పుట్టకు పాలుపోసి..మొక్కు తీర్చుకొని
మోపిదేవి సుబ్బారాయుడి సేవలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలన అనంతరం తిరుగు ప్రయాణంలో మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో వెలసిన వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. మధ్యాహ్న సేవలో పాల్గొన్నారు. తొలిసారి ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్కు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కి, ఆలయ ఆవరణలోని నాగ పుట్టను దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం ముందు పుట్టలో పాలు పోసి స్వామి మొక్కులు చెల్లించుకుని పడగలకు మొక్కారు. ప్రదక్షిణ చేసి అంతరాలయంలో వేయి పడగలతో లింగమూర్తిగా వెలసిన మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
పూజల అనంతరం ఘనాపాటి నవుడూరి విశ్వనాథ శర్మ ఆలయ విశిష్టత, చరిత్ర వివరించారు. స్వయంభువుగా వెలసిన క్షేత్రమని, పుట్టలో పోసిన పాలను సర్పరూపంలోని స్వామి స్వీకరిస్తారని తెలిపారు. సంవత్సరానికి రెండు మూడు సార్లు స్వామి వెలుపలికి వచ్చి విశ్వరూప దర్శనమిస్తారని చెప్పారు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా పేరున్న ఈ క్షేత్రానికి వారాంతాలు, మంగళవారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తారని వివరించారు.
నివార్ తుపాను సమయంలో రైతులను పరామర్శించేందుకు వచ్చినప్పుడు ఆలయం వెలుపలి నుంచి వెళ్లిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. తమిళనాట ఆరు విఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం తర్వాత మోపిదేవి స్వామిని దర్శించుకునే భాగ్యం లభించిందని అన్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. పవన్ కళ్యాణ్తోపాటు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.