సైన్స్ ప్రచార సారథులు మౌనం వీడాలి
విజ్ఞానుల మౌనం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని జనవిజ్ఞాన వేదిక హెచ్చరించింది. కార్యక్రమాలు విస్తృతం చేయడానికి రాష్ట్ర మహాసభలు కడపలో నిర్వహించనున్నారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-01 11:17 GMT
ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంచడానికి చదువుకున్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్మ సురేష్ కుమార్ కోరారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్మ సురేష్ కుమార్ మహాసభలో త్వరలో కడపలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మహాభల తరువాత వేదిక కార్యక్రమాలు మరింత పెంచడం ద్వారా మూఢనమ్మకాలు, అశాస్త్రీయ విధానాలపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
"సామాజిక అంశాలు, సైన్స్ పై అవగాహన ఉన్న వారు మౌనంగా ఉన్నారంటే, ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది" అని ఆయన హెచ్చరించారు.
కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ విబిఆర్ కాన్ఫరెన్స్ హాల్లో జన విజ్ఞాన వేదిక కార్యకర్తల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాల ముగింపు సభలో సురేష్ కుమార్ మాట్లాడారు.
అవాస్తవాలు, అశాస్త్రీయ విధానాలు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నాయని, వీటిపై కట్టడి చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా ఉన్నత విజ్ఞానవంతులు కూడా వాట్సాప్ ద్వారా ప్రచారంలోకి వస్తున్న ఆశాస్త్రీయ అంశాలను ఫాక్ట్ చెక్ చేయకుండా నమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన ఉన్న వారు కూడా మౌనంగా ఉండడం వల్ల వాస్తవ అంశాలుగా ప్రచారంలోకి వస్తున్నాయని అన్నారు. ఇది సమాజానికి ఏమాత్రం మంచి చేయదన్నారు.
త్వరలో కడప జిల్లాలో జేవివి రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని నూతన కమిటీ ఎంపిక విధి విధానాలపై చర్చ జరిగిందని ప్రజాస్వామ్య విధముగా ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో జిల్లా మహాసభల ను పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వరాజ్యలక్ష్మి కృష్ణాజి, వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మా రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సుజాత, మీనా, శ్రీరాములు, వీరేష్ చక్రపాణి.జిల్లా ప్రధానకార్యదర్శి ప్రతాప్ రెడ్డి, ధనుంజయ్ పాల్గొన్నారు.