Polavaram | బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరం అవుతుందా?

రాష్ట్రానికి పోలవరం - బనక చర్ల ప్రాజెక్టు గుదిబండ. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని పీసీసీ నేత ఆందోళన వ్యక్తం చేశారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-07 07:43 GMT
పోలవరం ప్రాజెక్టు (ఫైల్)

కమీషన్ల కోసమే పోలవరం - బనక చర్ల ప్రాజెక్టు చేపట్టాలని టీడీపీ కూటమి ఆరాటపడుతోందని రాజ్యసభ మాజీ సభ్యులు, పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులు, ప్రమాదం అంచుల్లో ఉన్న శ్రీశైలంను గాలికి వదిలేసిన ప్రభుత్వం తీరు చూస్తుంటే... "సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వ వైఖరి అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుంది" అని వ్యాఖ్యానించారు.


కడప జిల్లా వేంపల్లిలో శనివారం ఆయన మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడారు. శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మత్తులకు రు 300 కోట్లు విడుదల చేయని కారణంగా శ్రీశైలం డ్యాం ప్రమాదపు అంచుల్లోకి చేరిందని తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్లలో రు. 15,000 కోట్లు ఖర్చు పెడితే పెండింగ్ లో ఉన్న వెలిగొండ,తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా,అన్నమయ్య,ఫించా, ఝరికోన లాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి అయి రాష్ట్రం సస్య శ్యామల మవుతుందే విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన టీడీపీ కూటమి తీరును విమర్శించారు. నిధులు లేని కారణంగా వీటిలో కొన్ని ఎక్కడ చేసిన గొంగళి అక్కడే అన్న చందంగా,మరికొన్ని నత్తకు నడక నేర్పుతూ ఉన్నాయి.
ఈ తహతహ ఎందుకు?

పెండింగ్ ప్రాజెక్టులను గాలికి వదిలేసిన సీఎం ఎన్. చంద్రబాబు రు 81,900 కోట్లతో పోలవరం - బనక చర్ల ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవాలని తహతహలాడడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టులో 10 లిఫ్టులు, మూడు టన్నెల్లు ఉంటాయి. టన్నెల్ పొడవు 38.01 కిలోమీటర్లు, 4000 మెగా వాట్ల విద్యుత్ అవసరం.47,900 ఎకరాల భూమి సేకరించాలి.ఇందులో 17000 ఎకరాలు అటవీ భూమి.
మూడు దశల్లో చేపడుతారట. మొదటి దశలో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజి వరకు, రెండో దశలో ప్రకాశం బ్యారేజి నుంచి బొల్లా పల్లి రిజర్వాయర్ వరకు, మూడవ దశలో బొల్లా పల్లి రిజర్వాయర్ నుంచి బనక చర్ల భూ సేకరణ అని ప్రభుత్వం చెబుతోందన్నారు.
అనుమతి లేకుండానే..
బనకచర్ల ప్రాజెక్టు ఖర్చుకు సంబంధించి 50 శాతం అంటే, రు. 40,950 కోట్లు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెప్పడాన్ని తులసిరెడ్డి గుర్తు చేశారు. 20 శాతం (16,380 కోట్లు) కాంట్రాక్టర్ భరించి తర్వాత రైతుల నుంచి రాబట్టుకోవాలనడం విడ్డూరంగా ఉందని తులసిరెడ్డి విమర్శించారు. 20 శాతం కేంద్రం,10 శాతం రాష్ట్రం భరిస్తాయిన సీఎం చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు పర్యావరణ ,అటవీ,వన్య ప్రాణి సంరక్షణ శాఖ,కేంద్ర జల సంఘం,కృష్ణా నదీ యాజమాన్య బోర్డు,గోదావరి నది యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవనే విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయినా టెండర్లు పిలవాలని చంద్ర బాబు ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు.
కమీషన్ల కక్కుర్తి కోసమే
పోలవరం - బనక చర్ల మరో కాళేశ్వరం అవుతుంది.ఇది విఫల ప్రయోగం అని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం శాశ్వతంగా అప్పుల ఊబిలో కూరుకుపోవడం తథ్యం అని ఆయన జోశ్యం చెప్పారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి వుంటే ముందు పెండింగ్ లో ఉన్న వెలిగొండ,గాలేరు నగరి, హంద్రీ నీవా,తెలుగు గంగ,అన్నమయ్య తదితర ప్రాజె క్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసి తర్వాత పోలవరం - బనక చర్ల లాంటి ప్రయోగాలు చేయాలని తులసి రెడ్డి టిడిపి కూటమి ప్రభుత్వానికి సూచించారు.

Similar News