కుప్పంలో చంద్రబాబు ‘విమానం’ ఎగిరేనా?
భూములు ఇచ్చేందుకు ముందుకు రాని రైతులు;
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం(kuppam)లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ (Greenfield airport) నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం భారీగా భూసేకరణ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. భూసేకరణకు అన్ని చోట్ల రైతులనుంచి వ్యతిరేకత వస్తున్నట్లే కుప్పం విమానాశ్రయానికి కూడా పరిసర గ్రామాల రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నది.తరతరాలుగా సేద్యం చేసుకుని జీవిస్తున్న తమ భూముల తీసుకుని విమానశ్రయం కడతారంటే రైతులు నమ్మలేకపోతున్నారు. దీనితో ‘మాకేమి ప్రయోజనం’ అంటున్నారు.
కుప్పంలో ఎయిర్పోర్ట్ ఎందుకు? ప్రభుత్వం చెబుతున్నదేంటి ?
ఆమూల చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్నాటకలకు సమీపాన కుప్పం ఉంటుంది. నియోజకవర్గానిని చేరుకోవడం అంతసులభం కాదు. తిరుపతి నుంచి వెళితే బస్సు అయిదు గంటల ప్రయాణం ఉంటుంది.తిరుపతితో కలిపే రైలు మార్గం లేదు. ఇది ఒక వెనకబడిన ప్రాంతం. బిసి వోట్లర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. అందుకే రెడ్ల ప్రాబల్యం అంతగా లేని ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు తెలివి ఎంచుకున్నారని కొందరు చెబుతారు. ఏమైతే నేమి నియోజవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం విజన్ డాక్యమెంట్ ను ప్రకటించారు. కుప్పం డెవెలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఆ ప్రాంత రూపురేఖలు మార్చాలని భావిస్తున్నారు. కుప్పం ని డెవెలప్ మెంట్ హబ్ గా మార్చాలనే లక్ష్యం ఆయనకు ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి ఆశయం ఉన్నపుడు ఎయిర్పోర్ట్ దీనికి బలమైన ప్రేరణనిస్తుంది.
ఒక ఎయిర్పోర్ట్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించి, కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహమీయవచ్చు. చిత్తూరు జిల్లా మామిడి, టమాటా వంటి అనేక వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఎయిర్పోర్ట్ ద్వారా ఈ ఉత్పత్తులను వేగంగా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులు లబ్ధి పొందవచ్చు.ఇది చెవులకు ఇంపైనా వాదన.
తిరుపతిలో ఇపుడు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది కుప్పానికి 180 కిమీ దూరాన ఉంటుంది. మరొక సమీప విమానాశ్రయం బెంగుళూరు. ఇది 120 కి.దూరాన ఉంటుంది. ఇపుడు కుప్పానికి వెళ్లాలంటే చంద్రబాబు నాయుడు ముందు బెంగుళూరు వెళ్లి అక్కడి నుంచి కారులో కుప్పం రావాలి. లేదా తిరుపతికి వచ్చి హెలికాప్టర్ లో రావాలి.
కుప్పంలో అడ్రసు లేని చంద్రబాబు
కుప్పంలో ఆయనకు ఇంతవరకు ఇల్లంటూ లేకుండా ఉండింది. మొన్న ఎన్నికల్లో ఇల్లులేని విషయం, ఆయన నాన్ లోకల్ అనే విషయం కూడా చర్చనీయాంశమయింది. ఇది బిసిల నియోజకవర్గం, బిసియే ఎమ్మెల్యే కావాలని వైసిపి బిసిని చంద్రబాబు మీద పోటకీ పెట్టింది. ఏమైనా సరే కుప్పంనుంచి చంద్రబాబుని తరిమేనాయలనే ఉద్దేశంలో వైసిసి అధినేత నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘అడ్రసులేనిచంద్రబాబు’ అనే విషయాన్ని హైలైట్ చేస్తూ బాగా క్యాంపెయిన్ చేశారు. దీనికోసం జిల్లా రాజకీయాల్లో పట్టున్న వాడేకాదు, కాలేజీ రోజుల నుంచి చంద్రబాబు తో రాజకీయ వైరం ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ఇన్ చార్జి చేశారు. జగన్ ప్రయత్నాలతో చందబాబులో టెన్షన్ మొదలయింది. కుప్పంను కాపాడుకోవాలనే పట్టుదట పెరిగింది. ఎపుడూ లేనిది తొలిసారి ఆయన భార్య భువనేశ్వరి కూడా ప్రచారం చేశారు. చివరకు సొంతంగా ఇల్లు కూడా కట్టుకూడా కుట్టుకున్నారు. ఇపుడు కుప్పంలో ఆయనకు ఒక అడ్రసు ఏర్పడింది. ఇక నుంచి కుప్పానికి రాకపోకలు పెరిగే అకాశం ఉంది. దీనివల్ల కూడ కుప్పంలో ఒక విమానాశ్రయం అవసరం.
సమస్యగా మారిన కుప్పం విమానాశ్రయ భూసేకరణ.. వ్యతిరేకిస్తున్న రైతులు
కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని, రైతులు పండించే కూరగాయలు, పూలు, పండ్లు ఎగుమతులు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని , 2014లో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు భూమి పూజ చేశారు. అప్పట్లోనే తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తిరగబడడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తరువాత 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా విమానాశ్రయం నిర్మాణానికి 294 ఎకరాలను సేకరించాలని ప్రయత్నించింది.
అప్పుడు కూడా రైతులు ఒప్పుకోక పోవడంతో ఆ ప్రయత్నం విరమించింది. ఇప్పుడు చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో కుప్పం ప్రాధాన్యత పెరిగింది. చంద్రబాబు విజన్ నిండా భారీగా భూములు అవసరయ్యే ప్రాజక్టులే ఉన్నాయి. అందువల్ల విమానాశ్రయాలు ఒకటి. అందుకు రైతుల నుంచి చాలా చోట్ల భూములు ఇచ్చేందుకు వ్యతిరేకత వస్తున్నది. ఈనేపధ్యంలో మళ్లీ కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం తెరపైకి వచ్చింది.
ఈ సారి ఏకంగా ఎన్ డిఎ ప్రభుత్వం 1474 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రామకుప్పం, శాంతిపురం మండలాల్లోని 23 గ్రామాల రైతుల నుంచి ఈ భూములను సేకరించాలని నిర్ణయించింది. అయితే తమ విలువైన భూములను వదులుకునేది లేదని రైతులు తేల్చి చెబుతుండటంతో సమస్య మొదలైంది.
అయితే ఎకరానికి 16 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. దానికి కొందరు రైతులు ఒప్పుకుంటున్నా, మెజార్టీ రైతులు, రైతు కూలీలు రైతులు వ్యతిరేకిస్తున్నారు. రైతులకు వ్యవసాయ కార్మిక సంఘం అండగా నిలిచి ఉద్యమిస్తోంది.2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించి, 70 శాతం రైతులు ఆమోదం తెలిపితేనే భూములను సేకరించాల్సి ఉంది. వ్యవసాయ కార్మికులకూ, అక్కడ వున్న వృత్తిదారులకూ నష్టపరిహారం ఇవ్వాల్సి వుంటుంది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని తేల్చిచెప్పింది.
అయితే 2013 భూసేకరణ చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపిస్తోంది. ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు విమర్శించారు. రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అదే ప్రాంతంలో వున్న వైసీపీ నేతలు తమ భూమిని ఇవ్వడానికి ససేమిరా అంటున్నట్లు చెబుతున్నారు.
అధికారులు బెదిరిస్తున్నారంటున్న రైతులు
గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి భూములు ఇవ్వాల్సిందేనంటూ జిల్లా అధికారులు బలవంతం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 458 ఎకరాలు సేకరించింది. మొత్తం 1474 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం సిద్దమయింది. రామకుప్పం, శాంతి పురం మండలాలలో భూసేకరణ జరుగుతుంటే, మే నెలలో భూముల పరిశీలనకు వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. బలవంతంగా భూములు లాక్కుంటే అత్మహత్యలు చేసుకుంటామని పురుగు మందు డబ్బాలతో బెదిరించారు.
అధికారులు ఒకవైపు రైతులకు నచ్చచెబుతూనే వార్నింగ్ లు ఇస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము అడిగినప్పుడు ఇస్తే ఎకరానికి 16 లక్షల రూపాయలు వస్తుందని, ఆ తరువాత అయితే 10 లక్షల రూపాయలే ఇస్తామని చెబుతున్నామంటున్నారు. కాదని ఎవరైనా కోర్టు కు వెళ్లితే అసలు డబ్బులే రావని బెదిరిస్తున్నారని చెబుతున్నారు. రివెన్యూ అధికారులతో పాటు పోలీసులు కూడా రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్లు చెప్పడానికి ఇష్టపడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీరికి వ్యవసాయ కార్మిక సంఘం అండగా నిలబడడంతో మీరు ఎంత బెదిరించినా మా భూములను ఇచ్చేది లేదంటున్నారు.డిప్యూటీ కలెక్టర్ వెంకటశివ పేరుతో ప్రాథమిక నోటీసులను సైతం జారీ చేశారు.అయితే గుట్టలు, పుట్టలు ఉన్న ఈ ప్రాంతాన్ని 40 ఏళ్లుగా చదును చేసి కారగాయలు, పూలు, పండ్లు పండించుకుంటూ జీవనోపాధిగా మలచుకుని జీవనం సాగిస్తున్నా మంటున్న రైతులు విమానాశ్రయం తో తమకు ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు.
తాజాగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, శాంతిపురం తహశీల్దార్ శివయ్య ఆయా భూముల వద్దకు వెళ్లగా రైతులు వారిని ముట్టడించారు.మరోవైపు కొందరు వైసీపీ నేతలకు కూడా ఆ ప్రాంతంలో భూములు వుండటంతో ప్రభుత్వ భూసేకరణకు వారి నుంచి అడ్డంకులు వస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికులకు, నిరుద్యోగులకు ఎందుకూ ఉపయోగం లేని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును నిర్మించొద్దని, చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా 'ల్యాండ్' అవడానికి తప్ప స్థానికులకు ఎందుకూ ఉపయోగపడదని వ్యవసాయ కూలీ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. రైతులు మూడు పంటలు వేసుకుని, సంతోషంగా జీవనం గడుపుతుంటే బలవంతంగా వారి భూములను లాక్కుని, వారిని నట్టేట ముంచడం భావ్యం కాదంటున్నారు.
సరియైన పరిహారం రాకుండా ,తమ ఉపాధి కూడా కోల్పోతే జీవనం ఎలా అని రైతులు ప్రశ్నిస్తుంటే, తగిన పరిహారం వుంటుందని , విమానాశ్రయం వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కుప్పం ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు హామీ ఇస్తున్నారు.
చంద్రబాబు చొరవ తోనే ఎకరానికి రూ.16 లక్షలు
2014 లో ముందుగా కుప్పంలో కార్గో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని నిర్ణయించినా, ప్రస్తుతం డొమెస్టిక్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలని తీర్మానించారు. కొందరు రైతులు వ్యతిరేకిస్తున్నా, భూసేకరణ సర్వే మాత్రం కొనసాగుతోంది. ప్రభుత్వ రేటు ప్రకారం అక్కడ ఎకరా ధర 2నుంచి 5 లక్షల రూపాయలు వుంటుందని, దానికి రెండింతలు వేసుకున్నా ,ఎకరాకు పదివేలు మాత్రమే వస్తుందని, ముఖ్యమంత్రి చొరవతో ఎకరాకు 16 లక్షలు ఇస్తున్నారని కుప్పానికే చెందిన అజగర్ తెలిపారు.
చిన్న ఎయిర్ పోర్టులు నడుస్తాయా?
ఈ మధ్య ‘బ్లూమ్ బర్గ్’ భారత దేశంలో విమానాశ్రయాలు దీనావస్థలో ఉన్నాయని, చాలా విమనాశ్రయాలకు ప్రయాణికులేరని రాసింది. దీనికి ఉదాహరణగా హిసార్ విమానాశ్రయ పరిస్థితి గురించి చెప్పింది. హిస్సార్ అనే చిన్న నగరంలో భారత కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించినప్పుడు, ఆశయాలు గొప్పగా ఉన్నాయి. రెండు మిలియన్ల మంది ప్రయాణీకులు ఉపయోగిస్తారని ప్రచారం జరిగింది. న్యూఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే టెర్మినల్లకు ప్రత్యామ్నాయంగా ప్రచారం చేసింది. కానీ రిబ్బన్ కట్ చేసిన చాలా సంవత్సరాల తరువాత, హిసార్ విమానాశ్రయం ఇప్పటికీ పనిచేయడం లేదని బ్లూమ్ బర్గ్ రాసింది. ప్రయాణికుల హాళ్లు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి, వీధి కుక్కలు రన్వేపై విశ్రాంతి తీసుకుంటాయని రాసింది. విమానాశ్రయంలో సైనిక జెట్లు, రాజకీయ నాయకులను తీసుకెళ్లే విమానాలు అపుడపుడు ఎగురుతున్నా 2021 నుండి హిసార్ నుండి వాణిజ్య విమానాలు నామమాత్రంగానే నడుస్తున్నాయని బ్లూమ్ బర్గ్ రాసింది.
ఈ నేపథ్యంలో కుప్పం విమానాశ్రయ నిర్మాణం ప్రయత్నాలు సాగుతున్నాయి.
చిన్న విమానాశ్రయాలు (airport) సమగ్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనవి. దీనిని ఎవరూ కాదనలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనిస్తోంది.మరి కుప్పంలో ఏమి జరుగుతోంది? విమానాశ్రయ భూసేకరణను వ్యతిరేకిస్తోంది ఎవరు? ఇందులోనూ రాజకీయం వుందా?
కుప్పంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో దీర్ఘకాలికంగా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన డిమాండ్, ప్రత్యామ్నాయాల పరిశీలన చాలా అవసర మన్నది కొందరి సూచన. ముందుగా సమగ్రమైన అధ్యయనం(Feasibility Study) నిర్వహించాలి. ఈ అధ్యయనం ద్వారా ప్రయాణికుల సంఖ్య, కార్గో రవాణా, ఆర్థిక లాభనష్టాలు, పర్యావరణ ప్రభావం వంటి అంశాలను నిశితంగా పరిశీలించాలి. బెంగళూరు, తిరుపతి విమానాశ్రయాల నుండి కుప్పంకు మెరుగైన రోడ్డు, రైలు కనెక్టివిటీని అభివృద్ధి చేయడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పేరు రాసేందుకు ఇష్టపడని ఎస్వీ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వున్న మూడు చిన్న విమానాశ్రయాలతో దీనిని పోలుస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి విమానాశ్రయం మంచి స్థాయిలో ఉపయోగపడుతుండగా, కడప, కర్నూలు విమానాశ్రయాలు తమ పూర్తి సామర్థ్యాన్ని ఇంకా చేరుకోలేదు.
ఈ విమానాశ్రయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి, ప్రభుత్వం, విమానయాన సంస్థలు, స్థానిక ప్రజల సహకారం అవసరం. మరిన్ని మార్గాలను ప్రారంభించడం, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం అవసరం. రాయలసీమ లోనే ఇప్పటికే తిరుపతి రేణిగుంట విమానాశ్రయం తో పాటు కడప, కర్నూలు ఎయిర్ పోర్ట్ లు వున్నాయి. తిరుపతిని మినహాయిస్తే మిగిలిన రెండు విమానాశ్రయాలకు ఆదరణ లభించడంలేదు.
ఇలాంటి తరుణంలో కుప్పంలో ఎయిర్ పోర్ట్ కడితే పరిస్థితి ఏమిటన్నది ప్రధాన ప్రశ్న. ముఖ్యమంత్రి గా చంద్రబాబు రాకపోకలకు అవసరమయితే చిన్న స్థాయిలో మంచి హెలీప్యాడ్ నిర్మించుకుంటే సరిపోతుందనేది కొందరి వాదన.