ఈ నెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలి
టీడీపీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు.;
By : The Federal
Update: 2025-06-13 15:43 GMT
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, పథకాల అమలు విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సీఎం చంద్రబాబు శుక్రవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 12తో ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఏడాది పాలన గురించి, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల అమలు గురించి, ఏడాది పాలనలో తీసుకొచ్చిన మార్పులు, అమలు చేసిన పథకాల గురించి ప్రజల్లోకి వెళ్లి వారికి వివరించాలని ఆదేశించారు.
చేసిన మంచి పనుల గురించి ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కాకూడదని, అమలు చేసిన ప్రతి హామీని ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. దీంతో పాటుగా పార్టీ సంస్థాగత ఎన్నికలను కూడా పూర్తి చేయాలన్నారు. యోగాంధ్రను దృష్టిలో పెట్టుకొని పని చేయాలని దిశా నిర్థేశం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ టీడీపీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేసే దిశగా పని చేయాలని సూచించారు. యోగాంధ్రలో ఇప్పటి వరకు 2 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు. వైజాగ్ సముద్ర తీరం ఆర్కే బీచ్లో చేపట్టే యోగాంధ్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నేతలకు సూచించారు.