MEDIA | యాజమాన్యాలతో జర్నలిస్టులను ముడిపెట్టకండి.. ప్లీజ్

కుప్పంలో విలేఖరిపై కేసు నమోదు చేయడంపై చిత్తూరు ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-28 15:11 GMT

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రిపోర్టర్ నాగరాజుపై టిడిపి నేతల ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇది తమ వృత్తి ధర్మాన్ని దెబ్బతీస్తుందని, పోలీసులు కేసు నమోదు చేయడం సరైంది కాదని చిత్తూరు జిల్లా జర్నలిస్టులు అభ్యంతరం చెప్పారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుతో చర్చించి, శనివారం ఓ వినతిపత్రం సమర్పించారు.

"జర్నలిస్టులను యాజమాన్యాలతో ముడి పెట్టవద్దు. మమ్మలిని పాత్రికేయులు గుర్తించండి. జర్నలిస్టుల హక్కులు కాపాడాలని" ఏపీయూడబ్ల్యూజే (APUWJ) జిల్లా అధ్యక్షులు ఎం.లోకనాథన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కెఎం. అశోక్ కుమార్ కోరారు.

చిత్తూరు ఎస్పీ మఠికంఠ చందోలుకు వినతిపత్రం ఇస్తున్న జర్నలిస్టు సంఘ నేతలు

సమస్య ఇదీ..
కుప్పం రూరల్ మండలం మార్వాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత వారం అనారోగ్యంతో మరణించాడు. ఆయన భౌతికకాయానికి అంతిమ సంస్కారం నిర్వహించడంలో వివాదం ఏర్పడింది. శ్మశానంలో కాకుండా, మరణించిన వ్యక్తి కుటుంబానికి సంబంధించిన పొలంలో అంతక్రియలు నిర్వహించాలని కొందరు అభ్యంతరం చెప్పడంపై రెండు ప్రధాన పత్రికల్లో వేర్వేరుగా కథనాలు ప్రచురితం అయ్యాయి. ఈ ఎపిసోడ్ వివాదం కావడం వల్ల రంగప్రవేశం చేసిన పోలీసులు గ్రామస్తులతో చర్చించిన తరువాత మొత్తానికి చనిపోయిన వ్యక్తి భౌతికకాయానికి శ్మశానవాటికలోనే ఖననం చేయించడం ద్వారా ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారు. అయితే..
ఈ నెల 23న అధికార పార్టీకి మద్దతుగా ఉన్న పత్రికలో
"దహన సంస్కారాలు బహిష్కరించిన పల్లెజనం" పోలీసుల జోక్యంతో ముగింపు సబ్ హెడ్డింగ్ తో కథనం ప్రచురించారు.
ప్రతిపక్షానికి మద్దతుగా ఉండే పత్రికలో
"శ్మశానంలో పూడ్చనివ్వం" అనే శీర్షికతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్న టీడీపీ వర్గీయులు. సొంత పొలంలోనే ఖననం చేసుకోవాలని హుకుం ఉపశీర్షికలతో కథనం వచ్చింది.
దీనిపై ఆ గ్రామ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఫిర్యాదుతో ప్రతిపక్ష పత్రిక కుప్పం రూరల్ విలేఖరిపై కేసు నమోదు చేశారు. వార్తలు సేకరించి, కథనాలు రాసే విలేఖరిపై కేసులు నమోదు చేయడంపై చిత్తూరు జర్నలిస్టులు, సంఘ నేతలు స్పందించారు.
పత్రికల్లో వార్తలు రాసినందుకు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై ఫిర్యాదులు వస్తే, వాస్తవాలు విచారించి, ఆ తరువాత పోలీసులు నిర్ణయం తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠను వారు కోరారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవల కలెక్టర్ హామీ ఇచ్చిన విషయాన్ని కూడా వారు ఎస్పీ మఠికంఠ చందోలుకు వివరించారు.
దీనిపై ఎస్పీ మఠికంఠ స్పందించారు.
"భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పోలీసు శాఖ కట్టుబడి ఉంది. రాజ్యాంగ విరుద్ధంగా ఎప్పుడు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు" అని ఎస్పీ స్పష్టం చేశారు. పత్రికల్లో వార్త రాయడంతో పాటు వాటిని ఉదేశ పూర్వకంగా సామాజిక మాధ్యమాలలో ట్రోల్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగారనే ఫిర్యాదుతోనే కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. విచారణలో ఆ రిపోర్టర్ ప్రమేయం లేదని తేలితే తదుపరి చర్యలు ఉండబోదని ఆయన హామీ ఇచ్చారు. కలెక్టర్ తో మాట్లాడి పాత్రికేయులపై దాడుల నివారణ కమిటీని సైతం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు బాలసుందరం, రాజేష్, సీనియర్ జర్నలిస్టులు శివ, చంద్ర ప్రకాష్, హరీష్, చిన్న ఉన్నారు. పత్రికా యాజమాన్యాలపై ఉన్న ఆగ్రహం విలేఖరులపై ప్రభావం చూపిందనడానికి ఇదో ఉదాహరణ. చిత్తూరు జిల్లా ఎస్పీ మఠికంఠ చందోలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై వేచిచూడాల్సిందే.
వాస్తవ విరుద్ధమైన పరిస్థితిని సృష్టించి, రాసిన కథనాల నేపథ్యంలో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కుప్పం సీఐ శంకరయ్య 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. దర్యాప్తు చేసి, వాస్తవికత ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Similar News