ఉమ్మడి కడప జిల్లా (అన్నమయ్య జిల్లా) రాయచోటి టీడీపీలో అన్నదమ్ముల అనుబంధం కాస్తా సవాల్ గా మారింది. టిడిపిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు కొడుకు బాలసుబ్రమణ్యం తాడేపల్లిలో బుధవారం ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ పార్టీ కండువా వేసి, స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ వేంపల్లె ఎస్. సతీష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి తోపాటు కడప జిల్లా నేతలు హాజరయ్యారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ రెడ్డి తో కలిసి వెళ్లిన సుగవాసి బాలసుబ్రమణ్యం తాడేపల్లిలో వైసీపీలో చేరారు.
ఈ పరిణామం వైసీపీలో బహుముఖ నాయకత్వం, పోటీ రాజేసింది. భవిష్యత్తుకు బాటలు వేసుకునే రీతిలో పెద్దరెడ్డి కుటుంబం తెరవెనుక పాత్ర పోషించిందని భావిస్తున్నారు.
రాయచోటిలో టీడీపీ దక్కని స్థితిలో ఆగ్రహానికి గురైన మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ రెడ్డిని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీలోకి ఆకర్షించారు. అదేరీతిలో రాయచోటి రాయుడు కొడుకు బాలసుబ్రమణ్యంకు గాలం వేసి లాగారని పార్టీ వర్గాల సమాచారం.
పార్టీ మారాలనే నిర్ణయం వెనుక బాలసుబ్రమణ్యం అంతరంగాన్ని ఆవిష్కరించారు.
"ఇచ్చిన మాట నెరవేర్చలేదనే వేదన నాతో సహా కార్యకర్తల్లో ఎక్కువగా ఉంది. దీనిని జీర్ణించుకోలేకున్నారు" అని బాలసుబ్రమణ్యం వ్యాఖ్యానించారు.
"మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో మాకు సాన్నిహిత్యం ఉంది" అని కూడా ఆయన గుర్తు చేశారు. అందుకే ఎప్పుడూ మా నాన్న రాయుడు వైఎస్ఆర్ ను తిట్టిన దాఖలాలు కనిపించవు అని కూడా గుర్తు చేశారు.
రాయలసీమలో ప్రధానంగా బలిజ (కాపు) నేతలను కాపు కాయడంలో టీడీపీ వ్యవహార సరళిపై చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి కడప జిల్లాలో కడప, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ స్థానాల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగిన కీలక బలజ నేతలకు అడ్డా అనడంలో సందేహం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాతి నుంచి పరిస్థితి తిరగబడినట్టు పరిస్థితి చెప్పకనే చెబుతున్నది.
ఇదో నిదర్శనం
రాయచోటిలో బలిజ (కాపు) సామాజిక వర్గానికి చెంది మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు అజాతశత్రువుగా భావిస్తారు. ఆయన కుటుంబానికి టీడీపీతో 40 ఏళ్ల అనుబంధం ఉంది. రాష్ట్రంలో ముస్లిం జనాభా, ఓటర్లలో మొదటి స్థానంలో ఉన్న రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలు, కాపు సామాజిక వర్గానికి కీలకపాత్ర. వీరితోపాటు కమ్మ కులస్తుల్లో కూడా దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడికి విడదీయలేని అనుబంధం ఉంది.
అజాతశత్రువు
కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలిగిన పాలకొండరాయుడు దివంగత సీఎం వైఎస్ఆర్ తో సత్సంబంధాలు ఉండేవి. ఆ పార్టీ నుంచి టికెట్ దక్కని స్థితిలో పాలకొండరాయుడు 1978లో జనతాపార్టీ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి దివంగత సీఎం వైఎస్ఆర్ తో సన్నిహితంగా మెలిగిన రాయుడుకు 1983లో జరిగిన ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. టీడీపీ ఆవిర్భవించిన 1983లో జరిగిన మొదటి ఎన్నికల్లో స్వత్రంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన రాయుడు సాధించిన విజయంతో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీ. రామారావు దృష్టిని ఆకర్షించింది.
కార్యకర్తల వెంటే...
ఎన్టీఆర్ ప్రభుత్వం బర్త్ రఫ్ జరిగిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారంతా రోడ్లపైకి చరడం మాజీ ఎమ్మెల్యేని కదిలించింది. కార్యకర్తల వెంట వెళ్లి, రోడ్డుపై బైఠాయించిన పాలకొండరాయుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదించిన సంఘటనతో ఆయన అన్నివర్గాల మెప్పుపొందడమే కాదు. అజాతశత్రువులా మార్చింది. దీంతో 1984లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి మాజీ చీఫ్ ఎన్టీరామారావు పిలిచి టికెట్ ఇవ్వడం ద్వారా పోటీ చేయించారు. ఎంపీగా గెలిచిన తరువాత ఢిల్లీకి వెళ్లిన ఆయన, ఎక్కువ సమయం నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య గడపడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఢిల్లీలో తనకు పనిలేదంటూ, రాయచోటి నుంచి వరుసగా 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం వెనుక అన్ని వర్గాల నుంచి ఆదరణ ఉం డడమే అని రాయుడు సన్నిహితులే కాదు. ప్రతిపక్ష నేతలు కూడా చెప్పేమాట. 2009 ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన ప్రత్యక్ష పోటీకి దూరం అయ్యారు.
వారసుడిగా పెద్దకొడుకు
మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు పెద్ద కొడుకు బాలసుబ్రమణ్యం
రాయచోటి రాయుడు వారసుడిగా పెద్దకొడుకు సుబ్రమణ్యం 1995లో రాజకీయ తెరపైకి వచ్చారు. టీడీపీ నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన ఆయన కడప జెడ్పీ వైస్ చైర్మన్ గా కీలక పదవి నిర్వహించారు. 2000 లో టీడీపీ జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. 2001 లో కూడా జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన ఆయన 2012 రాయచోటి ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి ఓటమి చెందిన ఆయనకు ఇన్జార్జిగా కూడా నియమించలేదని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీకి పెద్ద దిక్కుగా, రాయచోటిలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు చనిపోతే కనీసం ఆయన భౌతికకాయానికి నివాళులర్పించడానికి సీఎం రాకపోవడంపై సుగవాసి కుమారులతో పాటు,వారి మద్దతుదారులు కూడా కలత చెందారు. దీనికితోడు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణంగానే పార్టీని వీడినట్టు రాయచోటి రాయుడు కొడుకు బాలసుబ్రమణ్యం ప్రకటించారు. రాయుడు, ఆ తరువాత కొడుకు బాలసుబ్రమణ్యం టీడీపీ రాయచోటి రాజకీయాల్లో ఆయన కీలకపాత్ర నిర్వహించారు. నియోజకవర్గల పునర్విభజన తరువాత లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కావడం వల్ల అక్కడి నుంచి ఆర్. రమేష్ రెడ్డి పోటీగా వచ్చారు. 2014 జరిగిన నుంచి జరిగిన మూడు ఎన్నికల్లో రాయుడు, ఆయన కొడుకు బాలసుబ్రమణ్యంకు టికెట్ దక్కలేదు.
దారి మార్చిన ఎన్నిక
2024 సార్వత్రిక ఎన్నికలు కడప జిల్లాలో ప్రధానంగా రాజంపేట డివిజన్ లో కాపు నేతల రాజకీయ తలరాతలు చెరిపేసింది. రాయచోటి నుంచి మండిపల్లి రాంప్రసాద రెడ్డిని టీడీపీ తెరపైకి తెచ్చింది. రాయుడు కొడుకు బాలసుబ్రమణ్యంకు రాజంపేట ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. టీడీపీ కూటమిలో పొత్తు వల్ల ఈ సీటు బీజేపీకి కేటాయించడంతో రాయుడు కొడుకు బాలసుబ్రమణ్యంను అనివార్యంగా పోటీ చేయించినా, ఓటమి చెందారు. ఇక్కడి నుంచి 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిన మరో బలిజ నేత రైల్వేకోడూరు మాజీ ఎంఎల్సీసీ బత్యాల చంగల్రాయుడుకు చుక్కెదురైంది. దీంతో ఈ నియోజకవర్గాల్లో టీడీపీలోని కాపు నేతల తలరాతను చెరిపేసిందని చెప్పవచ్చు.
ఈ పరిణామంపై బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ,
"నా తరువాత, నీకు ప్రాధాన్యత దక్కకపోవచ్చు. ఆలోచన చేసి, కార్యకర్తలకు ఇష్టమైనట్లు రాజకీయ నిర్ణయాలు తీసుకో" అని జీవించి ఉండగా చెప్పేవారు" అని రాయుడు కొడుకు బాలసుబ్రమణ్యం గుర్తు చేశారు.
"రాజకీయ వైరుధ్యం ఉన్నా, వైఎస్ఆర్ కుటుంబంతో మొదటి నుంచి మాకు అనుబంధం ఉంది" అని బాలసుబ్రమణ్యం చెప్పారు. టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. నన్ను అణగదొక్కడానికే ప్రాధాన్యం ఇచ్చారు" అని సుబ్రమణ్యం ఆరోపించారు. దీంతోనే పార్టీ వీడినట్లు ఆయన వివరణ ఇచ్చారు.
చరిత్ర తిరగరాస్తా..
సుగవాసి పాలకొండ్రాయుడు చిన్న కొడుకు ప్రసాద్ బాబు
రాయుడు ఇద్దరు కొడుకులు బాలసుబ్రమణ్యం, ప్రసాద్ బాబు ఎడముఖం పెడముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇద్దరి రాజకీయ దారులు కూడా వేరుగానే ఉన్నాయి. చిన్న కొడుకు ప్రసాద్ బాబు వ్యవహారం విభిన్నంగా ఉంది. టీడీపీలో ఉన్న ఆయన తండ్రి రాయుడు అనుచరవర్గాన్ని సమీకరించుకునే పనిలో బిజీగా ఉన్నారు. దీనివెనుక ఆంతర్యంపై ఆయన ఏమని చెప్పారంటే..
రాయచోటిలో పాలకొండ రాయుడు 1978లో స్వతంత్రంగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం విపరీతంగా ఉన్నా 2004లో టీడీపీ నుంచి విజయం సాధించారు.
"నా తండ్రి బాటలో నేను కూడా ఆ చరిత్రను తిరగ రాస్తా. టిడిపి టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తా" అని ప్రసాద్ బాబు శపథం చేసిన తరహాలో అనుచరులను కూడగట్టే పనిలో బిజీ అయ్యారు.
ఎవరి వెంట ఎవరు?
రాయచోటిలో రాయుడు ఇద్దరు కొడుకులు తలోదారిలో ప్రయాణిస్తున్నారు. బాలసుబ్రమణ్యం వైసీపీలో చేరితే, ప్రసాద్ బాబు తండ్రి సహచరులు, అభిమానులను కూడగట్టే పనిలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయుడు వర్గంలో గందరగోళం ఏర్పడినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కీలక నేతలు టీడీపీలో ఉన్నప్పటికీ ప్రసాద్ బాబుకు వెన్నుదన్నుగా నిలుస్తారనే మాట వినిపిస్తోంది.
వైసీపీలో పెరిగిన పోరు
రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్ లో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకరే వైసీపీలో చక్రం తప్పేవారు. 2024 ఎన్నికల తరువాత ఆయన చెంత మరో మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ రెడ్డికి తోడుగా టీడీపీ నేత బాలసుబ్రమణ్యం జతయ్యారు. ఈ పరిణామాలు ఎవరికి మేలు చేస్తాయి. టీడీపీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాణిస్తారా? టీడీపీలోనే ఉంటానంటున్న మాజీ ఎమ్మెల్యే సుగవాసి బాలసుబ్రమణ్యం చిన్న కొడుకు ప్రసాద్ బాబుకు అదృష్టం కలిసొస్తుందా? రాయుడు విధేయులు ఈయన వెంట నడుస్తారా? వైసీపీలో మాజీ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది కాలమే సమాధానం చెప్పే సమాధానం కోసం వేచిచూడాల్సిందే