కుప్పం: మహిళకు ఆటవిక శిక్షపై సీఎం సీరియస్.. నిందితుల అరెస్టు

బాధిత మహిళను సీఎం చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నిందితులను రిమాండ్ చేశారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-17 16:32 GMT
బాధిత మహిళతో ఫోన్ లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

తన కుప్పం నియోజకవర్గంలో ఓ మహిళ ఆటవికంగా శిక్షకు గురైన సంఘటనపై సీఎం ఎన్. చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి సీఎం చంద్రబాబు శిరీష కుటుంబానికి రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం బాధితురాలు శిరీషకు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు పరామర్శించారు.


"ధైర్యంగా ఉండండి, నేను మీకు అండగా ఉన్నాను" అని భరోసా ఇచ్చారు. కుప్పంలో జరిగిన అమానవీయ ఘటన, అనంతరం పరిణామాలపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం అందేలా చూడాలని ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు.

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేశాడు. ఆ అప్పుల భారం భరించలేక ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ, బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తున్నారు. సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు సోమవారం వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకున్నారు. శిరీషను లాక్కుని వచ్చి, రోడ్డు పక్కనే చెట్టుకు కట్టేసి, అమానవీయంగా వ్యవహరించారు. పోలీసులకు సమాచారం అందగానే స్పందించారు. శిరీషను విడిపించడంతో పాటు ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
కుప్పంలో జరిగిన మీడియాలో రావడం, టీడీపీ నేతల నుంచి సమాచారం అందుకున్న సీఎం ఎన్. చంద్రబాబు వెంటనే చిత్తూరు ఎస్పీ మఠికంఠ చందోలుతో మాట్లాడారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలాఉండగా,
కుప్పంలో శిరీష అనే మహిళను చెట్టుకు కట్టేసి వేధించిన సంఘటనపై రాష్ట్రంలో రాజకీయ విమర్శలు, నిరసనలు వెల్లువెత్తాయి.
"మహిళలకు రక్షణ, శాంతి భద్రతలు లోపించాయని" సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. అప్పటికే నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
"నిందితులు మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరిపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేశాం" అని కుప్పం సీఐ పి. శంకర్ చెప్పారు. మహిళను అక్రమంగా నిర్బంధించడం, అమానవీయంగా శిక్షించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శంకర్ వివరించారు. బాధితురాలు శిరీషను వైద్యం కోసం ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆయన తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామన్నారు.
ఫోన్ లో సీఎం పరామర్శ
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో జరిగిన ఘటనపై సీఎం ఎన్. చంద్రబాబు మరింత సీరియస్ అయ్యారు. బాధితురాలు శిరీషకు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆమెను పరామర్శించి, ఘటనకు దారి తీసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
"గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా?" అని కూడా సీఎం వాకబు చేశారు. సీఎం నుంచి ఫోన్ కాల్ రాగానే  శిరీష భోరున  రోధించింది. సీఎం ప్రశ్నకు సమాధానంగా..
" ఇంతకుముందు చాలాసార్లు ఇబ్బంది పెట్టారు. నిన్న జరిగిన సంఘటనతో పిల్లలు భయపడుతున్నారు. నాకు భయంగానే ఉంది" అని శిరీష గోడు వెళ్లబోసుకుంది.
నేనున్నా.. భయపడకు
అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న సీఎం చంద్రబాబు అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సిఎం హామీ ఇచ్చారు. "పిల్లలను బాగా చదివించు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటా" అని భరోసా ఇచ్చారు.
"ఇకమీదట ఏ సమస్య లేకుండా చేస్తా. భయపడకు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్ణకరం. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదు" అని సిఎం చంద్రబాబు శిరీషకు ధైర్యం చెప్పారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. అని సిఎం ఆమెకు ధైర్య వచనాలు చెప్పారు.

Similar News