న్యాయం కోసం 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా– కానీ..
తాము నిర్దోషి అని నమ్ముతున్న సత్యంబాబుపై మళ్లీ కేసు పెట్టి తమ అభిప్రాయం చెప్పమంటే ఎలా అని షంషాద్ బేగం ప్రశ్నించారు.;
న్యాయం కోసం గత 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని, అయినా విచారణలో తీవ్ర జాప్యం జరుగుతూనే ఉందని ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శనివారం తెనాలిలో మాట్లాడుతూ ఈ కేసులో సత్యంబాబు అనే వ్యక్తి నిర్దోషి అని తాము నమ్ముతున్నట్లు వెల్లడించారు. అయితే నిర్దోషి అని తాము నమ్ముతున్న అదే సత్యంబాబుపై మళ్లీ కేసు పెట్టి మళ్లీ తమను అభిప్రాయం అడగటం ఏంటని షంషాద్ బేగం ప్రశ్నించారు. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో విచారణకు రావాలని నోటీసులు అందినట్లు వెల్లడించారు. కేసు విచారణ ముగిసిందని జూన్లోనే సీబీఐ తన రిపోర్టును సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకు సమర్పించింది, అయితే ఆ రిపోర్టు కాపీలను తమకు ఇవ్వకుండా కేసు గురించి అభిప్రాయాలు చెప్పాలంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు.
నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందనే పేరు కలిగిన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ సీబీఐ కూడా తమ బిడ్డ ఆయేషా మీరాకు న్యాయం చేయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పవిత్రమైన మత సంప్రదాయాలను పక్కన పెట్టి ఆయేషా మీరా రీ పోస్టుమార్టానికి తాము సహకరించామని, ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందిని, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత, డీజీపీలు కూడా దీనిపై స్పందించాలని షంషాద్ బేగం కోరారు.