పీజీ కోర్సుల్లో ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్ ఖరారు
7 క్లినికల్ సబ్జెక్టుల్లో 15%, నాన్ క్లినికల్ సబ్జెక్టుల్లో 30% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.;
By : The Federal
Update: 2025-08-04 15:00 GMT
2025–26 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యుల రిజర్వేషన్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిందని, ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 2028–29 సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్లినికల్, నాన్ –క్లినికల్ స్పెషలిస్టుల అవసరాలను, ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ కోటా విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2025–26 సంవత్సరంలో జరిగే పీజీ వైద్య విద్య కోర్సుల్లో జరిగే ప్రవేశాలల్లో 7 క్లినికల్ సబ్జెక్టుల్లో.. అంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్స్, గైనకాలజీ, ఎనస్తీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్, రైడియాలజీ కోర్సుల్లో ప్రభుత్వ పిహెచ్సీ వైద్యులకు 15%రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రవేశాలు జరిగే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయో కెమిస్ట్రీ, ఏనాటమీ, ఫిజియాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, సోషల్ – ప్రివెంటివ్ మెడిసిన్ వంటి 9నాన్ – క్లినికల్ కోర్సుల్లో 30%రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
1144 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే 2288 వైద్యుల ఆశలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ పై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఆరుగురు ఉన్నతాథికారుల కమిటీ 2028–29 సంవత్సరంలో స్పెషలిస్ట్ ల అవసరం పై మదింపు చేసి వివిధ విభాగాల్లో అవసరాలను గుర్తిస్తూ నివేదిక ఇచ్చిందని మంత్రి వివరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా (ప్రభుత్వ కోటా ) కింద లభించే 50% పీజీ కోర్సుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ కోటా మేరకు ప్రభుత్వ వైద్యులకు ప్రవేశాలు లభించనున్నట్లు తెలిపారు. 15%రిజర్వేషన్ ప్రకారం 7 క్లినికల్ విభాగాల్లో 154 సీట్లు, 9 నాన్ –క్లినికల్ విభాగాల్లో 30%రిజర్వేషన్ మేరకు 118 సీట్లు ప్రభుత్వ వైద్యులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ విథంగా మొత్తం 272 సీట్లను ప్రభుత్వం పీహెచ్సి వైద్యులకు కేటాయించిందన్నారు.
ప్రభుత్వ వైద్యుల డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఈ సంవత్సరం జరిగే ప్రవేశాల్లో.. మూడవ రౌండ్ కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత మిగిలిన సీట్లను ఇతరులకు కేటాయిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ పీహెచ్సిల్లో 3 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వైద్యులు పీజీ కోర్సుల్లో రిజర్వేషన్ కోటాలో ప్రవేశాలు పొందేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు.