ప్రపంచంలోని కొన్ని ప్రఖ్యాత నగరాల్లోనే తిరిగే హాప్–ఆన్ హాప్–ఆఫ్ (çహోహో) బస్సులు త్వరలో విశాఖ రోడ్లపై చక్కర్లు కొట్టనున్నాయి. వైజాగ్ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులను ఈ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు అలరించనున్నాయి. ఆహా! అనిపించేలా ఉండే ఈ హోహో బస్సుల కథా కమామిషు ఏమిటంటే?
విశాఖ రోడ్లపై తిరగనున్న హో హో డబుల్ డెక్కర్లు
ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు వైజాగ్. ఒకపక్క అందాల సాగరతీరం, మరోపక్క పచ్చదనం పరచినట్టు కనిపించే పర్వత శ్రేణులు, కైలాసగిరి సొగసులు, అలనాటి బౌద్ధారామాలు.. ఒకటేమిటి? ఇలాంటివెన్నో విశాఖ వచ్చే వారికి కనువిందు చేస్తాయి. పర్యాటకులను పరవశింపజేస్తాయి. అలాంటి సౌందర్యాలను సొంతం చేసుకున్న విశాఖ సుందరిని చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఎన్నిసార్లు చూసినా తనివీ తీరదు. మరి ఇప్ప
మూడు డబుల్ డెక్కర్లు వస్తున్నాయ్!
విశాఖ వచ్చే పర్యాటకుల కోసం నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు నడపాలన్న ప్రతిపాదన చాన్నాళ్ల నుంచే ఉంది. కానీ ఏవేవో కారణాల వల్ల అది కాగితాలకే పరిమితమైంది తప్ప అడుగు ముందుకు పడలేదు. ఇటీవల మళ్లీ వీటిపై కదలిక వచ్చింది. ప్రాథమికంగా వైజాగ్లో మూడు డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ), పర్యాటక శాఖలు చర్యలు చేపట్టాయి. తొలుత గత మార్చి నెలలో కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఉన్న అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ ఒక డబుల్ డెక్కర్ విద్యుత్ బస్సును రాష్ట్ర ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇచ్చింది. దాని తాళాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు అప్పగించింది. వెనువెంటనే ఆ బస్సును విశాఖలో పర్యాటకుల కోసం కేటాయిస్తున్నట్టు మంత్రి లోకేష్ ప్రకటించారు. తొలుత ఆ డబుల్ డెక్కర్ బస్సును ఈనెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ప్రారంభించాలని జిల్లా అధికారులు భావించారు. అయితే అనివార్య కారణాలతో ప్రస్తుతానికి వాయిదా పడింది. మరోవైపు మరో రెండు మూడు రోజుల్లో మల్లవల్లి నుంచి అశోక్ లేలాండ్ కంపెనీ ఉచితంగా ఇచ్చిన డబుల్ డెక్కర్ బస్సు విశాఖ చేరుకోనుంది.
‘పోర్టు’ నిధులతో మరో రెండు హోహోలు..
వైజాగ్లో మరో రెండు డబుల్ డెక్కర్ (హోహో) బస్సులు సమకూర్చడానికి విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) ముందుకొచ్చింది. ఇందుకు అవసరమైన సొమ్మును కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) నిధులను వెచ్చించనుంది. దీంతో ఆ రెండు బస్సుల డిజైన్, తయారీకి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ జీవీఎంసీ గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున టెండర్లను ఆహ్వానించింది. టెండర్లు ఖరారయ్యాక ఈ బస్సులు తయారీ మొదలవుతుంది. డిజైన్, నిర్మాణం పూర్తి చేసుకున్నాక విశాఖ చేరుకుంటాయి.
హోహోలు ఎక్కడెక్కడ ఉన్నాయి?
ఈ హాప్–ఆన్ హాప్–ఆఫ్ (హోహో) బస్సులు ప్రపంచంలో పేరున్న నగరాల్లో పర్యాటకుల కోసం నడుపుతున్నారు. వీటిని లండన్, పారిస్, న్యూయార్క్, ఏథెన్స్, రోమ్, టోక్యో, బార్సిలోనా, పటాయా వంటి నగరాలతో పాటు దేశంలోని ఢిల్లీ, ముంబై, గోవా, బెంగళూరు వంటి పర్యాటక ప్రాధాన్యత ఉన్న నగరాల్లో తిప్పుతున్నారు. దేశంలో ప్రఖ్యాత పర్యాటక నగరంగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖలోనూ ఈ హోహో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశ పెడుతున్నారు. ఈ బస్సుల నిర్మాణమే ప్రత్యేకంగా ఉంటుంది. కింద, పైన రెండంతస్తులుంటాయి. వీటికి అద్దాల అమరిక ఉంటుంది. దిగువన కూర్చున్న వారు అద్దాల్లోంచి, పైన డెక్పై కూర్చున్న వారు ఓపెన్ ఎయిర్ నుంచి చూసేలా సీట్లను అమరుస్తారు. వాటిపై ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మైమరచిపోయేలా వీటి డిజైన్ను రూపొందిస్తారు.
ఇవి ఎక్కడకెక్కడ తిరుగుతాయంటే..?
త్వరలో అందుబాటులోకి రానున్న ఈ డబుల్ డెక్కర్ బస్సులను విశాఖ నగరంలో ప్రముఖ సందర్శనీయ స్థలాల మీదుగా నడపాలని అధికారులు యోచిస్తున్నారు. సాగర తీరంలోని ఐఎన్ఎస్ కురుసుర సబ్మెరైన్ మ్యూజియం, టీయూ–142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, సీ హారియర్ హెలికాప్టర్ మ్యూజియం, ఆర్కే బీచ్, కైలాసగిరి, డాల్ఫిన్నోస్, తెన్నేటి పార్కు, రుషికొండ బీచ్, తొట్లకొండ, బావికొండ, భీమునిపట్నంలోని 17వ శాతాబ్దం నాటి బుద్ధిస్ట్ టౌన్షిప్, భీమిలి బీచ్, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు, ఎర్రమట్టి దిబ్బలు వంటి వాటిని సందర్శించేలా ఈ బస్సులను నడపాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిని ఏఏ ప్రాంతాల్లో నడపాలన్న దానిపై విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ నిర్ణయం తీసుకుంటారని పర్యాటక శాఖ ఇన్చార్జి రీజనల్ డైరెక్టర్ జి.జగదీష్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధికి చెప్పారు. కాగా ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో పర్యాటక ప్రదేశాలను, వాటి విశిష్టతలను తెలియజేసేందుకు గైడ్లు కూడా ఉంటారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే ఉంటుంది. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారికే కాదు.. స్థానికులను కూడా ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఎంతగానో ఆకర్షిస్తాయని భావిస్తున్నారు.
ఏటా కోటిన్నరకు పైగా పర్యాటకులు..
విశాఖ మహా నగరానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. అది ఏటికేడాది పెరుగుతోంది. ఏటా కోటిన్నర మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అత్యధికంగా పర్యాటకులు పోటెత్తుతుంటారు. వీరంతా నగరం, పరిసరాల్లోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. దానిని దృష్టిలో ఉంచుకుని త్వరలో ప్రవేశపెట్టనున్న డబుల్ డెక్కర్ హో హో బస్సులను ఆయా రూట్లలో నడపనున్నారు.