సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం

జూన్‌ 12 నుంచి 41 వేల పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్‌లో అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.;

Update: 2025-06-02 14:39 GMT

పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. జూన్‌ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని 41వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్‌కు మూడున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా కొడాలి మార్కెట్‌ యార్డ్‌ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సోమవారం మాట్లాడుతూ.. వరి పండించే రైతుల చేతుల మీదుగా పాఠశాలు, సంక్షేమ హాస్టల్స్‌కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. మూడు పార్టీల కలయికతో బలంగా ఉన్న మార్కెట్‌ యార్డ్‌ కమిటీని ఏర్పాటుచేశామని, భవిష్యత్తులో వీరంతా కలసి, యార్డును మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో రైతాంగం ఎంతలా నష్టపోయిందో కళ్లారా చూశామన్నారు. రోడ్లపై ధాన్యాన్ని రాశులుగా పోసి కన్నీరు కార్చిన సందర్భాలు కోకొల్లలని అన్నారు. రైతులను ఆదుకోవాలని గతంలో ప్రభుత్వాన్ని కోరినా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.1674 కోట్లు బకాయిలు పెట్టి వైసీపీ ప్రభుత్వం దిగిపోయిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించామన్నారు. ఖరీఫ్, రబీలో కలిపి దాదాపు 48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రూ. 12,400 కోట్ల చెల్లింపులు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైస్‌ మిల్లులకు రూ. 470 కోట్లు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం రూ. 360 కోట్లు చెల్లించిందన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోకుండా కాపాడుకునేందుకు 5 కోట్ల 13 లక్షల గోతాలు ఇచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. వ్యవసాయ సిబ్బందిని క్షేత్ర స్థాయికి పంపించి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని సాంకేతికతో అనుసంధానం చేసి దిగుబడి పెంచుతున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్‌ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి నెలా 1 నుంచి 15 తేదీలోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, ఆదివారాల్లోనూ సరుకుల పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఈ నెల 4వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Tags:    

Similar News