రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకోవచ్చు
65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.;
లబ్ధిదారులు రైస్ కార్డు నమోదైన డీలర్ దగ్గరే కాకుండా.. వారి నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పిఠాపురం గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడి వీధిలో చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరకుల పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇంటింటికీ రేషన్ పేరిట గత ప్రభుత్వం దాదాపు రూ.1700 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసిందని, రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీతో దాదాపు రూ.385 కోట్ల ప్రజా ధనం ఆదా అవుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పని చేయాలని సూచించారు. రేషన్ షాపులను పునః ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,761 రేషన్ షాపుల్లో 24,795 షాపులు ఆదివారం ఉదయం నుంచి సరుకుల పంపిణీని ప్రారంభించాయన్నారు.
ఆదివారాల్లోనూ సరుకుల పంపిణీ ఉంటుందన్నారు. ప్రతి నెలా 1 నుంచి 15 తేదీలోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయన్నారు. గతంలో మాదిరి వాహనం కోసం పనులు మానుకుని ఇళ్ల వద్దే ఉండాల్సిన అవసరం లేదన్నారు. వీలున్న సమయంలో రేషన్ దుకాణాల దగ్గరకు వెళ్లి సరకులు తెచ్చుకోవచ్చు. దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకు ప్రతి నెలా 5వ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దే అందిచేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా 15.6 లక్షల మంది ఉన్నారని, వారికి ఇంటి వద్దకెళ్లి రేషన్ అందించే బాధ్యత రేషన్ దుకాణాదారులదే అని వెల్లడించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశామని, రేషన్ డెలివరీ అయిన వెంటనే అందులో ఫోటో అప్ లోడ్ చేసేలా డీలర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.