స్ట్రీట్ లైట్స్ కు సొంతగా విద్యుత్ ఉత్పత్తి చేయాలి

ఏవిధంగా సాధ్యమో ఆలోచించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం;

Update: 2025-06-28 17:07 GMT

కార్పోరేషన్లల్లో స్ట్రీట్ లైటింగ్ కోసం సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి. దీని కోసం ఎలాంటి విధానాలు అవలంభించాలో ఆలోచించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శనివారం రాత్రి ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ అధికారులతో చర్చించారు. ఆ మేరకు చర్యలు తీసుకోండి. అలాగే విద్యుత్ పొదుపు మీదా దృష్టి సారించండి అంటూ ఆదేశాలు జారీ చేశారు.

మున్సిపల్ శాఖ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రగతి, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లో మౌలిక సదుపాయాల కల్పన, మెప్మా పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు వంటి అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కొన్ని సూచనలు చేశారు.

“వర్షాకాలం వస్తోంది. దోమలు పెరుగుతాయి.. డ్రైనేజీలు పొంగి పొర్లకుండా చూసుకోండి. నీరు కలుషితం కాకూడదు.. స్వచ్ఛమైన తాగు నీరు అనేది ప్రజలకు అందివ్వాలి. అంటు వ్యాధులు ప్రబలకూడదు. దోమల వల్లే వ్యాధులు వస్తాయి. దీన్ని నివారించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి.. కొన్ని ప్రాంతాల్లో పౌల్ట్రీవేస్ట్ వల్ల పరిసరాలు అపరిశుభ్రమవుతున్నాయి. పౌల్ట్రీ వేస్టును ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా.. ఓ పద్దతి ప్రకారం జరిగేలా చూడాలి. పౌల్ట్రీ వేస్ట్ కోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకురండి. దీనికి అవసరమైతే సర్క్యులర్ ఎకానమీని కూడా అనుసంధానం చేసుకోవచ్చేమో పరిశీలించండి.” అని సీఎం చంద్రబాబు సూచించారు.

ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యను పరిష్కరించండి

“మున్సిపల్ శాఖ పరిధిలోని ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి. గత ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ విధానాన్ని అస్తవ్యస్తం చేసేసింది. ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా నీటి శుద్ధి చేసే అంశంపై మరింతగా ఫోకస్ పెట్టి.. ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. లెగసీ వేస్ట్ అనేది మున్సిపాల్టీలకు.. ప్రజలకు భారంగా మారింది. లెగసీ వేస్ట్ కన్పించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు.. భవిష్యత్తులో చెత్తను ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకోవాలి.” అని చంద్రబాబు ఆదేశించారు.

కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు తేవాలి

“మున్సిపల్ శాఖ పరిధిలో కేంద్ర ప్రాజెక్టులు ఏమున్నాయో చూసుకుని.. మరిన్ని నిధులు ఏ విధంగా తీసుకురావాలనే అంశంపై దృష్టి సారించండి. ఈ మేరకు ఏమైనా బిల్లులు పెండింగ్ ఉన్నా.. యూసీల విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నా.. వాటిని ఆర్థిక శాఖతో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎం అన్నారు. ఆర్థిక శాఖ కూడా ఈ విషయంలో మున్సిపల్ శాఖకు సహకరించాలి. గత ప్రభుత్వం వివిధ పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి చాలా నిధులు రాలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి తలెత్తకూడదు. ఇప్పుడు ఏఐఐబీ నుంచి వచ్చిన రూ. 5,800 కోట్లు, స్వచ్ఛ భారత్ కింద వచ్చిన రూ. 3,000 కోట్ల పనులను వేగంగా జరిపించేలా చర్యలు తీసుకోవాలి. అమృత్, అమృత్-2, ఏఐఐబీ, యూఐడీఎఫ్ ప్రాజెక్టుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి.” అని చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మున్సిపల్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News