శ్రీవారి లడ్డూ ప్రసాదంపై... అన్నీ సందేహాలే.. అన్నీ ప్రశ్నలే..

ప్రభుత్వం మారితే తిరుమల రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారుస్తున్నారు. లడ్డూకు వాడే నెయ్యి కల్తీ ఆరోపణలపై మాటల తూటాలు పేలుతున్నాయి. సందేహాలు పెంచుతున్నారు.

Update: 2024-09-20 12:12 GMT

 "శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గొడ్డు కొవ్వు, చేప నూనె కలిపిన నెయ్యి వాడారు" అని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన దుమారం దేశంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇదే కాదు. పరిపాలన వ్యవహారాల వంటి అంశాల్లో అన్నీ సందేహాలు ప్రశ్నలే మిగులుతున్నాయి. సమాధానాలు దొరకని పరిస్థితి కల్పిస్తున్నారు. లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాల నాణ్యత పరీక్ష, వినియోగంలో అనేక సందేహాలు, ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. కర్ణాటక ప్రభుత్వం నుంచి సరఫరా చేస్తున్న నందని నెయ్యి కొనుగోలు చేయకుండా, గుజరాత్ అమూల్ సంస్థలకు ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారు. వారి నుంచి అందిన నెయ్యి కల్తీ జరిగి ఉంటే, ఇన్నాళ్లు టీటీడీ ఎందుకు ఉపేక్షించింది. పటిష్టమైన క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏమి చేసింది. అంతవరకు సరే?

పరస్పర విరుద్ధ ప్రకటనలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికే లడ్డూ నాణ్యత, పరిమాణంలో తేడా ఉందనే ఆరోపణలు వినిపించాయి. టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించిన జే. శ్యామలరావు ఓ ప్రకటన చేశారు.
"నెయ్యిలో కలుషిత పదార్థం ఆనవాళ్లు లభించాయి. అందులో వెజిటబుల్ ఫాట్స్ (వనస్పతి) ఉన్నాయని తెలింది" అని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే,
"లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో నిషేధిత గొడ్డు కొవ్వు పదార్థం వాడారు" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వారిద్దరి ప్రకటనలు, వివరణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా, గత వైసీపీ కాలం నుంచి టీటీడీకి సరఫనా చేస్తున్న నెయ్యి శాంపిల్స్ టీడీపీ నేతలు పరీక్షలకు పంపించి, నివేదికలు బహిర్గతం చేశారు. వాటి ఆధారంగా సంచలన ప్రకటన చేయడం ఏమిటి? టీటీడీ చేయించాల్సిన పరీక్షలు, నెయ్యి శాంపిల్స్ వారికి ఎవరు అందించారు? దీనిపై ఇప్పటి వరకు టీటీడీ యంత్రాంగం నోరు మెదపడం లేదు. అయితే,
గుట్టు విప్పిన టీడీపీ
"లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో నిషేధిత గొడ్డు కొవ్వు, చేప నూనె ఉంది" అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డి వెల్లడించడం ఏమిటి?
టీడీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, చివరాఖరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించలేదు. మాట కూడా మాట్లాడలేదు. ఈ వ్యవహారమే రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ తరహా వివాదాల కారణంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

తిరుమల లడ్డూ
తిరుమల లడ్డూకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ లడ్డూ తయారీలో సంప్రదాయ పద్ధతులను పాటిస్తారు. ఆందుకోసం.. ఉపయోగించే పదార్థాల కొలతల ప్రకారం వినియోగిస్తారు. ఇందుకోసం 1950లో దిట్టం (వినియోగించే పదార్థాల మోతాదు) 1950లో నిర్ణయించారు. ఆ మేరకు తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో 2001లో దిట్టంలో మార్పు చేశారు.
5,100 లడ్డూల తయారీకి 803 కిలోల ముడిసరుకులు, 100 లడ్డుల తయారీకి వినియోగించే పదార్థాలతో దిట్టం తయారు చేశారు. ఆమేరకు
శనగపిండి :180 కిలోలు, ఆవునెయ్యి: 165 కిలోలు, చక్కెర : 400 కిలోలు, జీడిపప్పు : 30 కిలోలు, ఎండుద్రాక్ష : 16 కిలోలు, యాలకులు : 5 ,కిలోలు వినియోగిస్తారు.
ధర పెంపుదల
2004లో లడ్డూ ధర పెంచారు. అప్పటి వరకు చిన్న లడ్డూ రూ. 25, పెద్ద లడ్డూ రూ. వందకు అందుబాటులో ఉండేది. దర్శనానికి వెళ్లే వారికి మినహా మిగతా వారికి లడ్డూ ప్రియంగా ఉండేది. దీంతో బ్లాక్ మార్కెట్ ఎక్కువ జరిగేది. దీనిని ప్రామాణికంగా తీసుకున్న అప్పటి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన భూమన కరుణాకరరెడ్డి సారధ్యంలోని పాలక మండలి లడ్డూ ధర పెంచింది.

"పెరిగిన ముడిసరుకుల ధరలు, లడ్డూకు నిర్ణయించిన ధరకు సరిపోలడం లేదు" అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. లడ్డూ తయారీకి రూ.38 నుంచి 45 వెచ్చిస్తున్నటు కూడా వివరణ ఇచ్చారు. దీంతో ధర పెంచి రూ.50కి విక్రయించే చిన్నలడ్డూ 60 నుంచి 75 గ్రాములు, రూ.200 ఉండే పెద్ద లడ్డూ 750 గ్రాములు బరువు ఉండే విధంగా టీటీడీ జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా,
ప్రస్తుతం లడ్డూ తయారీ ఖర్చు పోగా, టీటీడీకి రూ.పది నుంచి రూ. 12 వరకు అదనంగా వస్తున్నట్లు ఈ వ్యవహారాలపై అవగాహన ఉన్నవారు చెప్పే మాట. టీటీడీ మాత్రం దీనిపై వ్యాఖ్యానించదు. యాత్రికుల నుంచి రోజూ రూ. 3.50 కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు హుండీకానుకల రూపేణా ఆదాయం ఉంటుంది. వారికి లడ్డూ ప్రసాదాల విక్రయంలో లాభనష్టాల బేరీజు సబబు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
"సామాన్య భక్తుల వల్ల టీటీడీ ఆదాయం వస్తోంది. ఇక్కడ లాభనష్టాలు బేరీజు వేయడానికి ఇది వ్యాపార సంస్థ కాదు. ధార్మిక సంస్థ. దాతలు ఇచ్చే రూ.కోట్ల ద్వారా వచ్చే వడ్డీ, నిత్య ఆదాయం సామాన్య భక్తుల సదుపాయాలకు వెచ్చించాలి" అని సీపీఎం రాష్ట్ర నేత కందారపు మురళి అభిప్రాయపడ్డారు.
నెయ్యి ఎక్కడి నుంచి వచ్చేది
తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీకి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నందిని పాల సహకార సంఘం నుంచి అందిచే వారు. 2022- 23లో ఐదు వేల టన్నుల నెయ్యి టీటీడీకి అందించారు. ఆ తరువాత ధరల సవరణపై టీటీడీ కర్ణాటక ప్రభుత్వం మధ్య సమన్వయం కుదరని కారణం గా గత ఏడాది సెప్టెంబర్ నుంచి నెయ్యి సరఫరా నిలిచిపోయింది. దీంతో..
లోపించిన నాణ్యత
వైసీపీ ప్రభుత్వంలో తిరుమల అదనపు ఈవోగా ఏవి. ధర్మారెడ్డి నియమితులయ్యారు. ఆ సమయంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అందిస్తున్న నందిని ప్రతినిధులతో ధరల వ్యవహారంపై పీటముడిపడడం వల్ల 2021లో నెయ్యి సరఫరాకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో లడ్డూ నాణ్యత కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బరువు కూడా తగ్గిందనే వార్తలు, యాత్రికుల ఫిర్యాదులు, నిరసనలు వినిపించాయి. దీంతో నాణ్యమైన నెయ్యి వాడడం లేదనే వ్యవహారం తెరమీదకు వచ్చింది.
2024 ఎన్నికల తరువాత టీడీపీ కూటమి ఏర్పడింది. తిరుమలలో వ్యవహారాలు ప్రక్షాళన చేయాలని ప్రత్యేక టాస్క్ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఈఓగా జే. శ్యామలరావును నియమించారు. నెలపాటు వరస సమీక్షలతో ఆయన తిరుమలలో అన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీ, హోటళ్లలో నాణ్యత మెరుగు పరచడానికి ప్రత్యేక దృష్టిసారించారు. ఇదే తరుణంలో...
జూలై : "లడ్డూ తయారీలో నాణ్యత లేదనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు" బాధ్యతలు చేపట్టిన తరువాత నిర్వహించిన ఓ సమీక్షలో జే. శ్యామాలరావు ఆసక్తికరమైన
నెయ్యి శాంపిల్స్ గుజరాత్ లోని ఎన్డీడీబీకి చెందిన ల్యాబ్ జూలై ఎనిమిదవ తేదీ పరీక్షలకు పంపించారు. ఆ వివరాల నివేదిక 16వ తేదీ అందింది. ఆ సమయంలో ఆయన ఏమన్నారంటే... "నెయ్యిలో కల్తీ ఉందని తేలింది. అందులో కూరగాయల ఫాక్స్ట (వనస్పతి) ఉన్నట్లు రిపోర్టు వచ్చింది" అని ఈఓ శ్యామలరావు చెప్పడం గమనార్హం. దీంతో "ఆ సరఫరాదారుడికి నోటీస్ ఇచ్చాం" రెండు ట్యాంకర్ల నెయ్యి తిరస్కరించాం. రెండో ట్యాంకర్ లో కూడా నాణ్యత లేదని షోకాజ్ నోటీస్ ఇచ్చాం" అని స్పష్టం చేశారు. ఇది గత నెలలో జరిగింది.
అయితే ఇంత ఆలస్యంగా సీఎం చంద్రబాబు చేసిన  వ్యాఖ్యల వెనుక ఆంతర్యంపై సందేహాలు మొదలయ్యాయి. 

(ఫెడరల్ లో సమగ్ర కథనం : నెయ్యిలో వనస్పతి లాంటి కూరగాయల మూలాలు ఉండడం వెనుక, పశువుల మేత ప్రామానిణింగా ఉంటుందనే విషయాన్ని ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ సైట్ లో "శ్రీవారి లడ్డూలో గొడ్డు కొవ్వుపై వైసీపీ ఏం చేయబోతోంది? ఎస్ విలువేంటి" శీర్షిక ద్వారా సమగ్ర కథనం అందుబాటులో ఉంది.)
సెప్టెంబర్ 18సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో ఆధ్యాత్మిక ప్రపంచం ఉలిక్కి పడింది. రెండు రోజులుగా తిరుమల లడ్డూపై ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. టీటీడీ ఈఓ జే. శ్యామలరావు మాత్రం స్పందించలేదు. సాయంత్రానికి టీడీపీ అధికారప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నెయ్యి శాంపిల్స్ నివేదికలు బహిర్గతం చేశారు.
"వైసీపీ పాలనలో ఇలాంటి దుర్గారం జరిగింది" అని మాటలతో తూర్పారబట్టారు. అప్పటికి కూడా రాష్ర్ట మంత్రులు, టీటీడీ, పర్యవేక్షించే దేవాదాయ శాఖ ప్రతినిధులు కూడా నోరు విప్పలేదు. " సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను కూటమి నేతలు కూడా సమర్ధించారు. అయితే ప్రభుత్వ ప్రతినిధులు అంతకంటే ముందు టీటీడీ వెల్లడించాల్సిన అంశాలు టీడీపీ అధికార ప్రతినిధి చెప్పడం వెనక ఆంతర్యం ఏమిటి? ఇదే పెద్ద ప్రశ్న.
ఇంతపెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంది. టీటీడీ అదికారులు ఉన్నారు. వారెవ్వరు కాకుండా, అధికార పార్టీ అధికార ప్రతినిధికి నివేదికలు ఎవరు ఇచ్చారు? ఆయనతో ఎందుకు ప్రకటన చేయించారు? అనేది సమాధానం లేని ప్రశ్నలు.
తిప్పికొట్టిన జగన్

లడ్డూ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్. జగన్ శుక్రవారం స్పందించారు. " రాజకీయాలకు దేవుడిని కూడా వాడుకునే దర్గార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి " అని ఘాటుగా స్పందించడమే కాదు. "భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా.? , ఆరు నెలలకు ఓసారి నెయ్యి సరఫరాకు టెండర్లు పిలుస్తారు" అని గుర్తు చేశారు.
"ప్రతి ట్యాంకు శాంపిళ్లను మూడుసార్లు టెస్ట్‌ చేస్తారు. అన్నీసవ్యంగా ఉంటేనే నెయ్యి తీసుకుంటారు. అని చెబుతూ, టీటీడీని, సీఎం చంద్రబాబను ఇరకాటంలో పెట్టారు.
2024 జులై 12: టీటీడీ శాంపిల్స్‌ తీసుకుంది. అప్పుడు ఎవరు సీఎం ఎవరు? నేనా.. మీరా? అంటూనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే నెయ్యి శాంపిల్స్‌ తీసుకున్నారు.
జులై 17: NDDBకి నెయ్యి శాంపిల్స్‌ పంపించారు.
జులై 23:న ఆ సంస్థ నివేదకి ఇచ్చంది. అప్పుడెప్పుడో నివేదిక ఇస్తే, ఇప్పుడు సీఎం చంద్రబాబు సంచలనం చేయడానికి వ్యాఖ్యలు చేయడం ఏంటి అనే ప్రశ్నలతో ఇరకాటంలో పడేశారు. ఇదిలావుంటే
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో జంబో పాలక మండలిని నియమించింది. దీనిని అప్పట్లో రాజకీయ అస్ర్తం చేయడంతో కోర్టు జోక్యం వల్ల సంఖ్యను తగ్గించారు. ఆ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదనపు ఈఓగా వచ్చిన ఏవీ. ధర్మారెడ్డి కాలంలో టీటీడీలో అమలు చేసిన కార్యక్రమాలపై విమర్శలు పెరిగాయి. ఎన్నికలకు ముందు కూడా రూ. కోట్లు ఇంజినీరింగ్ పనులకు కేటాయించారనే అశంపై ..

2024లో అధికారంలో వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో దాదాపు 25 మంది వివిధ స్థాయిల్లోని అధికారులు మానసిక వేదనకు గురయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఆ వ్యవహారం ఎమైందనేది తేలలేదు.

ఏవీ. ధర్మారెడ్డి అమలు చేసిన శ్రీవాని ట్రస్ట్పై కూడా విచారణ చేశారు. ఆ నివేదిక, అక్రమాలు జరిగాయా? లేదా? అనేది తేలలేదు. ఇలా టీటీడీలో జరిగే అన్ని వ్యవహారాల శేష ప్రశ్నలుగానే మిగిలాయి. 

ఈ పరిణామాల నేపథ్యంలో తిరుమల లడ్డూ చుట్టూ టీడీపీ, వైసీపీ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఇవి ఎంతవరకు దారితీస్తాయనేది వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News