అసెంబ్లీ సమావేశాలకు జగన్‌ రావాలి: స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లాలో ’పల్లె పండుగ’ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్నారు.

Update: 2024-10-21 12:44 GMT

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావాలని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్‌ వస్తే ఇద్దరం ముచ్చటించుకుంటామన్నారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్‌ను ఆహ్వానిస్తున్నట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. నర్శీపట్నం నాతవరం మండలం పెద్దగొలుగుండపేటలో సోమవారం పల్లెపండుగ కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. రూ.1.4 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నంకు 100 రోజుల్లో రూ.40 కోట్లు తీసుకువచ్చామని వెల్లడించారు. నాతవరం మండలానికి భారీగా నిధులు కేటాయించామని, తాండవ గేటు మరమ్మతు పనులు పూర్తి చేయించామని తెలిపారు. పంట సీజన్‌ ప్రారంభమైన వెంటనే కొత్త గేటు ఏర్పాటు చేయిస్తామన్నారు. పోలవరంపై తాండవ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. తాండవ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం రూ.2,900 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. తాండవ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. నర్సీపట్నంలో ఇసుక అక్రమ నిల్వలను పట్టుకున్నామన్నారు. ఇసుక అక్రమ నిల్వలకు మాజీ ఎమ్మెల్యే బినామీలే కారణమని ఆరోపించారు. ఇసుక అక్రమ నిల్వలకు రూ.18 కోట్ల జరిమానా పడిందన్నారు. గుమ్మడిగొండ, అల్లిపూడిలో ఇసుక తవ్వకాల్లోనూ గత ప్రభుత్వ హయాంలో దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు.


Tags:    

Similar News