సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం
జూన్ 12 నుంచి 41 వేల పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్లో అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.;
పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని 41వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్కు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా కొడాలి మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం మాట్లాడుతూ.. వరి పండించే రైతుల చేతుల మీదుగా పాఠశాలు, సంక్షేమ హాస్టల్స్కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. మూడు పార్టీల కలయికతో బలంగా ఉన్న మార్కెట్ యార్డ్ కమిటీని ఏర్పాటుచేశామని, భవిష్యత్తులో వీరంతా కలసి, యార్డును మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.