ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రతి రోజూ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన పరిపాలన కార్యాలయాన్ని సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తెచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. సమీకరణ విధానాన్ని సక్సెస్ చేసిన చరిత్ర అమరావతి రైతులదే అన్నారు. అమరావతి పనుల రీ–స్టార్ట్ తర్వాత మొదటిగా సీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభమైంది..నాకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి మహిళా రైతులు రోడ్డెక్కి పోరాడారు. అనేక ఉద్యమాలు చేశారు. రైతుల ఉద్యమానికి మద్ధతుగా నేను కూడా జోలె పట్టాను. ఉద్యమానికి అండగా నిలిచానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రైతులు పడిన కష్టాలు మరిచిపోవద్దు. మీరు చేసిన త్యాగాల ఫలితాలను మీరే అనుభవించాలి. నేను దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను అని రైతులకు సీఎం హామీ ఇచ్చారు.
ఫేజ్–1లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చారు. భూములిచ్చినందుకు గత పాలకులు మిమ్మల్ని నానా హింసలు పెట్టారు. రాజధాని ఎడారి అన్నారు. వేశ్యల రాజధాని అన్నారు. ఎంతో అపహాస్యం చేశారు. మీకు రెట్టింపు గౌరవం దక్కేలా...రెట్టింపు ఫలాలు అనుభవించేలా మేము చేస్తాం. హైటెక్ సిటీ నిర్మాణం మొదలు పెట్టే నాటికి అక్కడ ఎకరం రూ. లక్ష ఉండేది... ఇప్పుడు రూ.177 కోట్లకు చేరింది. అమరావతి ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్మిస్తున్నాం. విమర్శలు చేసే వారంతా ఈ విషయాన్ని గమనించాలి. అమరావతి ఓ మునిసిపాలిటీగా మిగిలిపోకూడదంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరం. అమరావతి పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉంటుంది. రైతులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలి. అమరావతి అభివృద్ధికి ఆటంకాలు లేవు.
అమరావతిని క్వాంటం వ్యాలీ చేస్తున్నాం. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. ఒకప్పుడు ఐటీ.. ఇప్పుడు క్వాంటం, డేటా సెంటర్, ఏఐ వంటి టెక్నో రంగాలదే హవా. అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతి రైతుల అభివృద్ధికి అండగా ఉంటాం. హ్యండ్ హోల్డింగ్ ఇస్తాం. ఒకసారి జరిగిన తప్పుకు రైతులు, నేను, రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి. పవన్ కళ్యాణ్, బీజేపీలతో కలిసి ముందుకెళ్తున్నాం మీరంతా సహకరించాలి అని సీఎం కోరారు.
నా ఆలోచన ఎప్పుడూ ప్రజల కోసం...వారి భవిష్యత్ కోసమే. విశాఖలో కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతోంది. దేశానికి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వస్తోంది. రాజధాని అమరావతి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దేశంలోని పవిత్ర దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి మట్టి, జలాలు తెచ్చి శంకుస్థాపన చేశాం. త్వరలో అమరావతి రైతులతో ప్రత్యేకంగా సమావేశం అవుతానని, అమరావతి రైతులను మరిచేదే లేదని, ఎలాంటి అనుమానం అక్కర్లేదని, అందరం కలిసి రాజధానిని అభివృద్ధి చేసుకుందామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సీఆర్డీఏ భవనం ప్రారంభం మన అభివృద్ధి యాత్రకు ఆరంభమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తామని, రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యతను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీసుకోవాలి అని ఆదేశించారు.