TDP Mahaanaadu | కడప లోకేష్ రెండో రాజకీయాధ్యాయానికి గడప అవుతుందా?
కడపలో నిర్వహించే తెలుగుదేశం పార్టీ (టిడిపి) ప్లీనరీ కీలక నిర్ణయాలకు వేదిక కానుంది. కడప నుంచే నారా లోకేష్ రాజీకీయప్రస్థానంలో కొత్త మలుపు అవుతుందా?;
By : SSV Bhaskar Rao
Update: 2025-05-26 09:01 GMT
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హోదా కడప సభల్లో మారిపోతుందని, ఆయనకు మరింత కీలక బాధ్యత అప్పగించేందుకు పార్టీ సన్నద్ధమవుతూ ఉందని చర్చ తెలుగు దేశంవర్గాల్లో వినపడుతూ ఉంది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆయనకు పార్టీలో కీలక పదవి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చిం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు నుంచి పార్టీ నేతల ఈ మేరకు తీర్మానం కూడా చేశారు.
రాయలసీమలో తిరుపతి తర్వాత కడపలో మొదటిసారి ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు టిడిపి ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాయలసీమ అభివృద్ధికి డిక్లరేషన్ పార్టీలో కీలక పదవిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సీనియర్ నాయకుల వ్యాఖ్యానాలు, తిరుపతిలో తీర్మానం స్పష్టం చేస్తున్నాయి. నిజానికి తెలుగుదేశం పార్టీలో లోకేష్ కు అడ్డేముంది. ఆయనకు ఏ పదవికావాలంటే ఆపదవి తండ్రిచంద్రబాబు నాయుడు ఇవ్వగలరు. దానిని ఎవ్వరు అడ్డుకోలేరు. దీనికోసం పార్టీని చాలా జాగ్రత్తగా దారికి తీసుకు వచ్చారు. పార్టీలో ఇపుడు తలనెరిసిన వీరు లెవరూ లేరు. అసలు 60కి పైగా ఉన్నవాళ్లు ఒకరిద్దరు మినహా ఎవ్వరు లేరు. 50 కి పైబడిని వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. లోకేష్ వయసులు 42 సంవత్సరాలు. పార్టీ నిండా క్యాబినెట్ నిండా లోకేష్ అజమాయిషీ పడకుండా వయసులు తప్పించుకునే వాళ్లేవరూ లేరు. పార్టీ పుట్టినప్పటినించి ఉన్న సీనియర్లు, ఆ తర్వాతి రౌండ్లో వచ్చిన సీనియర్ అంతా వెళ్లిపోయారు. ఒపుడు పార్టీలో ‘ లోకేష్ కోసం తీర్మానాలు చేసేవాళ్లు,లోకేష్ నాయకత్వం పార్టీ కిచారిత్రక అవసరం అనేవాళ్లతో నిండిపోయి ఉంది. ఆయన్ని డిప్యూటీ సిఎం చేయాలనే వాళ్లు, ఆయనే కాబోయే సిఎం అనేవాళ్లు పెరిగిపోయినా సమయంలో కడప సభలు జరుగుతున్నాయి.
మంత్రి నారా లోకేష్ కు ‘ప్రభుత్వంలో పదోన్నతి’ కొన్ని రాజకీయ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంది. ఈలోపు పార్టీలో ప్రమోషన్ కల్పించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం, తీసుకోబోయే నిర్ణయానికి కడప జిల్లా సాక్ష్యం కానుంది.
జనవరి నుంచి క్యాంపెయిన్
2025 జనవరి 18 న సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు పర్యటనకు వచ్చారు. ఆ వేదికపైనే టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ను డిప్యూటీ సిఎం చేయాలన్నారు. "యువతకు, పార్టీకి భరోసా ఇవ్వాలంటే మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయండి" అని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యాలు కూటమిలో చిచ్చు రేపాయి. దీనికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు మంత్రులు, అన్ని ప్రాంతాల నేతలు స్వరం కలిపారు. ఈ వ్యవహారం సాగుతుండగానే, సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి దావోస్ పర్యటనకు వెళ్లారు.
జనసేన శ్రేణులు కూడా తీవ్రంగా స్పందించాయి
"మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే, డిప్యూటీ సీఎం గా ఉన్న జనసేన చీఫ్ కొనిదెల పవన్ కళ్యాణ్ సీఎం చేయండి" అనే డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై ఎవరు నోరు మెదప వద్దు అని దావోస్ నుంచే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో ఈ వివాదం టీకప్పులో తుఫానులా చల్లబడింది.
తిరుపతిలో తీర్మానం
"టిడిపిలో నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి" అని ఇటీవల తిరుపతి జిల్లా మినీ మహానాడులో తీర్మానించారు.
" ఈ పదవికి మంత్రి లోకేష్ అర్హుడే" అని తిరుపతి టిడిపి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహయాదవ్ వ్యాఖ్యానించారు.
తిరుపతి జిల్లా మినీ మహానాడులో కూడా ఈ తీర్మానం చేశామని నరసింహయాదవ్ చెప్పారు. ఈ మహాసభలోనే ఉన్న టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, టీటీడీ బోర్డు సభ్యురాలు పొనబాక లక్ష్మి, టిడిపి తిరుపతి అసెంబ్లీ స్థానం ఇన్చార్జ్ ఎం సుగుణమ్మ, మాజీ మంత్రి పరసారత్నం తదితరులు కూడా మద్దతు పలికారు.
ఆయనకు మద్దతు ఆర్గ్యుమెంట్...
రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ నిర్వాహణ బాధ్యతలు ఒకరే నిర్వహించడం వల్ల జరిగిన నష్టం జరిగిందన్న వాదన మొదలయింది పార్టీలో,
"2004 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ వ్యవహారాలు వెనక పార్టీని సరిగా పట్టించుకోకపోవడం వల్లే. 2019 ఎన్నికల్లో పరాజయం ఓడిపోయాం" ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి పని విభజన జరగాల్సిన అవసరం ఉంది,” అని చాలా మంది అంటున్నారు.
కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సీఎం ఎన్. చంద్రబాబు పాలన వ్యవహారాలు చూసుకుంటే, పార్టీ నిర్వహణ బాధ్యతలు ఆయన కొడుకు నారా లోకేష్ పర్యవేక్షించే విధంగా విభజన జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఇందుకోసం నారా లోకేష్ కు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పని విభజనకు ఆస్కారం ఉంటుందనేది సీనియర్ల అభిప్రాయంగా కనిపిస్తోంది.
బాబు దూరదృష్టి
2024 ఎన్నికల్లో టిడిపి టికెట్లు ఇవ్వడంలో సీఎం చంద్రబాబు ముందుచూపుతోనే వ్యవహరించారు అనడంలో సందేహం లేదు. సీనియర్లను పక్కన ఉంచి, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
రాష్ట్రంలో 144 స్థానాల్లో పోటీ చేసిన టిడిపి 135 చోట్ల గెలిచింది. జనసేన 21, బిజెపి 10 సీట్లకు గాను ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారందరిలో 80 మంది మొదటిసారి గెలిచినవారు, అందులో యువత సంఖ్య ఎక్కువ. తన కొడుకు నారా లోకేష్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు టికెట్ల కేటాయింపులో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతుంది.
టిడిపి ఎమ్మెల్యేలు, అలాగే మంత్రుల్లో సగం మంది నారా లోకేష్ కు స న్నిహితంగా ఉన్నవారే అనేది పార్టీ వర్గాల సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆయనకు టిడిపిలో కీలక పదవి దక్కాలని కోరుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కడపలో నిర్వహించే టిడిపి మహానాడులో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మరో 48 గంటల్లో తేలిపోతుంది.