అసెంబ్లీ పక్కన అనెక్స్ భవనం–ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
మీడియా హాల్, డెనింగ్ హాల్, కిచెన్, ప్రభుత్వ చీఫ్ విప్ సహా ప్రభుత్వ విప్ల ఛాంబర్లు, వెంయింటింగ్ హాల్ ను ఏర్పాటు చేశారు.
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈభవనాన్ని అన్ని హంగులతో పునరుద్ధరించేందుకు సుమారు 5కోట్ల రూ.లు వ్యయం అవుతుందని అంచనా వేయగా ఈ–టెండరింగ్ విధానం ద్వారా కేవలం 3కోట్ల 57 లక్షల రూ.లకే నిర్మించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ ప్రాంగణంలో నిర్మించిన అనెక్స్ భవనాన్ని గురువారం రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణలతో కలిసి ప్రారంభించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో స్పీకర్ మాట్లాడుతూ ఈ భవనం గ్రౌండ్ ప్లోర్లో మీడియా సమావేశాలకు వీలుగా సుమారు 100 మంది మీడియా ప్రతినిధులు కూర్చునే విధంగా మీడియా హాల్, ఈహాల్ ను ఆనుకుని డైనింగ్ హాల్, కిచెన్ నిర్మించామన్నారు. అదే విధంగా మొదటి అంతస్తులో ప్రభుత్వ చీఫ్ విప్ సహా 16 మంది ప్రభుత్వ విప్ ల చాంబర్లను, ఒక వెంయింటింగ్ హాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈభవనంలో నిర్మాణాలను సకాలంలో కల్పించేందుకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ, రాష్ట్ర ఆర్ధిక, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎంతో సహకరించారని అదే విధంగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్,సిఆర్డిఏ అధికారులు నిరంతరం పర్యవేక్షించారని వారందరికీ కృతజ్ణతలు తెలియజేస్తున్నట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.