కూటమికి కునుకు లేకుండా చేస్తున్న ‘గ్లాసు’

కూటమికి ‘గ్లాసు’ గుర్తు అతిపెద్ద ప్రమాదంగా మారింది. రాష్ట్రంలో ఆ పార్టీల అంచనాలు తలకిందులు కావడంతో పాటు.. అభ్యర్థుల తలరాతలు కూడా మారే ప్రమాదం ఉంది.

Update: 2024-04-30 11:28 GMT

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ‘గాజు గ్లాసు’ గుర్తు పెను ప్రమాదంగా మారుతుంది. కూటమిని నేతలు గెలుపు దిశగా తీసుకెళ్లడానికి శాయశక్తుల శ్రమిస్తుంటే.. గాజు గ్లాసు మాత్రం వెనక్కి లాగుతోంది. కూటమికి పడే ఓట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపేలా గాజు గ్లాసు గుర్తు పరిస్థితి మారింది. దీంతో కూటమి నేతల గుండెల్లో గాజు గ్లాసు గుబులు పుట్టింది. ఏం చేయాలా అని మూడు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు.

అసలేమైంది!

గాజు గ్లాసు గుర్తును తమ పార్టీకి శాశ్వత గుర్తు తరహాలో ఇవ్వాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. వారికి టీడీపీ మద్దతు ఇస్తుంది. ఈ విషయంపై జనసేన వాళ్లు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు తీర్పు జనసేనకు ఒక విధంగా మద్దతుగానే వచ్చింది. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో జనసేనకు తప్ప మరే ఇతర అభ్యర్థికి గాజు గ్లాసును గుర్తుగా కేటాయించొద్దని న్యాయస్థానం తెలిపింది. అదే విధంగా ఉత్తర్వులు జారీ చేసిన.. ఎన్నికల కమిషన్.. ఇప్పుడు గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌గా పెట్టింది. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు 10 నుంచి 15 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయింది. దీనిపై జనసేన, టీడపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

అసలు సమస్య ఇది!

2024 ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నిశ్చయించుకున్నాయి. అందులో భాగంగానే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అయితే కూటమికి సీట్లు సర్దుబాటు, అభ్యర్థుల ఎన్నికల ఎంత పెద్ద సమ్యగా మారాయో ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు అంతకు మించిన ముప్పుగా మారింది. అసలు కూటమి గెలుపుకే ఎసరు పెట్టేలా మారింది. ఇప్పటికే మూడు పార్టీలు కూడబలుక్కును పొత్తు ధర్మంగా సీట్లను సర్దుబాటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోటు జనసేన, బీజేపీ అభ్యర్థి నిలబడట్లేదు. దీంతో ఓటరు తాను ఓటు వేసే సమయంలో ఆచితూచి పార్టీ గుర్తులను చూసుకుని ఓటు వేయాలి. జనసేనకు ఓటు వేయాలనుకున్నా.. అక్కడ టీడీపీ అభ్యర్థి ఉంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. ఒకవేళ బీజేపీ అభ్యర్థి అయితే కమలం గుర్తుకు వేయాలి. అయితే ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో కూటమిని కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. దీని వల్లు రేపు జరిగే ఎన్నికల్లో గుర్తులు చూసి ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసేనకు ఓటు వేయాలని అనుకుని వచ్చిన వ్యక్తి.. తాను సైకిల్ గుర్తు వేయాలని తెలిసినా.. పక్కనే ఉన్న గాజు గ్లాసు(స్వతంత్ర అభ్యర్థి గుర్తు)ను చూసి గందరగోళానికి గురి కావొచ్చు. ఆ గందరగోళ పరిస్థితిలో వేయాల్సిన అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు వేసే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని కూటమి నేతలు.. ఎన్నికల సంఘానికి వివరించారు. ఈసీ తన నిర్ణయం మార్చుకోకుంటే తాము కోర్టుకు వెళతామని కూడా జనసేన నేతలు చెప్తున్నారు.

శాశ్వత గుర్తు ఎవరికి ఇస్తారు

ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకే శాశ్వత గుర్తు లభిస్తుంది. ఎన్నికల సంఘం గుర్తింపు రావాలంటే ఒక పార్టీకి ఆరుశాతం ఓట్లు రావడంతో పాటు రెండు ఎమ్మెల్యే స్థానాలు కూడా రావాల్సి ఉంది. కానీ 2019 ఎన్నికల్లో జనసేనకు కేవలం 5.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దానికి తోడుగా ఆ పార్టీ తరపున ఒకే ఒక్క అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే విషయాన్ని పెద్దాపురం ఆర్‌డీఓ, రిటర్నింగ్ అధికారి సీతారామారావు చెప్పారు. ‘‘మన దేశంలో 1968 ఆర్డర్స్ ప్రకారం రాజకీయ పార్టీలకు గుర్తుల కేటాయింపు జరుగుతుంది. దాని ప్రకారం కనీసం 5శాతం స్థానాల్లో పార్టీ పోటీ చేస్తే వారికి కామన్ సింబల్ వస్తుంది’’అని వివరించారు. మరి ఈ విషయాలు తెలిసో.. తెలియకనో జనసేన మేధావులు తమకు రికగ్నైజ్‌డ్ గుర్తు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో గాజు గ్లాసును తమకే కేటాయించాలని కోర్టును ఆశ్రయిస్తామని జనసేన నేతలు చెప్తున్నారు.

20 నియోజకవర్గాల్లో స్వతంత్రులకు ‘గ్లాసు’

అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో అన్ రికగ్నైజ్‌డ్ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును గుర్తుగా కేటాయించడం జరిగిందని సమాచారం. వాటిలో.. జగ్గంపేట, అనకాపల్లి పార్లమెంటు, విజయవాడ పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు, మంగళగిరి అసెంబ్లీ, విజయవాడ సెంట్రల్, విజయనగరం అసెంబ్లీ, గన్నవరం అసెంబ్లీ, టెక్కలి అసెంబ్లీ, బాపట్ల అసెంబ్లీ, శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాల్లో జనసేన యేతర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈసీ చర్యలు తమ గెలుపుపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోర్టుకు వెళితే..

అయితే ఈ అంశంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు స్పందించారు. కోర్టుకు వెళ్లడం వల్ల జనసేనకు ఒరిగేదేమీ ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. చెప్పినట్లుగానే వారు కోర్టును ఆశ్రయించినా.. శాశ్వత గుర్తుగా జనసేనకు గాజు గ్లాసును ఎలా ఇస్తారని ప్రశ్నిస్తారని, నిబంధనల ప్రకారమే గుర్తులు కేటాయించినట్లు ఈసీ వివరిస్తుందని, అప్పుడు కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోమని చెప్పే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. అంతేకాకుండా అసలు ఈ అంశంపై జనసేన.. జాతీయ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని చెప్పి పిటిషన్‌ను తిరస్కరించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని

టీడీపీకే ఎక్కువ నష్టం..

గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం ద్వారా జనసేనకన్నా టీడీపీకే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. జనసేన కేవలం 175కు గానూ 21 అసెంబ్లీ స్థానాల్లో, 25కు గానూ 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. అక్కడ జనసేన మినహా మారే ఇతర పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించట్లేదు. టీడీపీ మాత్రం 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పుడు ఇతర స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ద్వారా అక్కడ టీడీపీకి పడే ఓట్లు చీలే ప్రమాదం ఉంది. ఇదే పరిస్థితి ప్రస్తుతానికి దాదాపు 20 స్థానాల్లో నెలకొని ఉంది. ఇది టీడీపీకి భారీ ఎదురు దెబ్బ అవుతుంది. ఇందుకు మదనపల్లి నియోజకవర్గం ఉదాహరణగా నిలుస్తుంది. అందుకనే ఈ గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేనకన్నా.. టీడపీకి అధికంగా ఆందోళనగా ఉందని సన్నిహిత వర్గాలు వచెప్తున్నాయి.

మదనపల్లిలో విచిత్రం

మదనపల్లిలో ‘గ్లాసు’ గుర్తు టీడీపీకి ప్రమాదంగా మారింది. పొత్తులో భాగంగా మదనపల్లి అసెంబ్లీ స్థానం టీడీపీకి వెళ్లింది. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా షేక్ షాజహాన్ బాషా(జాహా) ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. ఈ నియోజకవర్గం టికెట్ ఆశించిన గంగారపు రామ్‌దాస్ చౌదరికి నిరాశ ఎదురైంది. అయితే ఇప్పుడు ఇక్కడ టీడీపీకి స్వతంత్ర అభ్యర్థి తలనొప్పిగా మారారు. ఇదే పేరుతో షాజహాన్ బాషా అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా మనపల్లిలో పోటీకి నామినేషన్ దాఖలు చేయగా అతడికి ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ఇది యాదృచ్చికమో ఏమో కానీ ఇప్పుడు ఈ స్వతంత్ర అభ్యర్థి పోటీ టీడీపీ గెలుపును దూరం చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

జాహాకు రాజకీయ శ్రత్రువులు ఎప్పుడూ వెన్నంటే ఉంటూ వచ్చారు. మిత్రువులే శత్రువులుగా వెంటాడారు. 2004లో కూడా జాహాకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ను కూడా ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇప్పుడు మరోసారి యాదృచ్చికమో, ఎవరిదైనా వ్యూహమో కానీ మరోసారి జాహాకు తన పేరే ఉన్న స్వతంత్ర అభ్యర్థితో ముప్పు ఉన్నట్లు మదనపల్లిలో పరిస్థితులు ఉన్నాయి.

Tags:    

Similar News