డ్రగ్స్ సమాచారం తెలిస్తే 1972కి కాల్ చేయండి
విజయవాడలో ‘డ్రగ్ ఫ్రీ వాక్థాన్’ పేరుతో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు మారథాన్ రన్ను నిర్వహించారు.;
By : The Federal
Update: 2025-06-15 06:34 GMT
సమాజంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరథాన్ రన్ను నిర్వహించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ ఫ్రీ వాక్థాన్’ పేరుతో ఆదివారం విజయవాడలో దీనిని నిర్వహించారు. అందులో భాగంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు మారథాన్ రన్ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐజీ, ఈగల్ టీమ్ హెడ్ రవికృష్ణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ టీమ్ను ఏపీ ప్రభుత్వం ఇది వరకు ఏర్పాటు చేసింది. దీనికి రవికృష్ణ హెడ్గా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అందులో భాగంగా ఈగల్ టీమ్ను ఏర్పాటు చేసిందన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 1972కు ఫోన్ చేసి తెలియజేయాలని రవికృష్ణ కోరారు. ప్రతి తల్లి ఈగల్కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని, అలా ఉంటూ తమ తమ పిల్లలు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలని రవికృష్ణ సూచించారు.
మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితంలో ఎందుకు పనికిరాకుండా పోతారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కొంత మంది అక్రమార్కులు డబ్బు సంపాదించాలనే దురాశతో అమాయక యువకులను డ్రగ్స్, గాంజాయి దందాలోకి దింపి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్, గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఈగల్ టీమ్ను ఏర్పాటు చేసిందన్నారు. మరి ముఖ్యంగా ప్రజల్లో వీటిపైన అవగాహన రావాలన్నారు. నోడ్రగ్స్, నో ఎడిక్షన్ అనేది ప్రతిఒక్కరి నినాదం కావాలన్నారు.
ఇస్కాన్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి వంటి నాశనకరమైన మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి చక్రధార్ పేర్కొన్నారు. మత్తు యువత జీవితాలను చిత్తు చేçస్తుందని చెప్పడానికే ఈ మారథాన్ రన్ నిర్వహించినట్లు చెప్పారు.