గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి

2026 జనవరి కల్లా ఎడమ కాలువ పనులు పూర్తి కావాలి అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Update: 2025-10-03 12:32 GMT

గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమతులు తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు జారీ చేశారు. డయాఫ్రం వాల్‌ మొత్తం 63,656 క్యూబిక్‌ మీటర్లకు గానూ 37,302 క్యూబిక్‌ మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. బట్రస్‌ డ్యామ్‌ పనులు వందశాతం పూర్తి అయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్‌ పనులు కూడా 74 శాతం మేర పూర్తైనట్టు సీఎంకు తెలియచేశారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్‌ పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్‌ ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనుల్ని నవంబరు 1 నుంచే ప్రారంభించాలని.. 2027 డిసెంబరుకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పోలవరం కుడి కాలువను అనుసంధానించే సొరంగాల నిర్మాణం, ఎడమ కాలువకు అనుసంధానం చేసేలా అప్రోచ్‌ ఛానల్, హెడ్‌ రెగ్యులేటర్, ఇరిగేషన్‌ టన్నెల్, కేఎల్‌ బండ్‌ లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన ఎడమ కాలువను 2026 జనవరి నాటికల్లా అనకాపల్లి వరకూ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహార, పునరావాసాన్ని నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.
దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం వద్ద పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టు నుంచి భద్రాచలం, పాపికొండలు, దిగువన ధవళేశ్వరం వరకూ వివిధ ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ కింద ఐకానిక్‌ రోడ్డు నిర్మించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనిని జాతీయ రహదారికి అనుసంధానించేలా చూడాలన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్‌కు అనుసంధానించాలని సూచించారు. వచ్చే వర్షాకాల సీజన్‌లోగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
Tags:    

Similar News