లిక్కర్ స్కాం 'స్వాముల' ఇళ్లల్లో సోదాలు, హైదరాబాద్ లో కలకలం
భారతి గ్రూప్, రిసోర్స్ వన్, టీగ్రిల్ సిట్ దాడులు;
By : The Federal
Update: 2025-07-26 13:58 GMT
ఏపీ లిక్కర్ స్కాం మలుపులు తిరుగుతోంది. మద్యం కేసు నిందితుల ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం(సిట్) సోదాలు చేపట్టింది. నిందితుల ఇళ్లన్నీ హైదరాబాద్ లోనే ఉండడంతో ఇప్పుడీ సిట్ తనిఖీలు అక్కడకు చేరాయి. ఈ కేసులో నిందితుడు రాజ్ కెసిరెడ్డి కార్యాలయంలో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాలాజీ గోవిందప్ప ఉండే భారతి సిమెంట్స్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నానక్రామ్గూడలో చాణక్యకు చెందిన టీగ్రిల్ రెస్టారంట్లోనూ తనిఖీలు చేపట్టారు. మద్యం కేసు నిందితులు ఎక్కడ సమావేశమయ్యారనే అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. జూలై 26 మధ్యాహ్నం నుంచి సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఏడుగురు అధికారులతో కూడిన సిట్ బృందం సోదాలు చేస్తోంది.
నిందితుల నేపథ్యం...
గోవిందప్ప – భారతి సిమెంట్స్ డైరెక్టర్
భారతి గ్రూప్లో కీలకంగా ఉన్న గోవిందప్ప ఈ స్కాంలో ముఖ్య పాత్రధారిగా సిట్ ఆరోపించింది. అరెస్ట్ కూడా చేసింది. ఈ కంపెనీ వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందింది. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతీ రెడ్డి పేరిట ఉన్న ఈ గ్రూపులో గోవిందప్ప కీలక పాత్రధారి. లిక్కర్ మాఫియా వ్యవహారంలో డబ్బుల లావాదేవీలు, షెల్ కంపెనీల ముసుగులో మద్యం రవాణా, సబ్సిడీ చిట్కాల వినియోగం లాంటి అంశాల్లో గోవిందప్పపై అనుమానాలు నెలకొన్నాయి.
రాజ్ కెసిరెడ్డి – జగన్ ఐటీ సలహదారు..
liquor scamలో ఈయన నెంబర్ వన్ నిందితుడు. రాజ్ కెసిరెడ్డి పేరు తెగ హల్చల్ చేస్తోంది. వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న ‘Resource One’ వంటి సంస్థలు ఎక్సైజ్ సంబంధిత బిల్లులు, ఎండార్స్మెంట్ లావాదేవీలతో వ్యవహరిస్తూ భారీ మొత్తాల చెక్కుల ద్వారా నిధుల బదిలీ జరిపినట్టు ఆధారాలు బయటపడ్డాయి.
చాణక్య హాస్పిటాలిటీ గ్రూప్ – టీగ్రిల్ రెస్టారెంట్
నానక్రామ్గూడలో ఉన్న Tea Grill రెస్టారెంట్లో జరిగిన తనిఖీలు కేవలం ఫుడ్ బిజినెస్కే పరిమితం కావు. ఇది మద్యం మాఫియాకు ఢిల్లీ-హైదరాబాద్ మధ్య కూడలి కేంద్రంగా వాడినట్టు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ముగ్గురు వ్యాపారవేత్తలు జగన్ హయాంలో మద్యం సరఫరా, చౌకగా టెండర్ల కేటాయింపు, అక్రమ లాభాలపై కీలక పాత్రధారులుగా చర్చకు వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ దాడులు జరగడం కేవలం అనుకోకుండా జరిగిందా? లేక ఇది రాజకీయ సంస్కరణల ప్రారంభ సంకేతమా? అనేది తేలాల్సి ఉంది.