రేపు రెంటపాళ్లకు జగన్‌

పల్నాడు జిల్లా పర్యటన ఖరారైనట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.;

Update: 2025-06-17 15:28 GMT

పోలీసుల ఆంక్షల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్‌ మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ మేరకు జగన్‌ పర్యటన ఖరారైనట్లు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనను విడుదల చేసింది.

బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయలుదేరనున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్‌ మండలం రెంటపాళ్లకు చేరుకోనున్నారు. రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకుని మరణించిన వైసీపీ నాయకుడు, రెంటపాళ్ల ఉప సర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఇంటికి చేరుకుంటారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం అదే గ్రామంలో వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అని వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో అధికారికంగా ప్రకటించింది.
రెంటపాళ్లకు జగన్‌మోహన్‌రెడ్డి రావడం ఖాయమని మంగళవారం మధ్యాహ్నం మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వెల్లడించారు. జగన్‌ పర్యటనకు అనుమతులు కోసం పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసిన అనంతరం వారు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. పోలీసులు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో జగన్‌ రెంటపాళ్ల పర్యటనకు వస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి తమకు సంకేతాలు అందాయని వెల్లడించారు. అలా వారు మధ్యాహ్నం వెల్లడించిన తర్వాత రెంటపాళ్ల జగన్‌ పర్యటన ఖరారైనట్లు సాయంత్రం కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించడం గమనార్హం. మరో వైపు జగన్‌ కాన్వాయ్‌తో పాటు మరో మూడు వాహనాలను, జగన్‌తో పాటు మరో 100 మందికి మాత్రమే అనుమతులు ఇస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఇప్పటికే స్పష్టం చేశారు.
Tags:    

Similar News