దాసరి పేరుతో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్ చేసింది.;
దర్శకరత్న దాసరి నారాయణరావు 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆద్వర్యంలో తాడేపల్లి లోని వారి కార్యాలయ ప్రాంగణంలో దాసరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ దాసరి లాంటి గొప్ప దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం తెలుగు చిత్ర పరిశ్రమ చేసుకొన్న అదృష్టమని, అన్ని కోణాలలో సినిమాలు తీయగలిగిన ప్రతిభ ఆయనకొక్కడికే సొంతమని అందుకే చిత్ర పరిశ్రమ మరువలేని ఎన్నో గొప్ప చిత్రాలను ప్రేక్షకులకు అందించాడని, స్వతహాగా ఆయన గొప్ప మనసున్న మనిషని ఆయనతో తనకున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఛాంబర్ సెక్రటరీ జేవీ మోహన్ గౌడ్ మాట్లాడుతూ దాసరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దర్శకుడిగా, రచయితగా, నటుడిగా తనదైన ప్రతిభను చాటుకున్న గొప్ప వ్యక్తి అని, కేవలం దర్శకుడిగానే కాకుండా చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించే పెద్ద దిక్కుగా ఆయన అందరికి అండగా నిలిచారని, ఆయన లేనిలోటు తెలుగు చిత్రపరిశ్రమలో లోటుగానే మిగిలి పోయిందని, అలాంటి గొప్ప వ్యక్తికి గౌరవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సినీ నంది అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ గా ఇచ్చే అవార్డుకు ఆయన పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరుపున డిమాండ్ చేస్తున్నామని, ఈ విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మంత్రికి, ఎఫ్డీసీకి లేఖ రాస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఛాంబర్ ట్రెజరర్ యం శ్రీనాథరావు, ఈసీ మెంబర్ రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ పిచ్చిరెడ్డి, ఛాంబర్ సభ్యులు పరిటాల రాంబాబు, అమ్మా రమేష్, జర్నలిస్ట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.