రాయలసీమ 'భూదేవుడు' సర్ థామస్ మన్రోకి నివాళి

నేడు 264 వ జయంతి: 200 యేళ్ల కిందట 2,06,819 మంది దున్నేవాళ్లకి భూమి పట్టాలు ఇచ్చిన మహనీయుడు.;

Update: 2025-05-26 07:20 GMT
Gooty Cemetery – Original Burial Site of Major-General Sir Thomas Munro

దున్నే వాడికి భూమి పట్టా ఇచ్చి,  రాయలసమీ ప్రాంతంలో తొలిసారి రైతుకు భూమి పట్టా అంటే ఏమిటో చూపించిన మహానీయుడు థామస్ మన్రో. ఈ రోజు ఆయన నేడు 264 వ జయంతి. ఈ ప్రాంతంలో పేదలకు ఆయన నిత్య సంస్మరణీయుడు. ఈ సందర్భంగా ప్రత్యేక నివాళి


బ్రిటిష్ ఇండియా అత్యంత ప్రభావవంతమైన వలస పాలనాధికారి , దార్శనికుడు, ఆపద్బాంధవుడు రైతు బాంధవుడు సర్ థామస్ మన్రో (Sir Thoman Munro) మే 27, 1761న స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జన్మించిన మన్రో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లో విశిష్ట సైనికుడిగా రాజనీతిజ్ఞుడిగా పనిచేశాడు.

19వ శతాబ్దం ప్రారంభంలో మద్రాస్ ప్రెసిడెన్సీ పరివర్తనాత్మక ముద్ర వేశారు. అమెరికా రెవెల్యూషన్ యుద్ధంలో పొగాకు వ్యాపారం పీకల్లోతు నష్టాల్లో ఉన్న వ్యాపారి కుటుంబంలో జన్మించిన మన్రో, గ్లాస్గో విశ్వవిద్యాలయంలో అథ్లెట్‌గా జీవితం ప్రారంభించి గడిపి 1779లో, మద్రాస్ సైన్యంలో పదాతిదళ క్యాడెట్‌గా భారతదేశానికి వచ్చారు.

మన్రో త్వరగా ర్యాంకుల ద్వారా ఎదిగాడు, హైదర్ అలీకి వ్యతిరేకంగా తరువాత టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో విశిష్టత సేవలందించాడు. 1792 లో టిప్పు సుల్తాన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాలను నిర్వహించటానికి సహాయం చేయడానికి ఆయన ఎంపికైనప్పుడు ఆయన సైనిక చతురత పరిపాలన నైపుణ్యాలు తెరపైకి వచ్చాయి. 1799లో టిప్పు సుల్తాన్ పతనం తర్వాత, మన్రో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన సీడెడ్ జిల్లాల్లో పని చేశారు. అక్కడ ఆయన ప్రభుత్వానికి సాగుదారునికి మధ్య ప్రత్యక్ష భూ ఆదాయ ఏర్పాటు అయిన రైత్వారీ వ్యవస్థను ప్రారంభించారు. గ్రామీణ భారతదేశంపై ఆయనకున్న అవగాహన పరిపాలన సామర్థ్యం పట్ల నిబద్ధత బ్రిటిష్ అధికారులు, స్థానిక ప్రజల ప్రశంసలు పొందారు.

1814లో, మన్రో మద్రాస్ న్యాయ పోలీసు వ్యవస్థలను సంస్కరించాలని ఆదేశాలతో భారతదేశానికి తిరిగి వచ్చారు. 1820 నాటికి, ఆయన మద్రాస్ గవర్నర్‌గా నియమితులయ్యారు, ఈ పదవిలో ఆయన 20వ శతాబ్దం వరకు కొనసాగిన రెవెన్యూ సేకరణ ప్రజా పరిపాలన సుదూర సంస్కరణలు అమలు చేశారు. 1817లో పిండారీ యుద్ధంలో, అప్పటి బ్రిగేడియర్-జనరల్ అయిన మన్రో, పేష్వా భూభాగాలను సమర్థవంతంగా అణచివేసే ఒక చిన్న రిజర్వ్ విభాగానికి నాయకత్వం వహించాడు. లార్డ్ కానింగ్ తరువాత బ్రిటిష్ పార్లమెంట్‌లో గుర్తించినట్లుగా, మన్రో నిశ్శబ్దంగా కానీ ప్రభావవంతంగా వ్యవహరించిన ప్రచారం రక్తపాతం లేకుండా ఈ ప్రాంతంలో శాంతి తీసుకువచ్చింది - ఇది అతని నాయకత్వం దౌత్యానికి నిదర్శనం.

అతని సేవలకు గాను, మన్రో 1819లో నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బాత్ గా నియమించబడ్డాడు తరువాత 1825లో బారోనెట్‌గా నియమించబడ్డాడు. తెలుగు మాట్లాడే ప్రజలు, మన్రోను ఆప్యాయంగా మాండ్రోలయ్య అని పిలుస్తారు, స్థానిక అధిపతులతో, పాలిగార్లు అని పిలువబడే వారితో శాంతిని నెలకొల్పడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు అలాగే సాంస్కృతిక సున్నితత్వానికి ఆయన నిబద్ధత గుర్తించబడింది, వలస పాలనాధికారులు చాలా అరుదు.

మంత్రాలయం గురించిన కథనం ప్రకారం, అప్పటి బళ్లారి కలెక్టర్‌గా ఉన్న మన్రో   ద్వైత సాధువు శ్రీ రాఘవేంద్ర స్వామి నుంచి దైవిక ఆశీర్వాదం (మంత్రక్షరం) పొందాడు, ఆయన ఆదాయ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక దర్శనంలో అతని ముందు కనిపించారని చెబుతారు. మఠానికి అనుకూలంగా వచ్చిన ఈ ఆదేశం ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో భద్రపరచబడి, ఇప్పటికీ గౌరవించబడుతోంది.

వ్యాపారులుగా వచ్చి మన దేశంలో స్థిరపడి దేశాన్ని దోచుకున్నారు ఆంగ్లేయులు. వారిలో అధిక సంఖ్యాకులు అవినీతిపరులు, అక్రమార్జనాపరులు, అహంకారులు. ప్రజల పట్ల ఏ మాత్రం అభిమానం లేనివారు. కారు చీకట్లలో వెలుగురేఖల వలె కొందరు నిజంగా మన దేశాన్ని ప్రజలను ప్రేమించారు. మన సంస్కృతి పట్ల గౌరవంతో వ్యవహరించారు.

ప్రధానంగా తెలుగు ప్రజలు మరువరాని తెల్లదొరలలో అగ్రగణ్యుడు సర్ థామస్ మన్రో రాయలసీమ వాసులకు ఆపద్భాంధవుడు మన్రో. "ప్రజల పట్ల నిజాయితీతో కూడిన సానుభూతిగల సునిశిత మేధావి" అని కార్ల్ మార్క్స్ చే ప్రశంసలందుకున్న పరిపాలకుడు సర్ థామస్ మన్రో. థామస్ మన్రో రైతుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించాడు. రైత్వారీ విధానం ప్రవేశపెట్టి తరతరాల నుండి పాలేగాండ్ర దోపిడీకి గురై అనేక ఇబ్బందుల పాలైన రైతులను ఆదుకున్నాడు. 1804 లో కడప జిల్లాకు వరదలు వచ్చినప్పుడు చెరువులను, కాలువలను సకాలంలో మరమ్మత్తు చేయించి పుష్కలంగా పంటలు పండే ఏర్పాటు చేశారు.

1807లో మన్రో తన పదవికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగి వెళ్ళాడు.మన్రో 1820 జూన్ 8 వ తేదీన మద్రాసు గవర్నర్ గా తిరిగి వచ్చాడు. అతడు పాలించిన ఏడు సంవత్సరాలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ కలరా వ్యాధి సోకి 1827, జూలై 6వ తేదీన మరణించాడు.మతసహనముబ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కానుకగా ఇచ్చాడు. దీనిని మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు.

తాడిపత్రిలో చింతలరాయస్వామి ఆలయ ఆస్థాన మంటపాన్ని, కళ్యాణ మంటపానికి మరమ్మత్తు చేయించారు. ఆలయంలో సక్రమంగా పూజలు జరిగే ఏర్పాటు చేశారు. రాయదుర్గంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించాడు. ఆలయానికి మాన్యాలిచ్చాడు.రాయల సీమ అభివృద్ధికి తోడ్పాటు రాయలసీమ తరతరాలుగా అనావృష్టి గురియైన ప్రాంతం. ప్రకృతి వైపరీత్యాలకు తోడుగా, పిండారీ దోపిడీలు, పాలేగాండ్ర దురాగతాలు సీమ ప్రజలు నానా యాతనలు గురిచేసేవి. అశాంతితో పరితపిస్తున్న ప్రజానీకాన్ని ఆదుకొని, సీమలో శాంతిభద్రతలను నెలకొల్పిన మహనీయుడు మన్రో.

దత్త మండలాల కలెక్టరుగా 1792లో జరిగిన శ్రీరంగపట్నం సంధి ప్రకారం కడప, అనంతపురం, కర్నూలు, బళ్ళారి నిజాం పాలన లోనికి వచ్చాయి. నిజాం పాలనలో అరాచకం మరింత పెరిగింది. పాలెగాళ్ళ అక్రమాలకు అంతులేకపోయింది. కడప జిల్లాలో వేముల పాలెగాడు తనను తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. కొరవలు, యానాదులు, బేడర్లు, ఎరుకలు గ్రామాలపై బడి దోచుకొసాగారు. అట్టి పరిస్థితిలో 12-10-1800 న దత్త మండలాల ప్రధాన కలెక్టరుగా మన్రో నియమింపబడ్డాడు. అతని క్రింద నలుగురు సబ్ కలెక్టర్లు వుండేవారు. ఆదోని, హల్పనహళ్ళి, కడప, కంబం లో వీరి కార్యాలయాలు వుండేవి.

మన్రో కు సహాయంగా మేజర్ జనరల్ డుగాల్డ్ క్యాంబెల్ నాయకత్వంలో ప్రధాన కేంద్రాలు సైనిక దళాలుండేవి. అనంతపురం డివిజన్ మాత్రం మన్రో ఆధీనంలో ఉండేది.సిద్ధవటం లో వున్న కడప జిల్లా కార్యాలయం 1812లో కడపకు మార్చబడింది. 1828లో కంబం, దూపాడు, కోయిల కుంట్ల ప్రాంతాలను కడప జిల్లా నుండి విడదీసి కర్నూలు జిల్లాగా ఏర్పాటు చేశారు. 1911లో మదనపల్లి, వాయల్పాడు ప్రాంతాలను కడప జిల్లా నుండి విడదీసి చిత్తూరు జిల్లాగా ఏర్పాటు చేశారు. సర్ థామస్ మన్రో ఈస్టిండియా కంపెనీ వారి మద్రాసు సైన్యంలో ఒక సైనికుడు. కుటుంబ పరిస్థితుల వల్ల ఉన్నత విద్య పూర్తి చేయలేక, కంపెనీ కొలువులో చేరాడు. జీతం తక్కువైనా సర్దుకున్నాడు. ఎర్స్ కీన్ అనే మిత్రునికి రాసిన జాబులో యిలా అన్నాడు - భారతదేశానికి వచ్చేదాక నాకు, ఆకలి దప్పులు, అలసట, బీదరికం అంటే ఏమిటో తెలియదు. ఇక్కడ మొదటి రెండూ నాకు అప్పుడప్పుడు అనుభవంలోకి వస్తుండగా మూడవది మాత్రం నన్ను వెంటాడుతూ ఉంది.మొదటి మూడు సంవత్సరాల కాలంలో రాత్రిపూట తన పుస్తకాలు తలగడగా, నాలుగు కర్రలపై పరచిన కాన్వాస్ గుడ్డ పరుపుగా, వేసుకునే కోటు దుప్పటిగా ఉపయోగించినట్లు మిత్రునికి 23-7-1789లో వ్యాసిన జాబులో పేర్కొన్నాడు. పదేళ్ళ పాటు సైనికుడుగా మంచి పేరు సంపాదించారు.

రెవెన్యూ విధానాన్ని రూపొందించుటలో శిక్షణ పొందారు. 18వ శతాబ్ది చివర ల్యాండ్ సెటిల్‌మెంట్ నిర్వహణకు దక్షిణ కన్నడ ప్రాంతానికి పంపబడినాడు. రైతు బాంధవుడు మన్రో నిజాయితీపరుడు. ప్రజల నుంచి, రైతుల నుంచి ఎట్టి కానుకలు స్వీకరించే వారు కాదు. మన్రోకు స్వాతగమివ్వటానికి ఒక గ్రామాధికారి తన గ్రామంలో పెద్ద పందిరి వేయించాడు. అందుకు కూలీలకు పైసా ఇవ్వలేదని తెలుసుకున్న మన్రో, పందిరి వద్దకు వెళ్ళక, చెట్టునీడన చిన్న డేరాలో మకాం చేశారు. రైతుల నుండి పాలు, పళ్ళు కూడా ఉచితంగా తీసుకునే వాడు కాదు. తన క్రింది అధికారులను కూడా అలాగే ఉండనిచ్చాడు. రైతుల నుంచి ఎక్కువ శిస్తు వసూలు చేయడం న్యాయం కాదన్నాడు. భూసంబంధమైన చట్టాల ముందు బీదలు, ధనికులు అన్న తేడా వుండరాదన్నాడు. ఎవరైనా సరే తనకున్న భూమినంతటినీ తనకున్న వనరులతో సాగు చేసుకోవచ్చు నన్నాడు. అంతవరకు గ్రామ ప్రాంతాల్లో భూముల మీద వున్న అగ్రవర్ణాల వారి పెత్తనంపై చావు దెబ్బతీశాడు. భూమి ప్రభుత్వ ఆస్తి, నిర్ణీత శిస్తు రైతులకు కౌలు కు ఇవ్వాలని ఆదేశించారు.

రాయలసీమ ప్రాంతంలో తానున్న ఏడేళ్ల కాలంలో మన్రో 2,06,819 పట్టాలను రైతులకు అందజేశారు. రైతులకు భూమిపై సర్వహక్కులు వుంటాయని ప్రకటించారు. అందువల్ల భూమి సాగు గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఆదాయం పెరిగింది. భూస్వాములు రైతులకు అన్యాయం చేస్తున్నట్లు వార్త వచ్చిన వెంటనే వారి వద్దకు వెళ్ళి వారి కష్టసుఖాలు విచారించాడు. మైళ్ళ తరబడి కాలినడకన గ్రామాలను చూచేవాడు. పూడిపోయిన చెరువులు కనబడిన వెంటనే పూడిక తీయించే ఏర్పాటు చేసేవారు.ఉదారమైన భూమిశిస్తును ప్రకటించడం మన్రో గొప్పదనానికి నిదర్శనం.

రైతు తన ఫలసాయం నుండి 2/3 వంతు మిగుల్చు కొన్నపుడు భూమి విలువైన ఆస్తి కాగలదన్నాడు మన్రో. 1807 లో అన్ని రకాల భూముల మీద 25 శాతం పన్ను తగ్గించాడు. రైతులు తవ్వుకొన్న బావులు, చెరువు మీద అదనంగా 8 1/3 శాతం పన్ను తగ్గింపు సిఫార్సు చేశారు. ఈ విధానాన్ని 1820లో మద్రాసు గవర్నర్ గా చేరిన తర్వాత అమలు చేశారు.

1807లో మన్రో కలెక్టర్ పదవికి రాజీనామా చేసి లండన్ చేరాడు. మద్రాసు ప్రభుత్వం రైత్వారీ విధానాన్ని రద్దు చేసి గ్రామీన శిస్తు విధానాన్ని అమలుపరచింది. శిస్తు ఒక సంవత్సరం నుండి మూడేళ్లపాటు వసూలు చేసే హక్కు గ్రామ పెద్దకు లభించింది. మరల అగ్రవర్ణాల ఆధిపత్యం మొదలైంది. 1820లో మద్రాసు గవర్నర్ గా వచ్చిన మన్రో పాత విధానాన్ని తిరిగి అమలు చేశారు. అరాచకాలకు అడ్డు కట్ట ఆ కాలంలో రాయలసీమలో 80 మంది పాలెగాళ్ళ ఉండేవారు. వారిలో కడప జిల్లాలో వేముల, చిట్వేలి, పోరుమామిళ్ల, నరసాపురం, అప్పారెడ్డిపల్లి, ఉప్పులూరు, కమలాపురం పాలెగాళ్ళు ముఖ్యులు. వీరు నిరంకుశులు. గ్రామాలను దోచుకున్నారు. బందిపోట్లుగా వారి అనుచరులుండేవారు.

హైదర్ అలీ, నిజాం, గోల్కొండ నవాబులు కూడా వారిని అరికట్టలేక పోయారు. మన్రో తీవ్ర చర్యలతో వీరి ఆట కట్టించాడు. పాలెగాళ్లను, కావలి వాళ్ళను కఠినంగా శిక్షించాడు.అరాచకంగా వున్న రాయలసీమ జిల్లాల్లో జిల్లా కోర్టులు, పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేశారు. మన్రో కఠిన చర్యల వల్ల సుస్థిరమైన పాలన ఏర్పడింది. పాలనాపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.1813 లో ఛార్టర్ చట్టానికి సంబంధించిన పార్లమెంటు కమిటీ ముందు సాక్ష్యమిస్తూ, భారతదేశ సంస్కృతి అనుసరించడం వల్ల ఇంగ్లండు లాభపడుతుందన్నాడు.

భారతీయులు తయారు చేసే వస్తువుల నాణ్యత, ఐరోపాలో సమానమైనదన్నాడు. భారతీయ ప్రజల పట్ల, మేధావుల పట్ల, చేతి వృత్తుల వారి పట్ల ఎంతో గౌరవముండేది.భారతీయులు తెలుగు, ఇంగ్లీషు భాషలు నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి వీలుగా జిల్లా తాలూకా స్థాయిలో పాఠశాలలు నెలకొల్పారు. 1805 నాటికి మన్రో తెలుగు వ్రాయను, చదవనూ నేర్చుకొన్నాడు. రాయలసీమ రైతులతో ఆయన తెలుగులో మాట్లాడేవారు. తన క్రింది అధికారులు కూడా విధిగా తెలుగులో వ్యవహరించాలని ఆదేశించాడు. సి.పి.బ్రౌన్ ఆయన మాటల నాకెంతగానో గౌరవించేవాడు.


Tags:    

Similar News