మహిళా క్రికెటర్ శ్రీ చరణికి భారీ నజరానా
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను కలిసిన శ్రీ చరణి
By : The Federal
Update: 2025-11-07 09:16 GMT
మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చ.గ. స్థలం, ఇంకా గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం ఇవ్వనున్నారు. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ను క్రికెటర్ శ్రీ చరణి మర్యాద పూర్వకంగా కలిశారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో శ్రీ చరణి పంచుకున్నారు. తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రీ చరణిని అభినందించి సత్కరించారు.
ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం అన్నారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలని అభిలషించారు. శ్రీ చరణితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టులో శ్రీ చరణికి ఘన స్వాగతం పలికిన మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు... ఆమెతో పాటు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ శ్రీ చరణికి స్వాగతం పలికారు.