'మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలి' ప్రజలే నిర్ణేతలన్న లోకేష్
మనం ఎక్కడ కూర్చోవాలే ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి.ఏడాది హనీమూన్ అయిపోయింది.;
By : V V S Krishna Kumar
Update: 2025-06-29 12:38 GMT
“సుపరిపాలనలో- తొలి అడుగు” కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ఇంటింటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించేందుకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేష్ ప్రసంగించారు.
"పార్టీనే సుప్రీం, దేశం మొత్తం తిరిగినా, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికే, అందుకే ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం నిర్మించాలని చెప్పడం జరిగింది. దేశ స్థాయిలో బీజేపీకి తప్ప ఇంత పెద్ద కార్యాలయం మరే పార్టీకి లేదు. ఒక వ్యవస్థ మనం, ఎవరూ శాశ్వతం కాదు, మనం ఎక్కడ కూర్చోవాలే ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి"అని లోకేష్ పిలుపు నిచ్చారు. ఏడాది హనీమూన్ అయిపోయిందని వ్యాఖ్యానించారు.
హామీలు నెరవేస్తున్నాం
సుపరిపాలనలో తొలి అడుగు వేశామని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తల్లికి వందనం అమలు చేశాం, దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం, ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని లోకేష్ చెప్పుకొచ్చారు. ఆర్థిక వనరులు సమకూర్చుకుని, అహర్నిశలు కష్టపడి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామని. అన్నీ చేశామని చెప్పడం లేదు. ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలి. పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పాలన్నారు.
సీనియర్ల అనుభవం,యువతకు వున్న శక్తి జోడించాలి
పార్టీలో సీనియర్లకు ఉన్న అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండింటినీ జోడించాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. సీనియర్లే పార్టీకి కాపలా కాశారు. వారే పార్టీకి అండగా నిలబడ్డారు. నాలుగు దశాబ్దాలు పార్టీని ముందుకు తీసుకెళ్లారు. దీనిని మనం మర్చిపోకూడదని స్పష్టం చేశారు. పార్టీ పదవుల విషయంలో దామాషా ప్రకారం పదవులు ఇవ్వాలని, అందరినీ కలుపుకుని పోవాలన్నారు. నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణం బాగా చేసిన వారిలో మంత్రి నిమ్మల రామానాయుడు నెం.1గా ఉన్నారని, మంగళగిరి ఐదో స్థానంలో ఉందని, మనలో పోటీతత్వం పెరిగి, బాగా కష్టపడాలని సూచించారు. బాగా పనిచేసిన కార్యకర్తలను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించి , సత్కరిస్తున్నామని తెలిపారు.
వైసీపీకి గతంలో 151 సీట్లు వచ్చి అవి 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమేనని గుర్తించాలన్న లోకేష్ ,మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాలన్నారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించేందుకు కష్టపడాలని తెలిపారు.పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.కచ్చితంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని. క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారుపార్టీ వ్యవస్థలో మహిళలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు.