వైసీపీ నాయకులపైన మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తల్లికి వందనం’ పేరుతో తనపైన లేని పోని ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. తల్లికి వందనంలో తల్లుతకు రూ. 13 వేలు ఇచ్చి, తక్కిన రూ. 2వేలు తన ఖాతాలో వేసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారని, తన ఖాతాలో రూ. 2వేలు పడినట్లు నిరూపించాలని, అలా రుజువు చేయని పక్షంలో క్షమాపణలు చెప్పి వారు చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, అలా చేయకుంటే ఆరోపణలు చేసిన వైసీపీ నాయకులపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లోకేష్ మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ హెచ్చరించారు.
గత వైసీపీ ప్రభుత్వం 42 లక్షల మందికి అమ్మ ఒడి ఇస్తే.. తమ కూటమి ప్రభుత్వం 67.27లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. అర్హులు ఎంత మంది ఉన్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వ హయాంలో రూ. 3,405 కోట్లు అదనంగా తల్లికి వందనం కింద ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నగదు జమ చేస్తున్నామని, ఇప్పటి వరకు 18.55 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు. కొంత మంది తల్లుల ఖాతాలు పని చేయక పోవడం వల్ల జమ చేసిన నగదు తిరిగి వెనక్కి వచ్చాయని, ఆయా తల్లులు వారి బ్యాంకు ఖాతాలను తిరిగి యాక్టివ్ చేసుకోవాలని సూచించారు. అలా యాక్టివ్ అయ్యాక ఆ తల్లుల ఖాతాల్లో కూడా నగదు జమ చేస్తామన్నారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే 80 శాతం మంది విద్యార్థులకు కిట్లు అందించామని, తక్కిన స్కూళ్లకు కూడా ఈ నెల 20 లోపు అందించడం జరగుతుందన్నారు.
సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం కూడా తొలి రోజు నుంచే మొదలు పెట్టామన్నారు. 9,600 పాఠశాలల్లో వన్ క్లాస్– వన్ టీచర్ మోడల్లోకి తీసుకొచ్చినట్లు లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఉచిత కరెంటు ఇస్తున్నామని, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూపిస్తామన్నారు. సోమవారం నాటికి టీచర్ల ట్రాన్సఫర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని, మరో వైపు మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ కూడా జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారనే వివరాలు తెలుసుకునేందుకే తనకు 100 రోజులు పట్టిందని, అంత లోతుగా వెళ్లి విద్యా శాఖలో మార్పులు తెస్తున్నామని, గతంలో పని చేసిన విద్యా శాఖ మంత్రి ఏమి చేశారో మాకు తెలియదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యా ప్రమాణాలు పెంచడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.