‘‘ఐటీ గురించే మాట్లాడుతానని అనుకుంటారు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నేను చేసిన పనులన్నీ రైతులకు ఉపకరించేవే. నీరు–చెట్టు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, కాలువలు ఇలా ప్రతీ అంశాన్నీ వ్యవసాయ రంగానికి అనుకూలమైన ఆలోచనలే చేశా. సాగునీరు, వ్యవసాయ రంగం అభివృద్ధికే నిర్ణయాలు తీసుకున్నాను. రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేలా చేస్తాం.’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. సోమవారం అసెంబ్లీలో వ్యవసాయ శాఖపై జరిగిన లఘ చర్చలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖపరంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. రైతులకు లబ్ది చేకూర్చిన అంశాలను చెప్పడంతో పాటు.. భవిష్యత్తులో రైతు సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామనే విషయాలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించారు. వ్యవసాయం మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థ మనది. అందుకే ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలని నిర్ణయించాం. ప్రతి పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చూస్తున్నాం. అందుకే రకరకాల పంటలను ప్రొత్సహిస్తున్నాం. ఆక్వాను ప్రొత్సహిస్తున్నాం. వ్యవసాయాన్ని ఓ పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. వ్యవసాయం లాభసాటిగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం.. ఏ పంట వేస్తే గిట్టుబాటు ఉంటుందో చూసి ఆ పంటలు వేసేలా ప్రొత్సహిస్తామని సీఎం చెప్పారు.
ప్రజా ప్రతినిధుల పొలం బాట
ప్రతీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నెలకు ఒక్క రోజు పొలం దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడాలి. అక్టోబరు నుంచి ప్రతీ నెలా రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు విని పరిష్కారం చేస్తాం. ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజా ప్రతినిధులు రైతుల వద్దకు వెళ్లి... ప్రభుత్వం రైతుల గురించి ఎలాంటి ఆలోచన చేస్తోంది... వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని వివరించాలి. ప్రతీ ప్రజా ప్రతినిధి వ్యవసాయంపై దష్టి పెట్టాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. పురుగు మందులు, ఎరువుల వాడకంలో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉంది. అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల ఆక్వాలో అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. రైతులకు సంపద రావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
యూరియాపై విమర్శలు చేసే వారు తీసుకునేది సర్టిఫికేషన్ ఆహారమే
రైతులకు వాస్తవాలు చెప్పి పురుగుమందులు, ఎరువులు వాడుతుంటే వారికి అవగాహన కల్పించాలి. వరదలు, వర్షాలతో ఎరువు కొట్టుకుపోవటం వల్ల బూస్టర్ డోస్ ఇచ్చారు. రాష్ట్రంలో 1.16 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది అదనంగా పంట వేశారు. 25 శాతం మేర యూరియా ఎక్కువ వినియోగించారు. దాణా పెంచడానికి కూడా యూరియాను వినియోగించుకున్నారు. ఖరీఫ్ సీజన్ కు 16.70 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియా అలాట్మెంట్ వచ్చింది. ప్రస్తుతం 5.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉంది. యూరియా ఎక్కువ వినియోగించటం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయి. యూకలిప్టస్, పసుపు లాంటి పంటలకు కూడా యూరియా వాడేస్తున్నారు. రాష్ట్రంలో హెక్టారుకు సగటున 255 కేజీల మేర యూరియా వినియోగం జరుగుతోంది. తద్వారా భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. భూసారం కూడా దెబ్బతింటోంది. ప్రజారోగ్యంతో పాటు పంట ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతోంది. కొత్త తెగుళ్లతో పంటలు దెబ్బతింటున్నాయి. సేంద్రీయ ఎరువులు ఉపయోగించి, రసాయన పురుగు మందులు తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులు పండిద్దాం అని చంద్రబాబు చెప్పారు.
నీటి సౌలభ్యాన్ని పెంచాం... సాగు విస్తీర్ణం పెరిగింది
నెల్లూరులో ఎప్పుడూ ఒక పంటే వేస్తారు. ఈసారి అక్కడ రెండు పంటలు వేశారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద రూ.20 వేలు రైతుల ఖాతాలో వేస్తున్నాం.తొలి విడతగా రూ.7 వేల చొప్పున మొత్తంగా రూ.3173 కోట్లు రైతుల ఖాతాలో వేశాం. ఉల్లి ధరలు పడిపోతే హెక్టారుకు రూ.50 వేల నష్ట పరిహారం ప్రకటించాం. అనంతపురంలో అమలు చేసిన మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ ను నమూనాగా తీసుకుని ప్రధాని మోదీ గుజరాత్ లో అమలు చేశారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా లక్ష హెక్టార్లకు 15 టీఎంసీల నీరు ఆదా అవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా గరిష్టంగా ఆదాయం సాధించే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు.
మెరైన్ ఎకానమీపై శ్రద్ధ పెడతాం
ఆక్వా కల్చర్ తో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ ఏపీ నెంబర్ వన్ గా మారే పరిస్థితి తీసుకువస్తాం. ట్రంప్ దెబ్బకు ష్రింప్ విలవిల లాడుతోంది. రూ.21 వేల కోట్ల ఆక్వా ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయి. టారిఫ్ పెరిగిపోవటం వల్ల ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నాం. మెరైన్ ఎకానమీని పెంపోదించడంలో భాగంగా సీవీడ్ కల్చర్ పై కూడా దృష్టి పెడుతున్నాం. ఈ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సీవీడ్ ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుందని అని సీఎం చెప్పారు.
రాష్ట్రానికి అతి పెద్ద ఆదాయ వనరు వ్యవసాయ రంగమే
రాష్ట్రంలో 35 శాతం జీఎస్డీపీ వ్యవసాయ ఆధారితంగానే వస్తోంది. వ్యవసాయ రంగం ద్వారా రూ. 5.17 లక్షల కోట్లు, పారిశ్రామిక రంగం ద్వారా రూ. 3.40 లక్షల కోట్లు, సేవల రంగం ద్వారా రూ. 6.12 లక్షల కోట్ల గ్రాస్ వాల్యూ ఎడిషన్ వస్తోంది. ఒక్క పశు సంవర్థక రంగం నుంచే రూ.1.95 లక్షల కోట్ల జీవీఏ వస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవల రంగం నుంచి రూ. 17.12 లక్షల కోట్ల జీవీఎను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2029 నాటికి రాష్ట్రంలో ఉద్యాన పంటలను 25 లక్షల హెక్టార్లకు పెంచుతాం. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశానికి హార్టికల్చర్ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి వివరించారు.