తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణాలను తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి

అసంపూర్తిగా ఉన్న వాటికి చర్యలు తీసుకొని నందమూరి తారక రామారావు ఆశయాన్ని నెరవేర్చాలని బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు.;

Update: 2025-05-02 10:18 GMT

తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణాలను, పంట కాలవలను తక్షణమే పూర్తి చేసి రుద్రవరం, చాగలమర్రి మండలలాలలోని చెరువులకు మరమ్మత్తులు చేపట్టి ఆయకట్టు సంరక్షించాలని ప్రజలకు త్రాగు నీరు అందించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ణప్తి చేసారు. శుక్రవారం నంద్యాల జిల్లా రుద్రవరం మండల తహశీల్దారు కార్యాలయం దగ్గర తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణాలను, పంట కాలువలను తక్షణమే చేపట్టాలని కోరుతూ తెలుగుగంగ ఆయకట్టు పరిరక్షణ సమితి ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..
రాయలసీమలో తాగు, సాగునీటి కోసం 80వ దశకంలో చేపట్టిన ‘‘కరువు బండ’’ ఉద్యమాన్ని గౌరవించి, ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాయలసీమకు తాగు, సాగు నీరు ఇస్తూ తెలుగుగంగ ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తుచేస్తూ.. శ్రీశైలం వెనుక జలాలను (బ్యాక్‌ వాటర్‌) మద్రాసు త్రాగు నీటికి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా అందజేయడంతో పాటు 29 టీఎంసీల కృష్ణా జలాలను కర్నూలు కడప జిల్లాలలో అనేక గ్రామాలకు త్రాగు నీరు, 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. పెన్నా జలాలను వినియోగించి నెల్లూరు జిల్లాలో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు, చిత్తూరు జిల్లాలో 0.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యం కూడా తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగానే చేపట్టారని తెలిపారు.
ఎన్టీఆర్‌ మానస పుత్రికగా పేర్కొంటున్న తెలుగంగ ప్రాజెక్టు నిర్మాణాలు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయనీ, తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక కీలకమైన నిర్మాణాలు చేపట్టడంలో, విధానాలను అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.దీనితో రాయలసీమకు తాగు, సాగు నీరు పూర్తిస్థాయిలో అందించాలన్న ఎన్టీఆర్‌ ఆశయాం కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుగంగ ప్రాజెక్ట్‌కు సంబందించిన కీలక అంశాలు..
1. శ్రీశైలం రిజర్వాయర్‌ కనీసం నీటిమట్టం 854 అడుగులు నిర్వహించకపోవడం.
2. వెలుగోడు రిజర్వాయర్‌ నీటి నిలువలు సమర్థవంతంగా వినియోగించుకొనడానికి చేపట్టవలసిన బైపాస్‌ కెనాల్‌ నిర్మాణం చేపట్టకపోవడం.
(తెలుగుగంగ ప్రాజెక్టు డిజైన్‌ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులో వరద సమయంలో వెలుగోడు రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిలువ చేసుకున్న నీటిని వినియోగించుకోకుండా, శ్రీశైలం రిజర్వాయర్‌ లో 854 అడుగులు ఉన్నంతవరకు తెలుగుగంగ పంట కాలువలకు, బ్రహ్మసాగర్‌ కు కృష్ణా జలాలను బైపాస్‌ కెనాల్‌ ద్వారా చేపట్టాలి. ఈ నిర్మాణాలు పూర్తి కానందున నేటి వరకు వెలుగోడు రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి అయిందన్న రిపోర్టును జలవనరుల శాఖ ప్రభుత్వానికి అందజేయలేదు).
3. వెలుగోడు రిజర్వాయర్‌ నుండి బ్రహ్మసాగర్‌ కు కృష్ణా జలాలను చేర్చే మద్రాసు కాలువ నిర్మాణాలను పూర్తి సామర్థ్యంతో చేపట్టకపోవడం, నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడం.
4. డిస్ట్రిబ్యూటరీస్, కాలువల, పంట కాలువల నిర్మాణాలు పూర్తి చేయకపోవడం. నిర్వహణ కూడా సక్రమంగా చేపట్టకపోవడం.
5. కాలువల ద్వారా ఆయకట్టుకు పారవలసిన నీటిని మోటర్ల ద్వారా ఎత్తిపోసుకోవలసిన పరిస్తితి ఉండటంతో ప్రతి పంట కాలంలో ఎకరాకు 20 నుండి 30 వేల రూపాయల అదనపు ఖర్చు రైతులు చేయవలసి రావడం.
6. బ్రహ్మసాగర్‌ ద్వారా 1.60 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు కడప జిల్లాలో నీరు అందవలసి ఉంటే 30 వేల ఎకరాల ఆయకట్టుకు కూడా నీరు లభించకపోవడం.
అదేవిధంగా రుద్రవరం మండలం, చాగలమర్రి మండలాలలో ఉన్న చెరువుల పరిస్థితి దమనీయంగా ఉందనీ ఈ చెరువుల కట్టలు బలహీనంగా ఉండడంతో, అధిక వర్షాలతో వరదలు సంభవిస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందన్న మనోవేదనలో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపధ్యంలో ఎన్టీ రామారావు ఆశయాలను నెరవేర్చే దిశగా తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణాలను, పంట కాలవలను తక్షణమే పూర్తి చెయ్యాలిని, చెరువుల మరమ్మత్తులు తక్షణమే చేపట్టి రాయలసీమ బాసటగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేసారు.
ధర్నా అనంతరం రుద్రవరం మండల తహశీల్దారు మల్లిఖార్జునరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు స్పందిస్తూ తెలుగుగంగ ఆయకట్టు పరిరక్షణకై రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని అదేవిధంగా తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులకు కూడా పంపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైయన్‌ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రామగురివిరెడ్డి, పార్థసారథి రెడ్డి, హరికృష్ణ, రామకృష్ణారెడ్డి, మహబూబ్‌ బాష, దేవానందరెడ్డి,ç ³ట్నం రాముడు, రవికుమార్‌ రెడ్డి, కొమ్మా శ్రీహరి, తిమ్మారెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, వీరబ్రహ్మానందరెడ్డి, మహేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News