జగన్పై ఆంక్షలు మొదలయ్యాయి
18న పల్నాడు జిల్లాలో చేపట్టనున్న జగన్ పర్యటనకు పోలీసులు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశారు.;
By : Vijayakumar Garika
Update: 2025-06-17 05:25 GMT
ఇటీవల పొదిలి ఘటన ప్రభావం వైఎసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన మీద పడింది. పొదిలి పర్యటనలో చోటు చేసుకున్న అపశ్రుతి కారణంగా జగన్ పర్యటనలకు ఆంక్షలతో కూడిన అడ్డంకులు మొదలయ్యాయి. అయితే వీటిపైన వైసీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలా స్పందిస్తారు.. అనుమతుల కోసం కోర్టులను ఆశ్రయిస్తారా.. పోలీసులు సూచిస్తున్న ఆంక్షలను మీరి పర్యటనలను నిర్వహిస్తారా అనే అంశాలను పక్కన పెడితే.. ఈ నెల 18న బుధవారం పల్నాడు జిల్లా పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చేందేకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఈ నెల 18 బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామంలో పర్యటించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. రెంటపాలకు చెందిన వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జూన్ 6న ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేకనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని నేటికీ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరణించిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు అదే గ్రామంలో ఏర్పాటు చేసుకున్న నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జగన్ బుధవారం వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో జగన్ పర్యటనకు అనుమతులను కోరుతూ సత్తెనపల్లి వైసీపీ ఇన్చార్జి సుధీర్ భార్గవ్రెడ్డి పోలీసులకు దరఖాస్తులు చేశారు. దీనిని పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అనుమతులు ఇచ్చేందుకు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమం గ్రామం బయట పెట్టుకున్నటై్టతే అనుమతులు ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తామని చెప్పారు. అయతే దీనికి మళ్లీ ఫ్రెష్గా దరఖాస్తులు చేసుకోవలసి ఉంటుందని, అలా చేసుకున్నటై్టతే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైసీపీ వాళ్లు కోరిన విధంగా అనుమతులు ఇవ్వలేమన్నారు. రెంటపాలలో నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకు దాదాపు 30 వేల మంది వైసీపీ శ్రేణులు తరలి వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అక్కడ అంత జనాభా పట్టే ప్రదేశం లేదని, విగ్రహావిష్కరణ జరిగే ప్రాంతానికి కేవలం పది అడుగుల రోడ్డు మాత్రమే ఉందని, దీనికి తోడు రోడ్డుకు ఇరువైపుల ఇళ్లున్నాయని, కాబట్టి వంద మంది కంటే ఎక్కువ మంది వెళ్లడానికి అక్కడ అవకాశం లేదని, ఎక్కువ మంది జనాభా రావడం వల్ల ఇటువంటి ప్రదేశాల్లో దుర్ఘటనలు జరిగిన సందర్భాలు గతంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో జగన్ కాన్వాయ్తో పాటు మరో మూడు వాహనాలకు, జగన్తో సహా వంద మందికి మాత్రమే వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేయగలుగుతామని చెప్పొకొచ్చారు.
వైసీపీ నేతలు కోరుతున్న ప్రదేశం చాలా చిన్నదిగా, నారోగా ఉంది. పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రౌడ్ను మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎక్కువ సంఖ్యలో జనాభా తరలి వస్తే తొక్కిసలాటలు కూడా జరిగే అవకాశం ఉంది. దీని వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జగన్ తన రెంటపాల పర్యటనలో దాదాపు 76 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా వెళ్లాలని నిర్ణయించారు. అయితే దీనికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గిట్టని వాళ్లు అల్లరు సృష్టించే అవకాశాలు ఉంటాయి. అదర్ గ్రూప్స్ వాళ్లు నిరసనలు, ఆందోళనలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల తొక్కిసలాటలు వంటి ప్రమాదాలు జరిగేందుకు చాన్సులు ఉన్నాయి. దీంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇలా తలెత్తే సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వైసీపీ వాళ్లు కోరిన విధంగా అనుమతులు ఇవ్వలేక పోతున్నాము అంటూ పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 18న చేపట్టే జగన్ పర్యటన మీద పోలీసులు చెబుతున్న కారణాలు, ఆంక్షలతో కూడిన అనుమతుల మీద వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.