Breaking | 'మామిడి' ప్రాణాలు తీసింది... ఏడుగురు మృతి
ఒకవైపు రైతును బాధిస్తున్న మామిడి మరొకవైపు లారీ రూపంలో కూలీలను కాటేసింది...;
ఇది మామిడికాయల సీజన్. రైతులకు గిట్టుబాటు ధర దక్కలేదు. తోటల్లో కోతకు వెళ్లే కూలీల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలానికి సమీపంలోని చెరువు కట్టపై మామిడి లోడుతో వస్తున్న లారీ బోల్తా పడింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో దాదాపు ఏడుగురు మరణించారని చెబుతున్నారు. ఆ సంఖ్య పది మంది వరకు ఉన్నట్లు సమాచారం అందింది. పెద్ద సంఖ్యలోనే కూలీలు కూడా గాయపడ్డారని తెలుస్తోంది.
ఘటనా స్థలంలో పరిస్థితి కన్నీరుపెట్టిస్తోంది. మామిడి కాయల కోతలకు పెద్దలు పిల్లలను కూడా వెంట తీసుకుని వెళ్లారు. పిల్లలు ఆటపాటల్లో ఉంటే పెద్దలు పనుల్లో ఉన్నారు. మామిడి కాయలు లారీకి నింపిన తరువాత ప్రమాదకర స్థితిలోనే ప్రయాణం చేశారు.
దురదృష్టవశాత్తూ లారీ బోల్లా పడింది. ఆ ప్రమాదంలో మరణించిన వారి పిల్లలు శోకాలు పెడుతున్నారు. భయకంపితులైన గాయపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కున చేర్చుకున్న దృశ్యాలు మాటలకు అందని పరిస్థితి కనిపించింది.
చిత్తూరు జిల్లా తర్వాత మామిడి తోటలకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నిలయం. తోటల వద్ద కాయలు కొనుగోలు చేసే పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కోత కోసం సమీప గ్రామాల నుంచి కూలీలను లారీలను తీసుకువెళ్తారు. ఉదయం నుంచి కొంత మంది కూలీలు మామిడి తోటలో కాయలు కోస్తే, ఆ కాయలను లారీలో నింపుతారు.