ఐపీఎస్ ఆంజనేయులుకు మళ్లీ అస్వస్థత
హుటాహుటిన విజయవాడ జీజీహెచ్కు తరలించారు.;
By : The Federal
Update: 2025-05-31 09:18 GMT
విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు మరో సారి తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. బీపీ స్థాయిలు పూర్తిగా పడిపోవడంతో ఇది వరకు అనారోగ్యానికి గురైన పీఎస్ఆర్ ఆంజనేయులు తాజాగా శనివారం మరో సారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పీఎస్ఆర్ ఆంజనేయులుకు బీపీ స్థాయిలో మళ్లీ పడిపోయాయి. దీంతో విజయవాడ జైలు అధికారులు హుటాహుటిన ఆయనను విజయవాడ జీజీహెచ్కు తరలించారు. సాయంత్రం వరకు జీజీహెచ్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆంజనేయులుకు చికిత్సలు అందించనున్నారు,
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో డీజీ ర్యాంకులో ఉన్న పీఎస్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసును తెరపైకి తెచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారులైన కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలతో పాటు ఏసీపీ హనుమంతురావు, సీఐ సత్యనారాయణపై కేసులు నమోదు చేసింది. తర్వాత వారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఇదే కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేసి విజయవాడ జైలుకు తరలించింది. అలా తొలుత కాదంబరి జెత్వానీ కేసులో జైలుకెళ్లిన పీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఏపీపీఎస్సీ కేసును నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు.