ప్రొఫెసర్ సాయిబాబని చావులోకి నెట్టిందెవరు?

కేంద్ర ప్రభుత్వం సాగించిన రాజ్యహింసే ప్రొఫెసర్ సాయిబాబ అకాల మరణానికి కారణమంటున్న విశాఖ పౌర ప్రజాసంఘాల వేదిక

By :  Admin
Update: 2024-10-13 14:20 GMT

ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబ అకాల మరణవార్త పలు పట్ల విశాఖపట్నంలోని పలు  పౌర ప్రజా సంఘాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.

నిజమైన పోరాట యోధుని స్ఫూర్తితో సాయిబాబా జైలులో ప్రభుత్వం పెట్టిన కష్టాలన్నింటిని  భరించాడని చెబుతూ ఆయన మరణం తో ప్రజలు  గొప్ప విప్లవ మేధావిని, నిజమైన స్నేహితుడిని, పోరాట యోధుడిని కోల్పోయారని ఈ సంఘాలు ఒక ప్రకటలో పేర్కొన్నాయి. ఆయన మరణం పౌర ప్రజాస్వామిక ఉద్యమానికి తీరనిలోటని ఈ సంఘాలు పేర్కొన్నాయి.

ఆదివారం పౌర ప్రజాసంఘాల సమన్వయకర్త పాత్రపల్లి చంద్రశేఖర్ అధ్యక్షత జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యల్లో భాగంగానే ప్రొఫెసర్ సాయిబాబ మరణం. ఆయన పోరాట స్ఫూర్తితో అన్ని శక్తులు ఐక్యమై ప్రభుత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే ప్రొఫెసర్ జి.యన్. సాయిబాబకు అందించే నిజమైన నివాళి అని వక్తలు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో విశాఖ మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం కన్వీనర్ జె వి సత్యనారాయణమూర్తి, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు, భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీరామ్ మూర్తి, విదసం ఐక్యవేదిక అధ్యక్షులు బూసి వెంకట్రావు, పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు ఎస్ వెంకటలక్ష్మి, ఏయూ రిటైర్డ్ ఉద్యోగి ఏడుకొండలు, న్యాయవాది కేఎస్ చలం, అరసం నాయకులు ఎం పైడిరాజు, భారత నాస్తిక సమాజం ప్రతినిధులు జీడి సారయ్య, రామ్ ప్రభు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నాగభూషణరావు, ఏఐటీయూసీ నాయకులు వామనమూర్తి, కూడా వజ్రం, వి నల్లయ్య ఎన్ ఆదినారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిన బూనారు. సాయిబాబా ఫోటోకి పూలదండ వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పౌర ప్రజాసంఘాల వేదిక విడుదల చేసిన ప్రకటన 

ప్రొఫెసర్ సాయిబాబ మృతికి పౌర ప్రజా సంఘాల వేదిక ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తోంది. సాయిబాబా నిర్దోషిగా విడుదలైన కేసులో సుదీర్ఘ జైలు జీవితం అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. 90 శాతం వికలాంగుడైనప్పటికీ, అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలో కూడా అతనికి రాజ్యం బెయిల్ ఇవ్వలేదు.
ప్రొఫెసర్ జి.యన్. సాయిబాబ మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా 10 ఏండ్లు నాగపూర్ జైల్ లోని అండా సెల్ లో పెట్టి , క్రూరంగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను బాధించింది. తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సాయిబాబకు నిర్బంధ కాలంలో ఎలాంటి వైద్య సౌకర్యం కల్పించలేదు.
మానసికంగా ఒత్తిడికి గురి చేసింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి పోవడానికి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దుర్మార్గ పద్ధతులే కారణం. దీని ఫలితంగానే నేడు సాయిబాబాకు మరణం దాపురించింది. దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జైల్ లో ఉన్న కాలంలోనే తన తల్లి మరణించినా కనీసం కడ చూపు కూడా చూడనివ్వకుండా ఈ ఫాసిస్టు ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించింది.




Tags:    

Similar News