అమరావతి భూసమీకరణపై పవన్ మాట మారిందా?

అప్పుడు ఇంతెందుకన్నారు.ఇప్పుడు మరో 44వేల ఎకరాల భూసేకరణకూ ఉపముఖ్యమంత్రిగా ఓకే చెప్పారు.;

Update: 2025-06-26 16:13 GMT

PAWAN KALYAN & CHANDRABABU

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను మార్చుకుంటున్నారా?ప్రతి అంశంలోనూ సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారా..?జనసేన అధినేత గతంలో పలు అంశాలపై చెప్పిన మాటలు ఎలావున్నా..ఇప్పుడు అమరావతి అదనపు భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయానికే తలూపడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారం చేపట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ తన సొంత అభిప్రాయాలను పక్కనబెట్టి ఇంచుమించు చంద్రబాబు నిర్ణయాలనే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.అందరూ ఇదే చర్చించుకుంటున్నారు కూడా.ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతి భూసేకరణ అంశంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని పలువురు తప్పు పడుతున్నారు.అదనంగా 44వేల ఎకరాలను సేకరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.పాత పద్దతి లోనే ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా క్యాబినెట్ లో అభ్యంతరం చెప్పలేదు ,ఇదే ఇప్పుడు పవన్ వైఖరి మారిందనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని సందర్శించి రైతులకు బాసటగా నిలిచారు. రైతు సమస్యలు తెలుసుకున్నారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి 33 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రతిపాదించినపుడు ఎన్నో విమర్శలు చేశారు. అప్పుడు రాజధానికి అసలు 33వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఇప్పుడు అమరావతి విస్తరణ కోసం మరో 44000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ విధానం కింద తీసుకోవాలని నిర్ణయించినా కూడా పవన్ మౌనాన్ని పాటిస్తున్నారు.
కూటమి ఏర్పాటు లో కీలక భూమిక పోషించి, అధికారం లోకి వచ్చాక పవన్ కల్యాణ్ పూర్తిగా చంద్రబాబు పాట పాడుతున్నారు.అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయకత్వం లోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, మరో 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా వుండాలని కోరుతున్నారు. కూటమి భవిష్యత్తు లోనూ బలంగా వుంటుందంటూ చంద్రబాబుకు జై కొడుతున్నారు. రాజధాని అమరావతి ని గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కూడా విమర్శలకు పదునుపెడుతూ ముందుకు వెళుతున్నారు. ఏపీ రాజధాని గా అమరావతి అభివృద్ధి ని పవన్ కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేకున్నా, నాడు ఎక్కువ భూసేకరణ ను వ్యతిరేకించి, ఇప్పుడు అదనంగా వేల ఎకరాల భూసేకరణ అన్నా పల్లెత్తు మాట మాట్లాడక పోవడాన్ని కొందరు తప్పు పడుతున్నారు.
ఒక్క భూమి విషయంలోనే కాదు,అమరావతి కాంట్రాక్టులు, పవర్ ప్రాజెక్ట్ లు కూడా ఎంపిక చేసిన కంపెనీలకు మాత్రమే కేటాయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే జనసేనకే చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ రాజధాని రైతులతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతం అభివృద్ధి కోసం మరో 44 వేల ఎకరాలు సేకరిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోందని, రైతులు చాలా ఆందోళన చెందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి అనుమానాలు, అపోహలు ఉంటే మరిచిపోండని ధైర్యం చెప్పి వచ్చారు.కూటమి ప్రభుత్వం కొత్తగా భూ సమీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని కూడా ప్రకటించారు. రాజధాని అభివృద్ధి పైనే ముందు దృష్టి పెడుతున్నామని నాదేండ్ల చెప్పుకొచ్చారు.అదనపు భూసేకరణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిన , నాలుగు రోజులకే క్యాబినెట్ ఈ విషయంలో ముందుకు వెళడం, దానిని జనసేన అడ్డుకోక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గతంలోనే అమరావతికి సేకరించిన భూముల నుంచి స్టార్ట్ అప్ ప్రాజెక్టు ల కోసం సింగపూర్ కంపెనీలకు 1691ఎకరాలు  కేటాయించారు. అయితే అవి ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగడంతో ఆ భూమి కూడా ప్రభుత్వం వద్ద అందుబాటులో వుంది. కా 44 వేల ఎకరాల అదనపు భూసేకరణ ఎందుకన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాడు అమరావతి విషయంలో పవన్ వైఖరికి ఇప్పటి వైఖరికి ఎంతో తేడా వచ్చిందని, మిగిలిన అంశాలలో కూడా పవన్ గుడ్డిగా చంద్రబాబు కే ఓటు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్ లో ఇదే ధోరణి కొనసాగుతుందా.. పవన్ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News