ప్రజల సూచనల మేరకే రాజీనామా చేస్తున్నా..
రాయచోటి రాయుడు కొడుకు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-07 05:21 GMT
ఉమ్మడి కడప జిల్లా రాయచోటి సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగువాసి పాలకొండ రాయుడు కొడుకు సుగవాసి బాలసుబ్రమణ్యం శనివారం పార్టీకి రాజీనామా చేశారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన ఏకవాక్యంతో రాజీనామా లేఖ పంపించారు. టీడీపీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని రాయచోటి రాయుడు కుటుంబం వీడింది.
"ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను" అని బాలసుబ్రమణ్యం రాజీనామా లేఖ రాశారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. రాయచోటి పెదరాయుడుగా సుపరిచితుడు సుగవాసి పాలకొండ రాయుడు. ఆయన రాజకీయ వారసుడిగా కొడుకు బాలసుబ్రమణ్యం రంగ ప్రవేశం చేశారు. కడప జెడ్పీ వైస్ చైర్మన్, ఆ తర్వాత టిటిడి బోర్డు సభ్యుడుగా కూడా ఆయనకు టిడిపి ప్రభుత్వంలో అవకాశం దక్కింది.
తటస్థంగా..
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుగవాసి బాలసుబ్రమణ్యం పార్టీ కార్యక్రమాలకు తటస్థంగానే ఉంటున్నారు. రాయచోటి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓ విడత ఎంపీగా గెలిచిన సీనియర్ నేత సుగువాసి పాలకొండ రాయుడు అనారోగ్యంతో మే 6వ తేదీ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంలో కూడా పార్టీ అధిష్టానవర్గం పట్టనట్లు వ్యవహరించడం కూడా రాయుడు కొడుకు బాలసుబ్రమణ్యం కినుక వహించడానికి దారితీసింది.
"నియోజకవర్గంలో తనను ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారు" అని కూడా సుగవాసి బాలసుబ్రమణ్యం బాహటంగానే విమర్శించారు.
రాజంపేటలో ఓటమి
2024 ఎన్నికల్లో సమీకరణల నేపథ్యంలో సుగువాసి బాలసుబ్రమణ్యంకు రాయచోటి టికెట్ దక్కలేదు. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని టిడిపి భావించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ స్థానం బిజెపికి కేటాయించారు. దీంతో బాలసుబ్రమణ్యంను రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించారు. ఈ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, ఆయన మద్దతుదారులు సహాయ నిరాకరణ చేశారు. టిడిపిలోనే రెండు వర్గాలుగా ఏర్పడి, అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజుతో కూడా విభేదాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టిడిపి అభ్యర్థి బాలసుబ్రమణ్యం ఓటమి చెందారు. దీనిపై ఆయన స్పందిస్తూ,
"జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ తన ఓటమికి కారణం. వైసిపికి పరోక్షంగా సహకరించారు" అని ఆరోపించారు. ఎన్నికల తర్వాత నుంచి పార్టీ కార్యకలాపాలకు సుగువాసి దూరంగా ఉంటున్నారు.
రాయచోటి రాయుడు
రాయచోటి అసెంబ్లీ స్థానంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఆ తర్వాత బలిజ (కాపు) సామాజిక వర్గాలు ఇదే కీలక పాత్ర. ఈ రెండు సామాజిక వర్గాల తో పాటు మిగతా వారి అభిమానాన్ని చూరగొనడంలో మాజీ ఎమ్మెల్యే, ఎంపీ సుగవాసి పాలకొండ రాయుడు అజాతశత్రువుగా మెలిగారు.
రాయచోటి నుంచి 1978లో పాలకొండ రాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచారు అంటే జనంతో ఎంతలా మమేకం అయ్యారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 1984లో రాజంపేట ఎంపీగా పోటీ చేయించడానికి ఎన్టీ రామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 1999 తర్వాత కాంగ్రెస్ హవా జోరుగా ఉన్నప్పటికీ 2004 ఎన్నికల్లో పాలకొండ రాయుడు టిడిపి అభ్యర్థిగా రాయచోటి నుంచి విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు.
ఇంతటి రాజకీయ నేపథ్యంతో సుగవాసి పాలకొండరాయుడు రాయచోటిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
రాజకీయంగా తొక్కేస్తున్నారు..
రాయచోటి సుగవాసి పాలకొండ రాయుడు మరణం తర్వాత తమకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆయన కొడుకు సుగువాసి బాలసుబ్రమణ్యం ప్రధాన ఆరోపణ.
"నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టడమే కాదు. మా కుటుంబం మొత్తం పనిచేసింది" అని బాలసుబ్రమణ్యం గుర్తు చేశారు.
"ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్తగా వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. రాజకీయంగా నన్ను అణిచివేస్తున్నారు" అని కూడా బాలసుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపికి విశేష సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పాలకొండ రాయుడు మరణిస్తే, ఆ పార్టీ పెద్దలు రాకపోవడం కూడా బాలసుబ్రమణ్యం అసంతృప్తికి కారణమని రాయచోటిలో ప్రచారం జరిగింది. రాయచోటి రాయుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్ కూడా నివాళులు అర్పించడానికి రాలేదనే వ్యాఖ్యానాలు వినిపించాయి.
మహానాడుకు దూరం..
కడపలో ఇటీవల టిడిపి మహానాడు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్లీనరీకి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు వారసులు బాలసుబ్రమణ్యం, ప్రసాద్ బాబు కూడా దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన వారికి లభిస్తున్న ప్రాధాన్యత మా కుటుంబానికి లేకుండా పోయిందనిది బాలసుబ్రమణ్యం ఆవేదనకు కారణమని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు.
రాయచోటి నియోజకవర్గం లో ఊహించని విధంగా సీనియర్ నేత కొడుకు బాలసుబ్రమణ్యం టిడిపికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. రాజీనామా లేఖను టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఒకే వాక్యంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలు వైసీపీకి అనుకూలించే వాతావరణం ఉన్నట్లు భావిస్తున్నారు. సమీప కాలంలో ఎన్నికలు లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది వేచి చూడాల్సిందే.