నా జీతం..మీ జీవితం కోసం
పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా ఉంటా..నా వేతనం వారి కోసం వెచ్చిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.;
‘పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా గెలిపించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితోపాటు సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మొత్తం ఇస్తున్నట్టు తెలిపారు.
పదవి ఉన్నంత కాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్టు స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికీ నెలకి రూ. 5 వేల చొప్పున రూ. 2,10,000 ఆర్థిక సాయం అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం అందుబాటులో ఉన్న 32 మందికి పవన్ కళ్యాణ్ స్వయంగా సాయాన్ని అందజేశారు. మిగిలిన పది మందికీ జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెలా ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేశారు.