నిషేధిత పాక్ వాట్సాప్ గ్రూపులలో నూర్ సభ్యుడు
ధర్మవరం నిందితులకు ఉగ్రలింకులపై మీడియాకు వివరాలు అందించిన జిల్లా ఎస్పీ రత్న;
By : V V S Krishna Kumar
Update: 2025-08-17 12:06 GMT
చూడటానికి అమాయకంగా కనిపించే వ్యక్తి, తెరవెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న వాట్సాప్ గ్రూపులతో సంబంధాలు నెరుపుతూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహహ్మద్ అనే వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, ఒక చిన్న పట్టణంలో ఉగ్రవాద నెట్వర్క్ బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నూర్ మహమ్మద్ అనే ఈ వ్యక్తితో పాటు మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న మీడియాకు వెల్లడించారు."నిందితులను అరెస్టు చేసి కడప జైలుకు తరలించాం. పాక్కు చెందిన వాట్సప్ గ్రూపుల్లో నిందితుడు సభ్యుడిగా ఉన్నాడు. నూర్ మహమ్మద్ చికెన్ బిర్యానీ తయారు చేస్తూ,అమాయకుడిలా కనిపిస్తాడు. మసీదు వద్ద యువకులకు సమాచారం చేరవేస్తున్నాడు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతడిని అరెస్టు చేశాం. కస్టడీలోకి తీసుకొని విచారిస్తాం" అని ఎస్పీ తెలిపారు.
నూర్ పాకిస్థాన్కు చెందిన వాట్సాప్ గ్రూపులలో సభ్యుడిగా ఉంటూ, కీలక సమాచారాన్ని పంచుకుంటున్నట్లు పక్కా ఆధారాలు పోలీసులు సేకరించారు. అంతేకాకుండా, స్థానికంగా మసీదుల వద్ద యువకులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు కనుగొన్నారు."నిషేధిత వాట్సప్ గ్రూప్లు 6, పాక్కు చెందిన మరో 30 గ్రూపుల్లో నూర్ సభ్యుడిగా ఉన్నాడు.ఇతర గ్రూపులతో సంబంధాలపైనా ఆరా తీస్తాం. అతడు ఉగ్రసంస్థ శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది’’ అని ఎస్పీ రత్న వెల్లడించారు.
పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసి, కడప జైలుకు తరలించినట్లు ఎస్పీ రత్న పేర్కొన్నారు. అతని పాకిస్థాన్ సంబంధాలు, ఉగ్రవాద సంస్థలతో ఉన్న లోతైన సంబంధాలపై పూర్తి వివరాలు రాబట్టేందుకు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని ఆమె స్పష్టం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.