మావోయిస్టు అస్థికలు ఇవ్వకపోవడం ఏ హిందూ ధర్మం?
శ్రీకాకుళంలో మావోయిస్టు బసవరాజు సంతాప సభ;
గుండెకోట ఎన్కౌంటర్లో అమరుడైన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు సంతాపసభ ఈరోజు శనివారం శ్రీకాకుళం క్రాంతి భవన్ (సిపిఐ జిల్లా ఆఫీస్) లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన వివిధ వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. సభకు ముందు కేశవరావు చిత్ర పటానికి అమర వీరుల బంధు మిత్రసంఘం నాయకులు జోగి కోదండం పూల మాల వేసి సభ మౌనం పాటించింది. వేదిక పైకి వక్తల్ని సిపిఐ ఎంఎల్ న్యూడేమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ఆహ్వానించారు. ఈ సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న సిపిఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ మాట్లాడుతూ కా.నంబాల కేశవరావును మోదీ ప్రభుత్వం హతమార్చడమే కాకుండా కాక మృత దేహాన్ని గానీ, అస్తికలు, చితాభస్మం గానీ కుటుంబ సభ్యులకు యివ్వకపోవడం మోడీ ప్రభుత్వ అభద్రతనూ, భయభీతుల్ని వెల్లడి చేస్తోందన్నారు.
తాను హిందూ మత పక్షపాతిగా చెప్పుకునే మోదీ సర్కార్ హిందూ ధర్మం ప్రకారం కర్మకాండ చేసుకునే వీలు కూడా ఆ కుటుంబానికి లేకుండా చేయడం హిందూ మతం పట్ల వాళ్ళ కపట ప్రేమను వెల్లడిస్తోందన్నారు.
కేశవరావు, సుధాకర్ వంటి విప్లవ యోధుల్ని భౌతికంగా చంపిన సర్కార్ విప్లవ రాజకీయ శక్తుల్ని నిర్మూలించినట్లు మురిసిపోవడం భ్రమగా మిగలక తప్పదన్నారు. మృతదేహం గానీ, బూడిద గానీ లేకుండా చేసి కేవలం కేశవరావు ఫోటో పెట్టుకొని పెద్దకర్మ జరుపుకోవలసిన చర్య సమాజాన్ని చలింపజేసిందన్నారు.
ఈ ప్రభుత్వాల లక్ష్యం మన దేశ సంపదను సామ్రాజ్యవాదులు, కార్పొరేట్ కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు అప్పగించడమన్నారు. ఈ దేశం సంపదలను కాపాడు కొనుటకు కమ్యూనిస్టు విప్లవకార్లు పోరాడుతున్నారని వారిని తుదిముట్టించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ హత్యకాండకు దిగిందని అన్నారు. అణచివేతతో కమ్యూనిజాన్ని ఆపడం సాధ్యం కాదన్నారు. కేశవరావు, సుధాకర్ వంటి విప్లవకార్ల అమర స్మృతిలో కొత్త విప్లవ శక్తుల జననం రేపటి నిజమని అన్నారు.
ఈ అమరత్వం నేటి మన తరానికి మిగిల్చే దుఃఖం యువతరాన్ని రేపు కమ్యూనిజానికి అనుసంధానిస్తుందని ప్రసాద్ జోశ్యం చెప్పారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విదానాల్ని, కార్పొరేట్లని ప్రతిఘటించడానికి వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర వాదులు, ప్రజలు సంఘటిత పడతారని అన్నారు.
ఈ సభలో సిపిఐ పార్టీ నుండి కా.తిరుపతిరావు, సిపిఐ (యం) నుండి కె.మోహనరావు, సిపిఐ (యంయల్) నుండి కా.తాండ్ర అరుణ మాట్లాడుతూ తాము వేర్వేరు రాజకీయ పార్టీలకి చెందినా మోడీ సర్కార్ హత్యకాండకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడతామనన్నారు. భౌతికంగా ఈ సభకు హాజరుకాలేక పోయినా తమ భాగస్వామ్యం ఉన్నట్లు భావించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్, సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (SUCI) నాయకులు సందేశాలు పంపారు.
అమరవీరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర నాయుకులు జోగి కోదండం, సి యల్ సి జిల్లా అధ్యక్షలు పత్రి దానేసు, సామ్నా రాష్ట్ర నాయుకుడు నల్లి ధర్మారావు, ఇంకా దాసరి శ్రీరాములు తదితరులు మాట్లాడారు. మొదట ప్రజా కళాకారులు, అరుణోదయ కళాకార్లు పాడిన పాటలు రక్తి కట్టించాయి.