ప్రమాద స్థాయికి కృష్ణా, గోదావరి నదులు

డైనమిక్ ఫ్లడ్ మేనేజ్మెంట్ తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Update: 2025-09-29 00:00 GMT
కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వెళుతున్న వరదనీరు

రాష్ట్రంలో నదీ ప్రవాహాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక సమీక్ష చేశారు. డైనమిక్ ఫ్లడ్ మేనేజ్మెంట్ తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరగాలని సిఎం సూచించారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలను రియల్ టైంలో అంచనా వేస్తూ... అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రెయిన్ గేజెస్ ద్వారా కురిన వర్షాన్ని లెక్కించి ఫ్లడ్ మేనేజ్మెంట్ జరపాలన్నారు. వర్షపాతం, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీటి ప్రవాహాల సమాచారాన్ని విశ్లేషించి సమన్వయంతో అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని సిఎం సూచించారు. అదే విధంగా సాధ్యమైనన్ని ఎక్కువ చెరువులను నీటితో నింపాలని అన్నారు.


అధికారులతో ఆన్ లైన్ ద్వారా మాట్లాడుతున్న సీఎం

కృష్ణానదికి 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు

కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆదివారం రాత్రి 12 గంటల సమయానికి 6.57 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి 7 లక్షల క్యూసెక్కులు దాటి వరద నీరు ప్రవహిస్తుంది. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పెరుగుతోంది. అటు గోదావరిలో ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఆదివారం రాత్రి 12 గంటల సమయానికి 10.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంది. సోమవారం ఉదయం నుంచి 11.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంది. అధికారులు ఈ మేరకు అంచనా వేశారు.


దవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడులవుతున్న వరద నీరు

సముద్రంలోకి వేల టిఎంసిల నీరు

కృష్ణా, గోదావరి నదులకు వస్తున్న భారీ వరద కారణంగా వేల టిఎంసిల నీరు సముద్రంలో కలుస్తోంది. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో కలిపి ప్రస్తుతం 94 శాతం నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పైనుంచి ఇంకా వరద వస్తున్న కారణంగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణానది నుంచి సముద్రంలో ఇప్పటి వరకు 1,089 టిఎంసిల నీరు వెళ్లాయని అధికారులు వివరించారు. గోదావరి నుంచి 3,251 టిఎంసిలు సముద్రంలోకి వెళ్లాయి.

సమర్థ నీటి నిర్వహణ, కాలువల్లో ప్రవాహాలు, చెరువులు నింపే కార్యక్రమం వల్ల భూ గర్భ జలాలు పెరిగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భూగర్భ నీటి మట్టం పెరిగినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరి భూగర్భ నీటి మట్టం 8.43 మీటర్లు ఉందని తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 1.25 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపారు.

ముఖ్యంగా రాయలసీమలో గత ఏడాది కంటే 2.07 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇంకా వరదలు, వర్షాలు ఉన్న కారణంగా నీటి సమర్థ వినియోగానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. చెరువులు నింపడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు.

మరోవైపు వరదల కారణంగా ముంపు ఉండే ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు సమాచారంతో అప్రమత్తం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్టీజీఎస్ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News