ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పట్టి పీడించిన రాక్షసుణ్ని ప్రజలు ఓటు ఆయుధంతో తరిమేశారని, ఎన్డీఏ కూటమిని 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించింది. రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాళి వద్దు. డబుల్ ఇంజన్ సర్కారుతో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందుతోంది. 2019-24 మధ్య ప్రజలెవరూ సంతోషంగా పండుగలే జరుపుకోలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రజలంతా సుఖంగా ఉన్నారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవాలు దసరాతో ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు ఆదా అవుతోంది. దీపావళి పండుగ ఒక సందేశం ఇస్తుంది. నరకాసురుడు సమాజాన్ని అతలాకుతలం చేస్తే శ్రీ కృష్ణుడు ఆ రాక్షుసుణ్ణి వధించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అదే దీపావళిగా జరుపుకుంటున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం
‘15 నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. తల్లికి వందనం, పింఛన్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2 , అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి హామీలన్నీ అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులకు దీపావళి సందర్భంగా ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ ఇస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాం. 4వ తరగతి ఉద్యోగుల గౌరవం పెంచేలా రీ డిజిగ్నేట్ చేస్తాం. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్య సహా ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తున్నాం. తెలుగుజాతి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. మోదీ సారధ్యంలో మనదేశం 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. 2047 నాటికి దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా నిలుస్తుంది ’అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.