కార్ల్ మార్క్స్ ‘పెట్టుబడి’ ‘సిందూరం’మై మెరిసిన వేళ...

మానవజాతికి ఆయుధం ‘మార్క్సిజం’ అన్న వక్తలు;

Update: 2025-06-15 11:50 GMT

ఆర్థిక అసమానతలు, దోపిడీ ఉన్నంతకాలం మార్క్సిజం ఉంటుందని, మానవజాతికి మార్క్సిజం ఆయుధమని ప్రముఖ కవి బి ప్రసాదమూర్తి అన్నారు.

ఆదివారం  కర్నూలులోని కార్మిక కర్షక భవన్లో కవి ఉన్నం వెంకటేశ్వర్లు - ఉష లు రాసిన ‘సిందూరం’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి సభాధ్యక్షతన జరిగిన ఈ సభలో పుస్తకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. మార్క్సిజం అన్నది సైన్స్ అని, తాత్కాలిక అపజయాలు వున్నా చివరకు విజేతగా నిలుస్తుంది అన్నారు.

కార్ల్ మార్క్స్ రాసిన పెట్టుబడి పుస్తకాన్ని 'సిందూరం' పేరుతో కవిత్వంగా మలచడం అరుదైన విషయం అన్నారు. మార్క్సిజాన్ని వివరించడానికి ప్రపంచవ్యాప్తంగా వేల గ్రంధాలు ప్రపంచ భాషల్లో వచ్చాయని మార్క్సిజం ఈరోజు సమకాలీన సమాజానికి దగ్గర అయిందని, ఈ పుస్తకం సరళ భాషలో కూడా పెట్టుబడి గూర్చి రాశాడని అన్నారు. 


సభాధ్యక్షులు జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ మార్క్సిజం ప్రజల జీవన విధానాల్ని మరింత మెరుగుగా మారుస్తుందని అన్నారు. అసమానతలు లేని, అంతరాలు లేని మరో ప్రపంచమే మార్క్సిజమని అన్నారు.

ప్రముఖ కవి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఈ పెట్టుబడిదారీ సమాజంలో మార్క్సిజాన్ని సామాన్యజనంలోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.దేశకాల పరిస్థితుల్లో అనివార్యమన్నారు.

సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ మాట్లాడుతూ సాంస్కృతిక సామ్రాజ్యవాదం వేయి తలల విషనాగై ప్రజల జీవనాన్ని శాసిస్తున్నదని, కవులు కళాకారులు సామాజిక జీవిత సత్యాలను తమ సాహితీ ప్రక్రియలో రాయాలన్నారు. ఈ గ్రంథం పెత్తందారి అవినీతి వ్యవస్థలను, దోపిడీని నిలదీసిందన్నారు.

ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తిత్వాన్ని శ్రమైక జీవన సౌందర్యాన్ని పెంపొందించేలా కవి సిందూరం పుస్తకంలో కవిత్వీకరించారని అన్నారు. సభలో సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ మాట్లాడుతూ మార్క్సిజం పునాదుల పైన దేశ భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మహాకవి శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి అతిథులు జోహార్లు అర్పించారు.సభలో విరసం నాయకులు పాణి, నాగేశ్వరాచారి, సాహితీ స్రవంతి జిల్లా నాయకులు పులిచేరి మహేష్ కుమార్, విజయులు తనగల, మధు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పాటి, జిల్లా నాయకులు హేమంత్ కుమార్, యెహోషువ, దొంతుల రాములు, రాయలసీమ యూనివర్సిటీ డాక్టర్. అరుణ యూనివర్సిటీ డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు నగేష్, జిల్లా నాయకులు హుస్సేన్, ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి, అరసం జిల్లా నాయకులు సయ్యద్ జహీర్ అహ్మద్, ఆధ్య మెడికల్స్ అధినేత ఏవి రెడ్డి, కథాసమయం తెలకపల్లి మధుసూదన శర్మ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News