Kuppam | కంగుంది ఖిలాపై 'యోగాతో అభివృద్ధి సంతకం'
జమిందార్ల కోటకు పర్యాటక శాఖ నగిషీలు అద్దుతోంది. త్వరలో లైట్ అండ్ మ్యూజిక్ షో, రోప్ వే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-15 08:17 GMT
చిత్తూరు జిల్లా కుప్పం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది. సీఎం ఎన్. చంద్రబాబు. ఈ ప్రాంతంలో వెయ్యేళ్లనాటి కంగంది కోట నుంచి జమిందార్ల పాలన సాగింది. ఆదివారం యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ చరిత్ర భావితరాలకు తెలియజేయాలనే ప్రయత్నానికి నాంది పలికారు. పర్యాటకులను ఆకట్టుకోవడానికి లైట్ అండ్ మ్యూజిక్ షో, రోప్ వే అందుబాటులోకి తీసుకురానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ప్రదేశాల వేదికగా నిర్వహిస్తున్న యోగాతో పర్యాటకులను కూడా ఆకట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఆ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. శిథిలస్థితిలో ఉన్న రాజులు, జమిందార్లు పాటించిన కోటల చరిత్ర మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కట్టడాల చరిత్ర మరుగున పడకుండా కాపాడాలని ప్రభుత్వం సంకల్పించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర (మే 21 నుంచి జూన్ ) కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రదేశాల్లో యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కుప్పం సమీపంలోని కంగుంది జమిందార్ల కోటపై ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్. మునిరత్నం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.
ఆరోగ్యం, సౌభాగ్యం, ఆనందమయ జీవితం సాధ్యమన్నారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతి మండలంలో యోగా కార్యక్రమాలు నిర్వహించడం కోసం శ్రద్ధ తీసుకుంటామన్నారు.
కంగుంది కోటలో యోగా డే నిర్వహించడం వెనుక కూడా ప్రాధాన్యత ఉందని చిత్తూరు జిల్లా పర్యాటక శాఖాధికారి పీ. గౌరి చెప్పారు.
"ఈ తరహా కార్యక్రమాలు అభివృద్ధి తోపాటు పర్యాటకులను ఆకట్టుకునేందుకు తోడ్పాటు అందిస్తుంది" అని జిల్లా పర్యాటక శాఖాధికారి పీ. గౌరి ఆశాభావం వ్యక్తం చేశారు.
కంగుంది కోట చరిత్ర
చిత్తూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం సమీపంలోని కంగుంది కోట ఏర్పడక ముందు నుంచి బౌద్ధం ప్రధాన మతంగా ఉండేదని చరిత్ర చెబుతున్నది.
చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలో కంగుంది వద్ద సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన కోట ఉంది. ఇక్కడి నుంచి జమీందారులు పరిపాలన సాగించారు. 28 మంది పాలకులు సుమారు 360 గ్రామాల్లో కంగుంది తోపాటు సమీప ప్రాంతాల్లో జమిందార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. జమిందార్ల వ్యవస్థ రద్దు చేసే వరకు వారి పాలన, పెత్తనం సాగింది.
జమీందార్ల పాలన: 1066 నుంచి 1950 వరకు, కంగుంది జమీందారులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 1066లో ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందార్ కంబినాయుడు అనే రాజు మల్లేశ్వరుడికి మహాశివరాత్రి నాడు పూజలు చేయించారు అనేది కథనం.
ఆ గుహలో ఏముంది?
కుప్పం సమీపంలోని ఈ కంగుంది కోటలో సగం దూరం వెళ్లిన తరువాత ఓ గుహకు ప్రత్యేకత ఉంది. పశువుల ఎముకలు, కొమ్ములతో ఆ గుహ నిండి ఉంటుందని స్థానికులు కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ గుహలోకి వెళ్లడం సాధ్యం కావడం లేదనేది ఈ ప్రాంత ప్రజల మాట.
11వ శతాబ్దం నుంచి శివరాత్రి
కంగుంది కోట 11వ శతాబ్దానికి చెందినదని చరిత్ర చెప్పే పాఠం. జమిందార్లు, వారి కుటుంబీకుల సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి. జమిందార్ల భార్యలు 1910లో మరణించినట్లు ఆ సమాధులపై ఉన్న ఫలకాలు చెబుతున్నాయి. ఈ కోటపై ఉన్న ఆలయం అత్యంత పురాతనమైనది. చరిత్ర కలిగినది. మహాశివరాత్రి రోజు ఉత్సవాలు మొదటి నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. స్థానికులే కాకుండా, పొరుగున తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు ఎక్కువగా వస్తుంటారు.
కంగుంది కోట చుట్టూ గ్రామ దేవతలు కొలువై ఉన్నారని, మల్లేశ్వర స్వామిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే శుభాలు కలుగుతాయనేది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. కంగుంది కోట, పరిసర ప్రాంతాలు 4 నుంచి 9వ శతాబ్దాల మధ్య ఏర్పడినట్టు చరిత్ర చెబుతోంది.
ఎలా వెళ్లాలి: కుప్పం నుంచి కంగుంది కోట 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట చుట్టూ గ్రామ దేవతలు కొలువై ఉన్నారు. కంగుంది మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత గిరిప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కంగుంది కోట చారిత్రక ప్రదేశమే కాకుండా, కుప్పం ప్రాంత ప్రజలకు ముఖ్యమైన ప్రదేశం.
యోగాతో అభివృద్ధికి సంతకం
కంగుంది కోటలో యోగా నిర్వహణ వెనుక చారిత్రక కట్టడాల ప్రాముఖ్యత తెరపైకి తీసుకుని రావడం. భావితరాలకు చరిత్ర అందించాలనే లక్ష్యంతో పాటు పర్యాటక ప్రదేశాలను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉందని అధికారులు చెబున్నారు. కంగంది కోటను రానున్న రోజుల్లో ఎలా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు చిత్తూరు జిల్లా పర్యాటకాభివృద్ధి అధికారం పి. గౌరి వివరించారు.
"కంగుంది కోటలో సౌండ్ అండ్ లైట్ మ్యూజిక్ షో" ఏర్పాటు చేయనున్నట్లు గైరి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. కోటపైకి వెళ్లడానికి రోప్ వే కూడా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. వీటికి సంబంధించి Detailed Project Report DPR సిద్ధం చేయడానికి కన్సల్టెంట్లకు అప్పగించినట్లు వెల్లడించారు. మరో పది రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న కంగుంది కోటలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుమతి కోసం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు గౌరి వివరించారు.
చారిత్రక ప్రదేశాల వద్ద అభివృద్ధి, వసతులతో పర్యాటకులను ఆకట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని ఆమె చెప్పారు. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.