చంద్రబాబుపై కేసును క్లోజ్ చేయొద్దు..వైసీపీ పిటీషన్
ఏపీ ఫైబర్నెట్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. డిసెంబర్ 8న విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ ప్రాజెక్టు అక్రమాల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన ఈ కేసును మూసివేయొద్దంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌతమ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గత నెల 26న క్లోజ్ చేసిన ఈ కేసును పునరుద్ధరించే అవకాశం ఏర్పడింది. ఈ పిటిషన్పై ఏసీబీ స్పెషల్ కోర్టు డిసెంబర్ 8వ తేదీన విచారణ చేపట్టనుంది.
2017-18లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏపీ ఫైబర్నెట్ ఫేజ్-1 ప్రాజెక్టులో రూ.114 కోట్ల నష్టం జరిగిందని 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ కేసు నమోదు చేసింది. టెండర్లలో అక్రమాలు, బ్లాక్లిస్ట్లో ఉన్న కంపెనీకి పనులు కేటాయించడం వంటి ఆరోపణలతో చంద్రబాబును 2023 అక్టోబర్లో ఈ కేసులో అక్క్యూజ్డ్ నంబర్-25గా చేర్చారు.
2024 ఎన్నికల తర్వాత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్నెట్ తదితర కేసులను ఒక్కొక్కటిగా మూసివేస్తోంది. ఇదే క్రమంలో నవంబర్ 26న ఏసీబీ కోర్టు ఫైబర్నెట్ కేసును అధికారికంగా క్లోజ్ చేసింది. రాష్ట్రానికి నష్టం జరగలేదని, మొదటి కంప్లైనెంట్ అయిన మాజీ ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా కేసు మూసివేతకు అంగీకరించారని కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి కేసు మూసివేతను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కేసు క్లోజ్ చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని, న్యాయాన్ని కాలరాస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. డిసెంబర్ 8న జరగబోయే విచారణ ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించనుంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం హాట్ టాపిక్గా మారింది.