రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణం నీరు విడుదల చేయాలి
జలవనరుల శాఖకు లేఖ రాసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి;
By : V V S Krishna Kumar
Update: 2025-06-24 08:34 GMT
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తక్షణమే రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది.ఎగువన వర్షాల కారణంగా శ్రీశైలం రిజర్వాయర్ కు నీటి ప్రవాహం మొదలై 857 అడుగులకు స్థాయికి చేరింది.ఈ నేపధ్యంలో పోతిరెడ్డిపాడు, మల్యాల ఎత్తిపోతల పథకాల నుండి రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటి విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తోందని రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదల చేయాలని కోరుతూ కర్నూలు జలవనరుల శాఖ ఛీఫ్ ఇంజనీర్ కు లేఖను పంపారు. ఆ వివరాలను సాధన సమితి నాయకులతో కలిసి మీడియాకు వివరించారు.భారీ వరదలన నుండి శ్రీశైలం ప్రాజెక్టును రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందని బుజ్జా అన్నారు. వరదలు వచ్చిన వెంటనే గేట్లు ఎత్తి శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని సముద్రంలోకి వదిలిన సందర్భాలు చాలా ఉన్నాయనీ.. దిగువకు నీరు తరలిపోయిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీశైలం నుండి నీరు పొందడం గగనం అవుతోందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ ను వరదల నుండి రక్షించడానికి, రాయలసీమ తాగు సాగునీటి అవసరాలను తీర్చడానికి, తక్షణమే పోతిరెడ్డిపాడు, మల్యాల ఎత్తిపోతల పథకం నుండి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలని కోరారు.
ఈ సంవత్సరం వర్షాలు కూడా అధికంగా ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ప్రధానంగా కేసీ కెనాల్, తెలుగు గంగ, ఎస్ ఆర్ బి సి ఆయకట్టు కింద ఒక లక్ష ఎకరాలకు పైగా పొలాలలో మొక్కజొన్న, సోయాబీన్, మినుము తదితర ఆరుతడి పంటలను రైతులు సాగు చేశారన్నారు. వాతావరణ శాఖ అంచనాలకు విరుద్ధంగా రుతుపవనాల గమనం మందగించడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పంటలను కాపాడుకోవడానికి ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని బొజ్జా ప్రభుత్వాన్ని కోరారు.కెసి కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు బెక్కం రామసుబ్బారెడ్డి, ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, వై.యన్.రెడ్డి తదితరులు ఈ సమావేశంలోపాల్గొన్నారు.