
మూడో కంటికి తెలియకుండా చెట్ల పొదల్లో జూదం ఆడుతున్న జూదగాళ్లను డ్రోన్ పరుగులు పెట్టించింది. జూదం ఆడుతున్న వారిని డ్రోన్ ద్వారా గుర్తించిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా స్థావరం వద్దకు చేరుకోవడంతో ఒక్క సారిగా షాక్ గురైన జూదగాళ్లు కాళ్లకు బుద్ది చెప్పారు. పోలీసులు పట్టుకుంటారేమో అని పంటపొలాలను తొక్కుకుంటూ పరుగులు తీశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం, సంగం జాగర్లమూడి గ్రామంలో చోటు చేసుకుంది. జూదగాళ్లను వెంటాడేందుకు ఈ మధ్య కాలంలో గుంటూరు పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామం రైల్వేట్రాక్ సమీపంలోని చెట్ల పొదలను కొందరు వ్యక్తులు జూదానికి అడ్డాగా చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఈ చెట్లపొదల్లో జూదమాడుతున్నారు.
సమచారం అందుకుకున్న తెనాలి గ్రామీణ పోలీసులు వారి మీద దృష్టి సారించారు. ఎస్సై ఆనంద్ తన సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాతో నిఘా ఉంచారు. దీనిని గమనించని జూదగాళ్లు ఎప్పటిలాగే ఆడేందుకు జూదగాళ్లు చెట్లపొదల్లోకి జమయ్యారు. దాదాపు 17 మంది జూదగాళ్లు జమయ్యారు. కొద్ది సేపటి తర్వాత డ్రోన్ను చూసిన జూదగాళ్లు అక్కడ నుంచి పరుగులు తీశారు. పంట పలాలను తొక్కుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిని గుర్తించిన పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకోగా, మరో ఐదుగురు పరారయ్యారు. చిక్కిన వారి నుంచి రూ. 1,62, 450 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జూదగాళ్ల మీద కేసు కూడా నమోదు చేశారు.