రాయచోటి : నాన్నా నాకెందుకీ శిక్ష..
భర్త కోసం తల్లి మౌనదీక్ష చేపట్టింది, పది నెలల బిడ్డ ఫాదర్స్ డేకు దూరమయ్యాడు. తల్లి భుజంపై సేదదీరుతూ కనిపించాడు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-15 16:57 GMT
ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడు. బిడ్డ పుట్టిన తరువాత కాదన్నాడు. ఆయన కుటుంబం కూడా పట్టించుకోని స్థితిలో భర్త కోసం ఓ మహిళ మౌనపోరాటం చేపట్టింది. నెలల బిడ్డ ఫాదర్స్ డేకి దూరం అయ్యాడు. తల్లి దీక్షకు దిగిన వేళ, ఆ పసిబిడ్డ తల్లిభుజంపై సేదదీరుతూ కనిపించాడు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) రాయచోటి నియోజకవర్గం వీరబల్లె మండలం మట్లి పంచాయతీ బత్తినవాండ్లపల్లలో ఆదివారం కనిపించింది.
రాయచోటి వద్ద భర్త ఇంటి ముందు చంటిబిడ్డతో దీక్షకు దిగిన సౌజన్య
భర్త కోసం ఆ మహిళ రావడంతో ఇంటికి తాళం వేసి, అందరూ కనిపించకుండా పోయారు. ఈ వివరాల్లోకి వెళితే..
లక్కిరెడ్డిపల్లె మండలం కస్తూరాజుగారిపల్లె గ్రామం చాగల గుట్టపల్లె కు చెందిన వడ్డెర సామాజికవర్గానికి చెందిన సౌజన్య కథనం ఇది. వీరబల్లి మండలం మట్లి గ్రామం బత్తినవాండ్లపల్లికు చెందిన మహేశ్వరరెడ్డితో ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. రెండేళ్ల కిందట హైదరాబాద్ కు వెళ్లిపోయి, పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. మా ప్రేమకు గుర్తుగా 10 నెలల బాబు అని చెప్పింది.
వరకట్నం కోసం ఒత్తిడి
తన భర్త మహేశ్వరరెడ్డి మేనమామ నుంచి ఇబ్బందులు ఏర్పడ్డాయని సౌజన్య ఆరోపిస్తోంది. తల్లిదండ్రులు, మేనమామ మాటలతో తనను అదనంగా కట్నం తీసుకు రమ్మని భర్త మహేశ్వరరెడ్డి ఒత్తిడి చేశారని ఆమె చెబుతోంది. తాను వడ్డెర కులానికి చెందిన మహిళ కావడంతో మహేశ్వరరెడ్డి కుటుంబీకులు అనుమతించడం లేదని కూడా ఆమె చెప్పింది. పోలీసులను ఆశ్రయించినా, న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
మౌన పోరాటం
తనను భర్త వద్దకు చేర్చాలని డిమాండ్ చేస్తూ 10 నెలల కొడుకుతో సౌజన్య భర్త స్వగ్రామం బత్తినవాండ్లపల్లికు పుట్టినింటి వారితో కలిసి ఆదివారం వచ్చింది. భర్తఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. వారి రాకను గమనించిన మహేశ్వరరెడ్డి, ఆయన కుటుంబీకులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. తనను భార్యగా అంగీకరించే వరకు కదిలేది లేదని సౌజన్య తెగేసి చెప్పింది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది వేచిచూడాల్సిందే. పోలీసులు జోక్యం చేసుకుంటేనే సమస్య సామరస్యంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.