కడప: బాలికను చిదిమేసిన నిందితుడి మృతి
మూడేళ్ల బాలికపై లైంఘిక దాడి చేసి, అనంతరం చంపేశాడు. నిందితుడు కడప జిల్లా మైలవరం డ్యాంలో శవమై తేలాడు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-05 09:43 GMT
మూడేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. ఓ యువకుడు ఆ పాపను చంపేశాడు. వారం తరువాత ఆ నిందితుడు మైలవరం జలాశయంలో శవమై తేలాడు.
బాలికను హత్య చేసిన సంఘటన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం సమీపంలోని కంబాలదిన్నె గ్రామంలో గత నెల 23వ తేదీ జరిగింది. నిందితుడు దూదేకుల రహంతుల్లాకు దేహశుద్ధి చేసి, అదే రోజు స్థానికులు పోలీసులకు అప్పగించారని ప్రచారం జరిగింది.
ఘటన వివరాల్లోకి వెళితే..
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం అమృత్ నగర్ ప్రాంతానికి చెందిన దంపతులు బంధువుల ఇంట జరిగే ఓ శుభకార్యంలో పాల్గొనడానికి మూడేళ్ల కూతురితో జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని కంబాలదిన్నె గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. పెళ్లిఇంటి సందడిగా ఉంది. అదే సమయంలో మూడేళ్ల బాలిక పెళ్లి పందిట్లో ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన దూదేకుల రహంతుల్లా అరటి పండు ఇస్తానని ఆశ చూపించాడు. అమాయకంగా దగ్గరికి వెళ్లిన ఆ పాపను ఎత్తుకుని ఊరి బయటికి వెళ్లాడు. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రాణాలు వదలిన పాప మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేసి, వెళ్లిపోయాడు.
బిడ్డ ఎంతకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. చివరికి ముళ్లపొదల్లో శతమై పడి ఉన్న బిడ్డను చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఎట్టకేలకు పాపపై అత్యాచారం, హత్య చేసిన నిందితుని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారానికి పాలపడింది జమ్మలమడుగు మండలం మోరగుడికి చెందిన రాహంతుల్లా (26)గా గుర్తించారు. అభం శుభం తెలియని చిన్నారిపై ఘోరానికి పాల్పడిన నిందితుడిని తక్షణమే ఎన్ కౌంటర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిందితుడిని మైలవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మొదట్లో చెప్పారు. కాగా, మరుసటి రోజు ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు నిందితుడు రహంతుల్లా ఇంటిని ధ్వంసం చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా గ్రామాన్ని సందర్శించారు. బాధితులను ఓదార్చారు. ఇదిలాఉండగా..
మైలవరం జలాశయంలో శవమై..
బాలికను కిరాతకంగా హత్య చేసిన నిందితుడు అనూహ్యంగా బుధవారం సాయంత్రానికి మైలవరం జలాశయంలో శవమై కనిపించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడిని రహంతుల్లాగా గుర్తించారు. జలాశయం ఒడ్డున రహంతుల్లా దుస్తులు కనిపించాయి. నీటిలో తేలియాడుతున్న శవాన్ని పరిశీలించిన పోలీసులు అత్యాచార ఘటనలో నిందితుడు రహంతుల్లా అని నిర్ధారించారు. మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. శవపరీక్ష తరువాత రహంతుల్లా మృతదేహాన్ని పోలీసులు ట్రాక్టర్ లో మోరగుడిలోని సొంత ఊరికి తీసుకుని వెళ్లారు. తల్లితో పాటు బందువులు కూడా మృతదేహాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో జమ్మలమడుగు మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు.
"సంఘటన జరిగిన రోజే నిందితుడు పారిపోయాడు" అని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ప్రకటించారు.
బాలికపై అత్యాచారం, హత్య చేసిన తరువాత రహంతుల్లా కుటుంబాన్ని గ్రామస్తులు వెలి వేసినట్లు వ్యవహరిస్తున్నారు. వారిని ఎవరూ పట్టించుకోవడం కాదు. కనీసం మాట్లాడడం కూడా లేదని చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో నిందితుడు రహంతుల్లా ఘటన జరిగిన రోజు నుంచే పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతని కోసం గాలిస్తుండగానే, మైలవరం జలాశయంలో శవమై తేలడం కూడా కలకలం రేపింది. మానసిక ఒత్తిడి భరించలేకపోయాడా? తన కుటుంబం అవమానాలకు గురికావడం మరింత ఒత్తిడికి గురై, ఆత్యహత్యకు పాల్పడ్డాడా? అని గ్రామంలో చర్చించుకుంటున్నారు.
ఈ సంఘటనపై మైలవరం ఎస్ఐ బోయ రామకృఫ్ణ మాట్లాడుతూ, " లైంగిక దాడి, హత్యకు పాల్పడిన నిందితుడు రహంతుల్లా పరారీలో ఉన్నాడు" అని చెప్పారు. అతని మరణంపై కూడా విచారణ జరుగుతోందని ఎస్ఐ రామకృష్ణ చెప్పారు.