సిట్ అధికారులకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బహిరంగ ప్రశ్నావళి
లిక్కర్ స్కాం కేసులో తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడాన్ని మోహిత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు.;
By : V V S Krishna Kumar
Update: 2025-06-17 16:12 GMT
లిక్కర్ స్కాం కేసులో తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడాన్ని మోహిత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కావాలనే తన తండ్రిని ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ సిట్ అధికారులకు మోహిత్ రెడ్డి బహిరంగంగా పలు ప్రశ్నలు సంధించారు.నిబద్ధత, నిజాయతీ, పారదర్శకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు నా ప్రశ్నలకు నిజాయతీగా సమాధానం చెప్పగలరా..? అంటూ ప్రశ్నలు కురిపించారు.
-ఒక్క సంవత్సరం కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజ్ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయి, దానిని ప్రజలకు పంచారని ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థం ఏమిటి..? అది నిజం కాదు కనుకే కదా..?
–ఇంకో 20 సంవత్సరాలు సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పనంగాబెట్టి ఒక పోలీసుగా వుండి పోలీసు అధికారులపై ఎవ్వరైనా అబద్ధాలు చెప్పగలరా..? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. అలాంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీ గారిని ప్రాదేయపడితే అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం సిట్ కార్యాలయ అధికారుల దిగజారుడుతనంకు నిదర్శనం.
–చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పదేళ్లు గన్మెన్గా పనిచేసిన మదన్రెడ్డిని సిట్ కార్యాలయంకు పిలిపించి విచారణ సమయంలో అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ అధికారులు చెప్పినట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని హింసించడం వల్లనే కదా.. అతను చనిపోతాను అన్నది.
–ఒక హెడ్కానిస్టేబుల్ తనకంటే పైస్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లు రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి వుంటే అంత మాట అనగలడు. అందరూ ఆలోచించాలి.
–సిట్ విచారణకు వచ్చే వారు ఎంత నిజాయతీగా చెబుతున్నా.. ఎవ్వరినో మెప్పించడానికి, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడానికి ప్రతి రోజు కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది మీరే కదా.. అది మీ మనస్సాక్షినే అడగండి చెబుతుంది.
–సిట్ కార్యాలయంలో ఎంతో పారదర్శకంగా విచారణ జరుగుతోంది, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఎవ్వరినీ టార్చర్ చేయడం లేదు.. అని సిట్లో పనిచేసే ఏ ఒక్క అధికారి అయినా భగవంతుని ముందు ప్రమాణం చేయగలరా..?
–మీరు రాయమన్నట్టు రాసి, చెప్పమన్నట్టు కోర్టులో మెజిస్ట్రేట్కు చెప్పిన గిరి అనే కానిస్టేబుల్కు ఆగమేఘాలపై రాత్రికి, రాత్రి అతనికి ఇప్పుడు వస్తున్న జీతానికి అదనంగా 60 శాతం జీతం పెంచి ఆక్టోపస్లో ఉద్యోగం ఇచ్చారంటేనే మీ సిట్ అధికారుల నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత ఏపాటిదో స్పష్టంగా అందరికీ తెలుస్తోంది.
–సిట్ తన విచారణలో పారదర్శకత, నిబద్ధతను నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారిచే విచారణ చేయిస్తే నిజాలు బయటకు వస్తాయా..? నిబద్ధత ఎంత వుందో తెలుస్తుందా..? నిజంగా మీ సిట్ అధికారులు, ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది విచారణ సమయంలో చూపించే తమ నిజాయతీ, నిబద్ధతలను నిరూపించుకోవాలన్న కోరిక మీకు నిజంగా వుంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలని కోరే దమ్ము, ధైర్యం సిట్ అధికారులకు వుందా ?
సత్యమేవ జయతే.. అంటున్నారు.. ఏదో ఒకరోజు తప్పకుండా సత్యమేవ జయతే అవుతుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులు అందరికీ దేవుడు, న్యాయస్థానం రెండు శిక్ష విధిస్తాయి రాసి పెట్టుకోండి. అప్పుడే సత్యం గెలుస్తుంది.. ధర్మం గెలుస్తుంది అంటూ మోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు.